వినాయక నమోస్తుతే! - 5
------------------------------
రచన :- గురుమంచి రాజేంద్రశర్మ
మన అభివృద్ధిని నిరోధించే విఘ్నాలలో మరొకటి కాలయాపనం .
5. కాలయాపనం
-------------------------
ఈ " కాలయాపనం " అనే విఘ్న బీజం మన దేశంలో ఎక్కువ మందిలో కనిపిస్తూ వుంటుంది.
కాలయాపనం అంటే " పనులను వాయిదా వేయడం".
సమయం అందరికి సమానమే అయినా కొంత మంది మాత్రమే తన సమయాన్ని అవసరమూ, ఉపయోగకరమైన పనులు చేయడానికే ఉపయోగిస్తారు. వీరు అభివృద్ధిలో మిగతా వారి కంటే ముందుంటారు.
చాలా మంది అనవసర కాలక్షేపం కోసం సమయం కేటాయిస్తారు.ఈ విధంగా అనవసర కాలక్షేపం చేసేవారు అభివృద్ధి విషయంలో విఘ్నాలను ఎదుర్కుంటారు.
" కాలయాపనం " అనే విఘ్న బీజం కలిగిన వ్యక్తి అన్ని విషయాలను ఆలస్యం చేస్తూ సమయాన్ని దుర్వినియోగం చేస్తుంటాడు.
" మన అంతరంలో ఉన్న స్వభావాన్ని బట్టే మనకు జరిగే సంఘటనలు ఉంటాయి. "
స్వభావాలు అనేవి బీజాలైతే.. జరిగే సంఘటనలు అనేవి వాటి ఫలాలు.
పనులను వాయిదా వేసే స్వభావం ఉన్నవారికి జరగవలసిన శుభాలు కూడా వాయిదా పడుతుంటాయి.
ఈ కాలయాపనం అనే విఘ్నం నాలుగు రకాలు.
1) శారీరకం
2) మానసికం
3) బౌద్ధికం
4) ఆథ్యాత్మికం
ఈ నాలుగు రకాల కాలయాపనలు కూడా అభివృద్ధికి అతి పెద్ద ఆటంకాలు.వాటి గూర్చి కొంత వివరంగా తెలుసుకుందాం!
1) శారీరకం
-------------------
"శరీరంతో చేయవలసిన అవసరమూ, ఉపయోగకరమైన పనుల పట్ల ఏకాగ్రత లేకపోవడం వల్ల పనులను వాయిదా వేయడం" - ఈ శారీరక విభాగంలోకి లోకి వస్తుంది.
మన అభివృద్ధికి అవసరమైన 50% విషయాలు ఇందులోనే ఉంటాయి.
నిజానికి ఎవరికైనా మొదటి అవసరమూ, ప్రాధాన్యత ... ఆరోగ్యమే!
కాని, ఆరోగ్యంగా ఉండడానికి చేయవలసిన వాకింగ్ - వ్యాయామం - ఆరోగ్యకరమైన ఆహారం - ఆరోగ్యకర నిద్ర.. మొ|| వాటి విషయం లోని ఆచరణను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటాము. దీని వల్ల భవిష్యత్తులో ఆరోగ్యం విషయంలో విఘ్నాలు ఏర్పడి,అది మిగతా అన్ని రకాల అభివృద్ధి పై ప్రభావం చూపిస్తుంది.
ఇది కారులో ప్రయాణం చేస్తూ అత్యవసర తొందర ఉండడం వల్ల కారులో ఇంధనం ( పెట్రోలు.. etc.. Fuel) మరిచిపోవడం లాంటిది.
ఇంకా ఇందులో ...
మన అభివృద్ధి కీ, అదనపు ఆదాయం కోసం శరీరంతో వెంటనే అమలు చేయవలసిన పనులను వాయిదా వేయడం ...
ఇంటికి అవసరమైన పనులూ - రిపేర్లు వాయిదా వేయడం ...
తాను గానీ, తన పిల్లలు గానీ శరీరంతో నేర్చుకునే డ్రైవింగ్ - స్విమ్మింగ్ లాంటి పనులను వాయిదా వేయడం ...
.... ఇలా చివరకు సమయానికి నిద్ర లేవకపోవడం - తినకపోవడం - స్నానం చేయకపోవడం - పడుకోకపోవడం వంటి అనేక విషయాలు ఈ విభాగంలోకే వస్తాయి.
