Showing posts with label రెమిడీలు. Show all posts
Showing posts with label రెమిడీలు. Show all posts

Friday, 9 September 2016

కాలయాపనం అనే విఘ్నాన్ని తొలగించే మహాగణపతి


వినాయక నమోస్తుతే! - 5


------------------------------





రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

మన అభివృద్ధిని నిరోధించే విఘ్నాలలో మరొకటి కాలయాపనం .

5. కాలయాపనం

-------------------------

ఈ " కాలయాపనం " అనే విఘ్న బీజం మన దేశంలో ఎక్కువ మందిలో కనిపిస్తూ వుంటుంది.

కాలయాపనం అంటే " పనులను వాయిదా వేయడం".

సమయం అందరికి సమానమే అయినా కొంత మంది మాత్రమే తన సమయాన్ని అవసరమూ, ఉపయోగకరమైన పనులు చేయడానికే ఉపయోగిస్తారు.  వీరు అభివృద్ధిలో మిగతా వారి కంటే ముందుంటారు.

చాలా మంది అనవసర కాలక్షేపం కోసం సమయం కేటాయిస్తారు.ఈ విధంగా అనవసర కాలక్షేపం చేసేవారు అభివృద్ధి విషయంలో విఘ్నాలను ఎదుర్కుంటారు.

" కాలయాపనం " అనే విఘ్న బీజం కలిగిన వ్యక్తి అన్ని విషయాలను ఆలస్యం చేస్తూ సమయాన్ని దుర్వినియోగం చేస్తుంటాడు.

" మన అంతరంలో ఉన్న స్వభావాన్ని బట్టే మనకు జరిగే సంఘటనలు ఉంటాయి. "

స్వభావాలు అనేవి బీజాలైతే.. జరిగే సంఘటనలు అనేవి వాటి ఫలాలు.

పనులను వాయిదా వేసే స్వభావం ఉన్నవారికి  జరగవలసిన శుభాలు కూడా వాయిదా పడుతుంటాయి.

ఈ కాలయాపనం అనే విఘ్నం నాలుగు రకాలు.
1)  శారీరకం
2) మానసికం
3) బౌద్ధికం
4) ఆథ్యాత్మికం

ఈ నాలుగు రకాల కాలయాపనలు కూడా అభివృద్ధికి అతి పెద్ద ఆటంకాలు.వాటి గూర్చి కొంత వివరంగా తెలుసుకుందాం!

1) శారీరకం 
-------------------
"శరీరంతో చేయవలసిన అవసరమూ, ఉపయోగకరమైన పనుల పట్ల ఏకాగ్రత లేకపోవడం వల్ల పనులను వాయిదా వేయడం" - ఈ శారీరక విభాగంలోకి లోకి వస్తుంది.

మన అభివృద్ధికి అవసరమైన 50% విషయాలు ఇందులోనే ఉంటాయి.

నిజానికి ఎవరికైనా మొదటి అవసరమూ, ప్రాధాన్యత ... ఆరోగ్యమే!

కాని, ఆరోగ్యంగా ఉండడానికి చేయవలసిన వాకింగ్ - వ్యాయామం - ఆరోగ్యకరమైన ఆహారం - ఆరోగ్యకర నిద్ర.. మొ|| వాటి విషయం లోని ఆచరణను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటాము. దీని వల్ల భవిష్యత్తులో ఆరోగ్యం విషయంలో విఘ్నాలు ఏర్పడి,అది మిగతా అన్ని రకాల అభివృద్ధి పై ప్రభావం చూపిస్తుంది.

ఇది కారులో ప్రయాణం చేస్తూ అత్యవసర తొందర ఉండడం వల్ల కారులో ఇంధనం ( పెట్రోలు.. etc.. Fuel) మరిచిపోవడం లాంటిది.

ఇంకా ఇందులో ...
మన అభివృద్ధి కీ, అదనపు ఆదాయం కోసం శరీరంతో  వెంటనే అమలు చేయవలసిన పనులను వాయిదా వేయడం ...
ఇంటికి అవసరమైన పనులూ - రిపేర్లు వాయిదా వేయడం ...
తాను గానీ, తన పిల్లలు గానీ శరీరంతో నేర్చుకునే డ్రైవింగ్ - స్విమ్మింగ్ లాంటి పనులను వాయిదా వేయడం ...
.... ఇలా చివరకు సమయానికి నిద్ర లేవకపోవడం - తినకపోవడం - స్నానం చేయకపోవడం - పడుకోకపోవడం వంటి అనేక విషయాలు ఈ విభాగంలోకే వస్తాయి.

ఇది క్రియాశక్తికి సంబంధించినది.క్రియాశక్తిని భారతీయ తాత్వికులు లక్ష్మీదేవి అని పిలుస్తారు.

ఈ శారీరక కాలయాపనం చేసే విఘ్న బీజం వల్ల ఆర్థిక అభివృద్ధి - కీర్తివృద్ధితో సహా అన్ని రకాల ఎదుగుదలలు (అష్టలక్ష్మీ ప్రసాదించే ఐశ్వర్యాలు ) తగ్గిపోతుంటాయి.

2) మానసికం 
-------------------
ప్రధానంగా ఇందులో కుటుంబ సభ్యులతో, బంధువులతో, మిత్రులతో, సమాజంతో మానసిక బంధాలను వృద్ధిపరుచు కోవడాన్ని వాయిదా వేస్తుంటాము.

కాని, నిజంగా కష్టాలు వచ్చినపుడుగానీ, విజయాన్నీ పొందే సంధర్భంలో కాని అండగా నిలబడేది వీరే.

ఇది "బాగాలేని టైర్లు కలిగిన కారులో
దూర ప్రాంతానికి ప్రయాణించడం లాంటిది."

3) బౌద్ధికం 
------------------
ఇందులో అవసరమూ -
ఉపయోగకరమైన జ్ఞానసంబంధ
విషయాలు నేర్చుకోవడాన్ని వాయిదా వేస్తుంటాము.

కొంత మంది " పుస్తక పఠనం " వల్ల ఏం లాభం? అనుకుంటారు.

" ఒక మనిషి తన జీవితంలో సాధించిన అనుభవ జ్ఞానాన్ని ఒక మంచి పుస్తకం
అందిస్తుంది."

ఆ అనుభవ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం వల్ల మన జీవితంలో ఎంతో సమయం సద్వినియోగమై మనం అభివృద్ధి మార్గంలో మరింత ముందుకు వెళ్లగలుగుతాము !

తాత్వికంగా పరిశీలిస్తే ..
జ్ఞానం పెరిగినా కొద్ది తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని సాధిస్తుంటాము. అంటే శ్రమ చేసే అవసరం తగ్గుతుంది.

"నేను ఎంత శ్రమ పడినా ఫలితం ఉండడం లేదు" అని ఎవరైనా భావిస్తున్నారంటే వారు జ్ఞానాన్నీ వాయిదా వేస్తున్నారనే అర్థం.

శ్రమించడాన్ని మానకుండా జ్ఞానాన్ని పెంచుకుంటున్నా కొద్ది మనిషి అభివృద్ధి స్థాయి కూడా పెరుగుతుంది.

ఈ రకం కాలయాపన అనేది..
" బాగా రిపేర్లు అవసరమైన కారులో దూర ప్రయాణం చేయడం లాంటిది."

4) ఆథ్యాత్మికం
---------------------
   
     నిజానికి ఆథ్యాత్మికం అంటే "తన గురించి తాను తెలుసుకోవడం".

ఒక సాధకుడు తన గురించి తాను తెలుసుకుంటూ వెళ్లినా లేదా భగవంతుని గూర్చి తెలుసుకుంటూ వెళ్లినా చేరుకునే గమ్య స్థానం ఒక్కటే!

వేదంలో తన గురించి తాను తెలుసుకోవాలని అంతర్ముఖుడై తపస్సు చేసిన ఒక బుుషి సత్యాన్ని దర్శించిన తరువాత ఆనందంతో ఇలా గానం చేస్తాడు.

" హ➡ ఉ, హ➡ ఉ, హ➡ ఉ, "
అంటూ...

సంస్కృతంలో " అహమ్ "అంటే నేను అని అర్థం.

సత్యాన్ని దర్శించిన తరువాత " అహమ్ " లోని "హ ''అక్షరం "ఉ" గా మారిందట!

అంటే..

అహం = అ+ హ+ మ్➡ అ+ ఉ+మ్➡ ఓమ్

కాబట్టి తన గూర్చి తాను తెలుసుకోవడమన్నా, భగవంతుని గూర్చి తెలుసుకోవడమన్నా ఒకటే!

మనిషి ఆథ్యాత్మిక సాధనలను వాయిదా వేయ్యకుండా చూసుకోవాలి.

దీని వల్ల మన ప్రమేయం ఉన్నా,లేకున్నా మనకు అంటుతూ ఉండే అపవిత్రతల నుండి బయటపడతాము.

ఏ మనిషైనా తాను ఏ విషయాలపై ఏకాగ్రత చూపుతున్నాడు, ఏ విషయాలలో లీనమౌతున్నాడు అనే దాన్ని బట్టి అతని అభివృద్ధి ఉంటుంది.

1.కొందరు ఆహారం, నిద్ర, అనవసరవిందులు, అనవసర కాలక్షేపాలు, అధర్మకామం.. మొ|| వాటిలో తీవ్రమైన ఏకాగ్రతను చూపుతూ లీనమై తనను తాను మరచి పోతుంటారు.