ఇది క్రియాశక్తికి సంబంధించినది.క్రియాశక్తిని భారతీయ తాత్వికులు లక్ష్మీదేవి అని పిలుస్తారు.
ఈ శారీరక కాలయాపనం చేసే విఘ్న బీజం వల్ల ఆర్థిక అభివృద్ధి - కీర్తివృద్ధితో సహా అన్ని రకాల ఎదుగుదలలు (అష్టలక్ష్మీ ప్రసాదించే ఐశ్వర్యాలు ) తగ్గిపోతుంటాయి.
2) మానసికం
-------------------
ప్రధానంగా ఇందులో కుటుంబ సభ్యులతో, బంధువులతో, మిత్రులతో, సమాజంతో మానసిక బంధాలను వృద్ధిపరుచు కోవడాన్ని వాయిదా వేస్తుంటాము.
కాని, నిజంగా కష్టాలు వచ్చినపుడుగానీ, విజయాన్నీ పొందే సంధర్భంలో కాని అండగా నిలబడేది వీరే.
ఇది "బాగాలేని టైర్లు కలిగిన కారులో
దూర ప్రాంతానికి ప్రయాణించడం లాంటిది."
3) బౌద్ధికం
------------------
ఇందులో అవసరమూ -
ఉపయోగకరమైన జ్ఞానసంబంధ
విషయాలు నేర్చుకోవడాన్ని వాయిదా వేస్తుంటాము.
కొంత మంది " పుస్తక పఠనం " వల్ల ఏం లాభం? అనుకుంటారు.
" ఒక మనిషి తన జీవితంలో సాధించిన అనుభవ జ్ఞానాన్ని ఒక మంచి పుస్తకం
అందిస్తుంది."
ఆ అనుభవ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం వల్ల మన జీవితంలో ఎంతో సమయం సద్వినియోగమై మనం అభివృద్ధి మార్గంలో మరింత ముందుకు వెళ్లగలుగుతాము !
తాత్వికంగా పరిశీలిస్తే ..
జ్ఞానం పెరిగినా కొద్ది తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని సాధిస్తుంటాము. అంటే శ్రమ చేసే అవసరం తగ్గుతుంది.
"నేను ఎంత శ్రమ పడినా ఫలితం ఉండడం లేదు" అని ఎవరైనా భావిస్తున్నారంటే వారు జ్ఞానాన్నీ వాయిదా వేస్తున్నారనే అర్థం.
శ్రమించడాన్ని మానకుండా జ్ఞానాన్ని పెంచుకుంటున్నా కొద్ది మనిషి అభివృద్ధి స్థాయి కూడా పెరుగుతుంది.
ఈ రకం కాలయాపన అనేది..
" బాగా రిపేర్లు అవసరమైన కారులో దూర ప్రయాణం చేయడం లాంటిది."
4) ఆథ్యాత్మికం
---------------------
నిజానికి ఆథ్యాత్మికం అంటే "తన గురించి తాను తెలుసుకోవడం".
ఒక సాధకుడు తన గురించి తాను తెలుసుకుంటూ వెళ్లినా లేదా భగవంతుని గూర్చి తెలుసుకుంటూ వెళ్లినా చేరుకునే గమ్య స్థానం ఒక్కటే!
వేదంలో తన గురించి తాను తెలుసుకోవాలని అంతర్ముఖుడై తపస్సు చేసిన ఒక బుుషి సత్యాన్ని దర్శించిన తరువాత ఆనందంతో ఇలా గానం చేస్తాడు.
" హ➡ ఉ, హ➡ ఉ, హ➡ ఉ, "
అంటూ...
సంస్కృతంలో " అహమ్ "అంటే నేను అని అర్థం.
సత్యాన్ని దర్శించిన తరువాత " అహమ్ " లోని "హ ''అక్షరం "ఉ" గా మారిందట!
అంటే..
అహం = అ+ హ+ మ్➡ అ+ ఉ+మ్➡ ఓమ్
కాబట్టి తన గూర్చి తాను తెలుసుకోవడమన్నా, భగవంతుని గూర్చి తెలుసుకోవడమన్నా ఒకటే!