2.కొందరు ఆవేశాలు, కోపం, దు:ఖం, రాగం, ద్వేషం.. మొ|| వాటిలో తీవ్రమైన ఏకాగ్రతను చూపుతూ లీనమై తనను తాను మరచి పోతుంటారు.

3.కొందరు డబ్బు, కీర్తి, అధికారం,  హోదా... మొ॥ వాటిలో తీవ్రమైన ఏకాగ్రతను చూపుతూ లీనమై తనను తాను మరచి పోతుంటారు.

4. మరి కొందరు జ్ఞానసంబంధ విషయాలలో లేదా కళా సంబంధ విషయాలలో  తీవ్రమైన ఏకాగ్రతను చూపుతూ లీనమై తనను తాను మరచి పోతుంటారు.

5.ఇంకా కొందరు భగవత్ భక్తిలో తీవ్రమైన ఏకాగ్రతను చూపుతూ లీనమై తనను తాను మరచి పోతుంటారు.

6.చాలా కొద్ది మంది తనను తాను మరచిపోకుండా ఎప్పుడూ కాన్సియస్ గా ఉంటారు.అంటే తన కాన్సియస్ మీదనే ఏకాగ్రతను కలిగి ఉంటారు.

ఏకాగ్రత శక్తి వృద్ధి చెందుతున్న కొద్ది మనిషి ఒక స్థితి నుండి తరువాత స్థితికి ఎదుగుతాడు. ఈ ఆరు రకాల ఏకాగ్రతలలో ఒకదానికన్న తరువాత వచ్చేది ఉత్తమం.

మొత్తం మీద ఆథ్యాత్మిక శక్తి పెంచుకోవడం అంటే కాన్సియస్ గా ఉండే స్థితిని పెంచుకోవడమే!

ఈ కాలయాపనం..
"ఎలాంటి వాహనం, రక్షణ , చిరునామా లేకుండా అతి కష్టమైన సదూర ప్రయాణానికి కాలినడకన బయలు దేరడం లాంటిది."

క్రియాశీలుడైన వ్యక్తి అన్ని రకాల కాలయాపనల స్వభావాలను తొలగించుకుంటూ ప్రతీక్షణం సన్నద్ధంగా ఉండాలి.అప్పుడు అతని వెంట శుభాలు పరుగులు తీస్తాయి .

ఈ "కాలయాపనం" అనే విఘ్న బీజం  వల్ల చాలా మంది అభివృద్ధి విషయంలో ఆటంకాలను ఎదుర్కుంటారు.
.
ఈ విఘ్న బీజం తొలగడానికి ప్రతి రోజు బ్రాహ్మీ ముహుర్తంలో లేదా సాయం సంధ్యా సమయంలో స్నానం చేసి వేయి సార్లు "ఓం శ్రీం హ్రీం క్లీం శీఘ్రకారిణే నమ: " అనే గణపతి మంత్రాన్ని మనసులో అత్యంత ఏకాగ్రతగా జపించాలి.



                 స్వస్తి .

(మరో రోజు గణపతి తొలగించే మరో విఘ్నం గూర్చి తెలుసుకుందాము.)

దంతకల్పలతా పాశరత్న కుంభాంకుశోజ్జ్వలమ్ |
బంధూకకమనీయాభం ధ్యాయేత్ క్షిప్రగణాధిపమ్ ||

                 (ఓపికగా చదివిన వారికి )
                       ధన్యవాదములతో

           గురుమంచి రాజేంద్రశర్మ





Wednesday, 7 September 2016

మహాగణపతి తొలగించే మరోవిఘ్నం - అవిరతి

వినాయక నమోస్తుతే! - 4

------------------------------




రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

మన అభివృద్ధిని నిరోధించే విఘ్నాలలో మరొకటి అవిరతి.

4. అవిరతి

(1. బిజీగా ఉన్నాననుకోవడం. 
మరియు 
2. నిగ్రహం లేకపోవడం)
---------------------------------------------

సంస్కృతంలో " అవిరతి " అనే శబ్దానికి రెండు రకాల అర్థాలు ఏర్పడుతున్నాయి.

1. " విరతి " అంటే విరామం..
" అవిరతి " అంటే విరామం లేనంత 'బిజి'గా ఉన్నాననుకోవడం...

2. " రతి " అంటే ఆసక్తి.
   " విరతి " అంటే ఆసక్తి లేకపోవడం.
" అవిరతి " అంటే ఆసక్తిని వదలకపోవడం (మనో నిగ్రహం లేకపోవడం)

ఈ రెండు విషయాలు కూడా అభివృద్ధి విషయంలో ఆటంకాలే!

కొంతమంది ఎప్పుడూ "బిజి" గా , హడావుడిగా ఉంటారు.
ఉదయం 6.30 కు నిద్ర లేవడం - 45 ని॥టాయిలెట్ , స్నానం - మరో అరగంట పేపర్ చదవడం - తరువాత టిఫిన్ చేసి ఆఫీస్ కు ప్రయాణం - 8 నుండి 9 వరకు ఒక గంట ప్రయాణం - 9 am నుండి 5 pm వరకు ఆఫీస్ - 5 pm నుండి 6 pm తిరుగు ప్రయాణం - మరో గంట స్నేహితులతో గడపడం - ఇంటికి వచ్చి అరగంట ఫ్రెషప్ కావడం - భోజనం - ఒక గంట TV చూస్తూ రిలాక్స్ కావడం - తరువాత నిద్ర.

చిన్న చిన్న మార్పులతో దాదాపు ఇలాంటి దినచర్య తో రోజంతా బిజీగా ఉంటారు. 

మానసికంగానేమో "ఉదాసీనత " లేదా " ఓత్తిడి "ని కలిగి ఉంటారు.దేనికైనా "టైం లేదు " అంటూంటారు.

అభివృద్ధి మాత్రం ఎక్కడున్నది అక్కడే ఉంటుంది.

ఒకసారి గొప్ప వారిగా ఎదిగిన వారి దినచర్యను మనం గమనిస్తే.. వారు ఎన్నో పనులు చేస్తూ కూడా ఇంకా సమయాన్ని మిగల్చుకుని తమ తమ అభిరుచులకు అనుగుణంగా ఆ సమయాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు.

ఎక్కడుంది తేడా !

అదే " క్రియాశీలత ''

క్రియాశీలుడైన వ్యక్తి ఉత్సాహం, క్రొత్తదనం, సన్నద్ధత కలిగిన మనసుతో ఎన్నో పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ తిరిగి ఆ పనుల నుండే మళ్లి మళ్లి ప్రేరణ పొందుతూ మానసికంగా "నవ యువకుడు"గా ఉంటాడు.

ఆరోగ్య పరంగా, కీర్తిపరంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, వ్యక్తిత్వ పరంగా, ఆథ్యాత్మికంగా .... ఇలా అన్ని రకాల అభివృద్ధి కోసం సమయాన్ని కేటాయించుకుంటూ నిరంతరం సాధన చేయడం అవసరం. అప్పుడే జీవితంలోని మాధుర్యం అర్థమౌతుంది.

సనాతన ధర్మం నిర్వచించే "పురుషార్థ సాధన "లో ఇవన్ని ఇమిడే ఉంటాయి.

" నాకు టైం లేదు", " నేను చాలా బిజీ " అని అనుకోవడం కూడా అభివృద్ధికి విఘ్న బీజంగా మారుతుందని శాస్త్రం చెబుతుంది.

ఇక రెండో అర్థమైన " మనో నిగ్రహం "గూర్చి.....

ఆభివృద్ధి సాధించాలనుకునే వ్యక్తి తప్పనిసరిగా మనో నిగ్రహాన్ని కలిగి ఉండాలి.దేనికీ బానిస కాకూడదు.

" నేను 'టి' తాగకుంటే తలనొప్పి వస్తుంది "...

" మద్యం లేకపోతే శరీరం వణుకుతుంది."....

" TV చూడకపోతే ఒంటరితనంతో పిచ్చి పట్టినట్లుగా ఉంటుంది " .....

ఇలాంటి భావాలకు సంబంధించిన అన్ని రకాల మానసిక బలహీనతలను జయించాలి.

అవసరమైతే ఎప్పుడైనా నిద్రపోగలగాలి. ఎప్పుడైనా నిద్ర నుండి లేవగలగాలి.అప్పుడు కూడా అంతే ఏక్టివ్ గా ఉండగలగాలి.
ఒకటి, రెండు రోజులు భోజనం లేకపోయినా తట్టుకోగలగాలి. జీవించడానికే ఆహారాన్ని తీసుకోవాలి కానీ, కేవలం తినడం కోసమే బ్రతకగూడదు.

" జిహ్వ చాపల్యం " వల్ల పొందే సుఖం - చాలా తక్కువస్థాయి సుఖం " అని శాస్త్రం చెబుతుంది.

నిరంతర అభ్యాసం వల్ల మనకు ఈ మనో నిగ్రహం పెరుగుతూ పోతుంది.
ఈ మనో నిగ్రహం వల్ల మానసిక స్థైర్యం అలవడుతుంది.

దీనినే సంస్కృతంలో "ధృతి" అంటారు.

మనలో ఏర్పడిన ఈ "ధృతి" ఆత్మవిశ్వాసాన్నీ ,సంతోషాన్నీ , తృప్తినీ ,వివేకాన్నీ ఏర్పరచి అభివృద్ధికి కారణమౌతుంది.

మన సర్వతోముఖాభివృద్ధిలో ఎదురయ్యే అన్ని రకాల అంతరాయాలనూ - విఘ్నాలను ఈ "ధృతి" వల్లనే అధిగమించగలుగుతాము.