మనిషి ఆథ్యాత్మిక సాధనలను వాయిదా వేయ్యకుండా చూసుకోవాలి.
దీని వల్ల మన ప్రమేయం ఉన్నా,లేకున్నా మనకు అంటుతూ ఉండే అపవిత్రతల నుండి బయటపడతాము.
ఏ మనిషైనా తాను ఏ విషయాలపై ఏకాగ్రత చూపుతున్నాడు, ఏ విషయాలలో లీనమౌతున్నాడు అనే దాన్ని బట్టి అతని అభివృద్ధి ఉంటుంది.
1.కొందరు ఆహారం, నిద్ర, అనవసరవిందులు, అనవసర కాలక్షేపాలు, అధర్మకామం.. మొ|| వాటిలో తీవ్రమైన ఏకాగ్రతను చూపుతూ లీనమై తనను తాను మరచి పోతుంటారు.
2.కొందరు ఆవేశాలు, కోపం, దు:ఖం, రాగం, ద్వేషం.. మొ|| వాటిలో తీవ్రమైన ఏకాగ్రతను చూపుతూ లీనమై తనను తాను మరచి పోతుంటారు.
3.కొందరు డబ్బు, కీర్తి, అధికారం, హోదా... మొ॥ వాటిలో తీవ్రమైన ఏకాగ్రతను చూపుతూ లీనమై తనను తాను మరచి పోతుంటారు.
4. మరి కొందరు జ్ఞానసంబంధ విషయాలలో లేదా కళా సంబంధ విషయాలలో తీవ్రమైన ఏకాగ్రతను చూపుతూ లీనమై తనను తాను మరచి పోతుంటారు.
5.ఇంకా కొందరు భగవత్ భక్తిలో తీవ్రమైన ఏకాగ్రతను చూపుతూ లీనమై తనను తాను మరచి పోతుంటారు.
6.చాలా కొద్ది మంది తనను తాను మరచిపోకుండా ఎప్పుడూ కాన్సియస్ గా ఉంటారు.అంటే తన కాన్సియస్ మీదనే ఏకాగ్రతను కలిగి ఉంటారు.
ఏకాగ్రత శక్తి వృద్ధి చెందుతున్న కొద్ది మనిషి ఒక స్థితి నుండి తరువాత స్థితికి ఎదుగుతాడు. ఈ ఆరు రకాల ఏకాగ్రతలలో ఒకదానికన్న తరువాత వచ్చేది ఉత్తమం.
మొత్తం మీద ఆథ్యాత్మిక శక్తి పెంచుకోవడం అంటే కాన్సియస్ గా ఉండే స్థితిని పెంచుకోవడమే!
ఈ కాలయాపనం..
"ఎలాంటి వాహనం, రక్షణ , చిరునామా లేకుండా అతి కష్టమైన సదూర ప్రయాణానికి కాలినడకన బయలు దేరడం లాంటిది."
క్రియాశీలుడైన వ్యక్తి అన్ని రకాల కాలయాపనల స్వభావాలను తొలగించుకుంటూ ప్రతీక్షణం సన్నద్ధంగా ఉండాలి.అప్పుడు అతని వెంట శుభాలు పరుగులు తీస్తాయి .
ఈ "కాలయాపనం" అనే విఘ్న బీజం వల్ల చాలా మంది అభివృద్ధి విషయంలో ఆటంకాలను ఎదుర్కుంటారు.
.
ఈ విఘ్న బీజం తొలగడానికి ప్రతి రోజు బ్రాహ్మీ ముహుర్తంలో లేదా సాయం సంధ్యా సమయంలో స్నానం చేసి వేయి సార్లు "ఓం శ్రీం హ్రీం క్లీం శీఘ్రకారిణే నమ: " అనే గణపతి మంత్రాన్ని మనసులో అత్యంత ఏకాగ్రతగా జపించాలి.
స్వస్తి .
(మరో రోజు గణపతి తొలగించే మరో విఘ్నం గూర్చి తెలుసుకుందాము.)
దంతకల్పలతా పాశరత్న కుంభాంకుశోజ్జ్వలమ్ |
బంధూకకమనీయాభం ధ్యాయేత్ క్షిప్రగణాధిపమ్ ||
(ఓపికగా చదివిన వారికి )
ధన్యవాదములతో
గురుమంచి రాజేంద్రశర్మ