ఈ "అవిరతి " అనే విఘ్న బీజం వల్ల చాలా మంది అభివృద్ధి విషయంలో ఆటంకాలను ఎదుర్కుంటారు.

ఈ విఘ్న బీజం తొలగడానికి ప్రతి రోజు బ్రాహ్మీ ముహుర్తంలో స్నానం చేసి వేయి సార్లు  "ఓం శ్రీం హ్రీం క్లీం ధృతిమతే నమ: " అనే గణపతి మంత్రాన్ని మనసులో అత్యంత ఏకాగ్రతగా జపించాలి.
                 

                               స్వస్తి .

(మరో రోజు గణపతి తొలగించే మరో విఘ్నం గూర్చి తెలుసుకుందాము.)

గణేశో విశ్వేఽస్మిన్ స్థిత ఇహ చ విశ్వం గణపతౌ
గణేశో యత్రాస్తే ధృతి మతిరనైశ్వర్యమఖిలమ్|
సముక్తం నామైకం గణపతిపదం మంగలమయం
తదేకాస్యం దృష్టేః సకలవిబుధాస్యేక్షణ సమమ్|| 
       

                      (ఓపికగా చదివిన వారికి )
                       ధన్యవాదములతో
                     గురుమంచి రాజేంద్రశర్మ



Tuesday, 6 September 2016

దిగులు పడడాన్ని తొలగించే మహాగణపతి


వినాయక నమోస్తుతే! - 3




రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

మన అభివృద్ధిని నిరోధించే విఘ్నాలలో మరొకటి దౌర్మనస్యం.

3. దౌర్మనస్యం (దిగులు )
---------------------------------------------

" దౌర్మనస్యం " అంటే దిగులు.

చాలా మందికి చాలా సార్లు ఈ దిగులు అనే విఘ్న బీజం ఏర్పడుతూ వుంటుంది.
" దిగులు " తో ఉండడం వల్ల నిరంతరం మనసు ఏదో కోల్పోయినట్లుగా ఉండి, తన స్థితి తనకే అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ "దిగులు" అనే విఘ్న బీజం అభివృద్ధినీ, జీవితాన్ని కూడా సార హీనం చేస్తుంది.

విజయాలు లేకపోవడం వల్ల.. పరాజయాల వల్ల ఈ దిగులు ఏర్పడుతూ వుంటుంది.
గతం వల్ల బాధ, ఉన్న స్థితి పట్ల అసంతృప్తి, లేదా భవిష్యత్తు పట్ల భయం ఈ దిగులుకు కారణమౌతాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే....

"దిగులు అంటే ఉత్సాహం కొరవడడమే!"

దీనికి పరిష్కారం తిరిగి మనలో ఉత్సాహాన్ని నింపుతూ ఉండడమే !

అందుకు ఈ " ఉత్సాహం " ఎలా ఏర్పడుతుందో అర్థం చేసుకోవాలి.
వాటిని ఈ క్రింద వివరిస్తున్నాను.

1) విజయాలు సాధించడం వల్ల...

ఇక్కడ విజయం అంటే ఏదో పెద్ద విషయమే కానక్కరలేదు.4 am కు నిద్ర లేద్దామనుకుని లేవడం కూడా విజయమే!.. ఇలాంటి చిన్న చిన్న విజయాలే భవిష్యత్తులో మరిన్ని పెద్ద విజయాలను ముందుకు తెస్తాయి.

(దీని గూర్చి " అలబ్ద భూమికత్వ" అనే విఘ్న బీజాన్ని వివరించే సందర్భంలో సమగ్రంగా వివరిస్తాను.)

2) క్రియాశీలవంతులతో స్నేహం, సాంగత్యం వల్ల....

3) సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల...

4) అంతర్వాణి మాటలను సరిగ్గా ఆచరించడం వల్ల....

5) నిస్వార్థం వల్ల.. (ఆశించకపోవడం, సేవ.. etc)

6) ఆత్మ విశ్వాసం వల్ల...

7) మనో నిగ్రహం వల్ల...

8) జ్ఞానం వల్ల... (ఉదా:- మంచి పుస్తకాలను చదవడం, మేధావంతులతో స్నేహం.. etc)

9) క్రొత్తదనం వల్ల...

(క్రొత్త ప్రదేశాలను దర్శించడం, అలవాటు లేని ఉపయోగపడే పనులను చేయడం - నేర్చుకోవడం, క్రొత్త విషయాలను నేర్చుకోవడం.. etc)

10 ) శరీరానికి అవసరమైన వ్యాయామం వల్ల.. (నడుక, ఆసనాలు.. etc)

11) అనవసర ఆహారం తీసుకోకుండా తేలికగా జీర్ణమయ్యే ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోవడం వల్ల.. ( జీర్ణశక్తిని మించి ఆహారాలు  తీసుకున్నపుడు ఉత్సాహం తగ్గుతుంది.)

12) ఏదో ఒక కారణంతో అనవసర పస్తులు ఉండకుండా తగినంతగా సారవంతమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల...

13) దుర్వ్యసనాలు మానివేస్తూ మంచి అలవాట్లను పెంచుకోవడం వల్ల...

14) ఎవరినీ ద్వేషించక పోవడం వల్ల.. ( తననూ, తన పరిస్థితులతో సహా..)

15) కళల వల్ల.. (కళలను నేర్చుకునే ప్రయత్నం చేయడం .. కళల ద్వారా ఆనందాన్ని పొందగలగడం.. etc)

16) క్రీడల వల్ల... ( ఏదో ఒక ఆటలను ఆడుతూ ఉండడం..etc)

17) ఆసక్తిని పెంచుకుంటూ అన్ని పనులను చేయడం వల్ల..

( పనులను నిర్లక్ష్యంగా చేయడం వల్ల ఉదాసీనత ఏర్పడుతుంది. క్రమేణా ఈ ఉదాసీనత దిగులుగా మారుతుంది.)

18) తెల్లవారు జామునే నిద్ర లేవడం వల్ల...

19) పెండింగ్ పనులను ఒక లిస్ట్ రాసుకుని పూర్తి చేయడం వల్ల...

20) తననూ, ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల..

21) పెద్దలను నిందించకపోవడం వల్ల..

 (మనం పెద్దలను నిందించినపుడు అది తప్పని మన సబ్ కాన్సియస్ మైండ్ లో నిక్షిప్తమౌతుంది. ఇలా చాలా సార్లు జరుగుతూ వుంటే భవిష్యత్తులో అది మనది మనకే అర్థం కాని దిగులుగా మారుతుంది.)

..... ఇలా రకరకాలుగా "ఉత్సాహం " పెరుగుతుంది.

ఉత్సాహం పెరగడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.

దిగులుగా ఉండేవారు ఈ విషయాలను పాటిస్తూ సాధన చేస్తూ వుంటే తొందరగా కోలుకుంటారు.

నిజానికి ఈ " ఉత్సాహం " అనేది అభివృద్ధి కే కాదు, మానవ జీవితానికే "బీజం " లాంటిది.

"నిరంతర ఉత్సాహం " అనేది బీజమైతే "బ్రహ్మనందం "దాని ఫలమౌతుంది.

ఒక్కొక్క సారి చెడు విషయాల వల్ల కూడా " తాత్కాళిక ఉత్సాహం" కలుగుతుంది.
ఇది "ఒక గాయాన్ని గోకితే వచ్చే సుఖం లాంటిదని " నీతి శాస్త్రం చెబుతుంది. ఇలాంటి తాత్కాళిక ఉత్సాహాలు దీర్ఘకాలికంగా మనకూ, మన అభివృద్ధికి నష్టాన్నే కలగజేస్తాయని అనుభవం మీద అర్థం అవుతుంది.

ఈ దౌర్మనస్యం (దిగులు ) అనే విఘ్న బీజం వల్ల ఎంతో మంది  ఆనందాన్నీ, అభివృద్ధినీ కోల్పోతుంటారు.

ఈ విఘ్న బీజం తొలగడానికి ప్రతి రోజు ప్రాత:కాలం స్నానం చేసి వేయి సార్లు  "ఓం శ్రీం హ్రీం క్లీం ప్రమోదాయ నమ: " అనే గణపతి మంత్రాన్ని మనసులో అత్యంత ఏకాగ్రతగా జపించాలి.
                

                                             స్వస్తి .

(మరో రోజు గణపతి తొలగించే మరో విఘ్నం గూర్చి తెలుసుకుందాము.)

ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్|
కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ |
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ |
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ ౹౹


       (ఓపికగా చదివిన వారికి )
              ధన్యవాదములతో
        గురుమంచి రాజేంద్రశర్మ
     
        శ్రీ రవీంద్ర జ్యోతిషాలయం



Monday, 5 September 2016

అనుమాన పడే గుణాన్ని తొలగించే మహాగణపతి

వినాయక నమోస్తుతే! 2

----------------------------------------------------



రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

మహా గణపతి తొలగించే విఘ్నాలలో మరొకటి సంశయం.

2. సంశయం (అనుమానాలు )
---------------------------------------------

అభివృద్ధి చెందడానికి అవరోధాలను కలిగించే మరో విఘ్నం "సంశయం."

సంశయం అంటే అనుమానాలు.

మనలో సోమరితనం - బద్ధకం - అజ్ఞానం పెరుగుతున్నా కొద్ది అనుమానాలు కూడా పెరుగుతుంటాయి.అంతే కాదు తెలిసి తెలిసి తప్పులు చేయడం వల్ల అనుమానపడినట్లే జరుగుతుంది కూడా! ఇది క్రమేణా మూఢ నమ్మకాలకు కారణమౌతుంది.

( ఇక్కడ మనకో సందేహం రావచ్చు! అజ్ఞానం కూడా పెరుగుతుందా అని.
మనలో కాన్సియస్ గా ఉండే స్థితి తగ్గుతూ ఉన్నదంటే అజ్ఞానం పెరుగుతుందనే అర్థం. మనలో కాన్సియస్ నెస్ తగ్గుతున్న కొద్ది జాగరూకత కూడా తగ్గుతుంది.అప్పుడు శ్రద్ధగా వినలేము. శ్రద్ధగా చదవలేము. శ్రద్ధగా మాట్లాడలేము. శ్రద్ధగా పని చేయలేము. అన్ని విషయాలలో నాణ్యత తగ్గుతుంది. నిజానికి సంపూర్ణ కాన్సియస్ స్థితి పొందడమే మోక్షం లేదా ఆత్మ జ్ఞానం. ఈ స్థితిని సాధించిన వారిని శాస్త్రం జ్ఞాని అని సంభోదించింది.)

మనలో అత్యధిక క్రియాశీలకశక్తి ఏర్పడినపుడు మనం ఏది చేసినా అది సరియైనదే అవుతుంది.అంతే కాదు, అది శాస్త్రాన్ని అనుసరించే ఉంటుంది.

ఈ విషయాన్ని నా జ్యోతిష అనుభవంలో కూడా పరిశీలించి చూశాను. క్రియాశీలత అధికంగా కలిగిన వారు జ్యోతిషం ( ముహూర్తం - జాతకం లాంటివి) ఏదీ చూసుకోకుండానే ప్రారంభించిన ముహూర్తాలను జ్యోతిష దృష్టితో పరిశీలించి చూసినపుడు అవి అద్భుతమైన ముహూర్తాలై ఉంటున్నాయి.అంటే కాలస్వరూపుడైన భగవంతుడు వారికి స్వయంగా సహాకరిస్తున్నాడన్న మాట!
నిజానికి అత్యధిక క్రియాశీల సంపన్నుడు శాస్త్రాన్ని అనుసరించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే శాస్త్రమే తానౌతాడు కాబట్టి!

అలాంటి వారి నుంచే శాస్త్రాలు ఏర్పడ్డాయి కాబట్టి! అయితే మనిషి సంపూర్ణ క్రియాశీలతను సాధించే వరకు మాత్రం శాస్త్రాన్ని అనుసరించవలసిందే!

( క్రియాశీలతను సాధించే మార్గంలో ఉన్న వ్యక్తికి మాత్రమే కాలం, ప్రకృతి శక్తులు సహాకరిస్తూ ఉంటాయి.)

ఈ " అనుమానాలు " అనేవి అభివృద్ధికి అతి పెద్ద విఘ్నాలు.

ఉదాహరణకు ....

ఒక పిల్లవాడికి ఏదో వాహనం వల్ల ప్రమాదం జరిగి కోలుకున్నాడనుకుందాము!
అతని తల్లిదండ్రులు అప్పటి నుండి అతన్ని బయటకు వెళ్లనివ్వకపోవడం -సిరియైన విధంగా ఆడుకోనివ్వకపోవడం - భయాన్ని నూరిపోయడం ..(అంతకు ముందు జాగ్రత్త లేక పోవడం, సంఘటన తరువాత అతి జాగ్రత్త పాటించడం..).... ఇలా అతని శారీరక తేజస్సుకు అవరోధాలు కల్పిస్తుంటారు. ఇది అతని అభివృద్ధిపై ప్రభావాన్ని చూపిస్తుంది.సాధారణంగా ఇలాంటి పిల్లవాడి తల్లిదండ్రులు జడస్తులై ఉంటారు.

గమనించ వలసిన విషయమేమిటంటే....

" అనుమానస్తులు అన్ని విషయాలు సేకరిస్తారు.కాని, ఏదీ ఆచరించరు. కారణాలను ఇతరులపైకో, పరిస్థితులపైకో నెట్టి వేస్తుంటారు. "

జడస్తుల అనుమానాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే...

"ఒక రోజు మొదటిసారిగా వాకింగ్ కు వెళ్లాడనుకోండి! అదే రోజు జ్వరం వచ్చింది. అప్పటి నుండి " నాకు వాకింగ్ అచ్చి రాదు" అని మనసులో బలంగా నిర్ణయించుకుంటాడు. ఈ వ్యతిరేక ధ్యానం వల్ల అతడు ఎప్పుడు వాకింగ్ కు వెళ్లినా ఏవో ఒక సమస్యలు ఏర్పడుతుంటాయి.
తరువాత " నాకు వాకింగ్ అచ్చి రాదు" అన్న స్థిర అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటాడు. తరువాత ''మనకు వాకింగ్ అచ్చి రాదురా !" అంటూ కుటుంబంలోని వారందరికి నూరిపోస్తాడు.ఇలా మూఢ నమ్మకాలు ఏర్పడుతుంటాయి.ఇవి అభివృద్ధిని నిరోధిస్తూ ఉంటాయి.

అనుమానస్తులు (జడస్తులు) ఎప్పుడూ ఎటూ నిర్ణయించుకోలేని స్థితి (కన్ ఫ్యూజ్) లోనే ఉంటారు.

ఇంకా భార్యా భర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య అనుమానాలు.. మున్నగునవి కూడా ఇందులోకే వస్తాయి. అనుమానపడే సంఘటనలు నిజంగానే జరిగినా, అనుమానపడినా కారణం మాత్రం జడత్వమే!(సోమరితనం - బద్ధకమే!)
దీనికి పరిష్కారం క్రియాశీలతను పెంచుకుంటూ పోవడమే! మనలో క్రియాశీలత పెరిగిన కొలది అనుమానాలు నశిస్తూ ఉంటాయి. అనుమానపడిన విషయాలకు కూడా పరిష్కారాలు లభిస్తాయి.
ఉపయోగపడే పనులతో ప్రతి క్షణం బిజిగా ఉంటూ క్రియశీలమౌతున్న కొద్ది " కేవలం రావలసిన ఆలోచనలే వస్తుంటాయి.

" ఆచరిస్తేనే తెలుస్తుంది... తెలుస్తు ఉన్నా కొద్ది ఆచరిస్తుంటాము. ఇది నిరంతర ప్రక్రియ. 

అంటే "కర్మ  నుండి జ్ఞానం"..." జ్ఞానం నుండి కర్మ " ఏర్పడుతున్నాయనీ,  కర్మజ్ఞానాలు రెండు వేరు వేరు కావనీ... అవి రెండూ ఏకీకృత రూపాన్ని పొందే ఉన్నాయని అనుభవ పూర్వకంగా తెలుసుకుంటాము.

ఈ సంశయం (అనుమానం ) అనే విఘ్న బీజం వల్ల ఎంతో మంది సరియైన సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకోలేక అభివృద్ధి పథంలో వెనుక పడుతుంటారు.ఈ విఘ్న బీజం తొలగడానికి ప్రతి రోజు ప్రాత:కాలం స్నానం చేసి పాదరక్షలు ధరించకుండా "ఓం శ్రీం హ్రీం క్లీం కళ్యాణ గురవే నమ: " అనే గణపతి మంత్రాన్ని మనసులో జపిస్తూ ఒక గంట సేపు (రెండున్నర ఘడియలు) వాకింగ్ చేయాలి.

                 స్వస్తి .

(మరో రోజు గణపతి తొలగించే మరో విఘ్నం గూర్చి తెలుసుకుందాము.)

నమోస్తు గణనాథాయ
సిద్ధిబుద్ధియుతాయచ |
సర్వ ప్రదాయ దేవాయ
పుత్రవృద్ధి ప్రదాయ చ ||



  (ఓపికగా చదివిన వారికి )
              ధన్యవాదములతో

       గురుమంచి రాజేంద్రశర్మ









మహాగణపతి తొలగించే విఘ్నలు - 1.అలసత్వం

వినాయక నమోస్తుతే!

------------------------------

   మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు 


రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

విఘ్నాలు తొలిగించే శక్తి ఉన్న ఒకే ఒక దేవతామూర్తి విఘ్నేశ్వరుడు . అందుకే విఘ్నాలు తొలగించే నాయకుడిగా విఘ్నేశ్వరుడిని పూజిస్తాం. 

దేవతాగణాలన్నింటికీ కూడా ఆయనే అధిపతి.అందుకే ఆయనను వినాయకుడు - గణపతి అనే పేర్లతో పిలుస్తున్నాము.


జాతకం లో ఉన్న కేతు దోషాలు తొలగడానికి మహా గణపతిని పూజిస్తుంటారు.

జ్యోతిషశాస్త్ర దృష్ట్యా కేతువుకు జ్ఞాన కారకుడు, మోక్ష కారకుడని పేరు.
జాతకంలో కేతువు అనుకూలంగా ఉంటే జ్ఞానాన్ని కలిగించి అనవసర బంధనాలను తొలగిస్తూ అభివృద్ధి పథంలో ప్రయాణింపజేస్తాడు.

అలా కాకుండా కేతువు వ్యతిరేక స్థానంలో ఉన్న వారికి అజ్ఞానం ఏర్పడుతూ అంటే బ్రమ, మాయలలో కూరుకుపోతూ వారు చేసే స్పృహ లేని పనుల వల్ల బంధనాలు ఏర్పడి పరాజయ మార్గంవైపు ప్రయాణిస్తూ ఉంటారు.మహా గణపతిని భక్తితో ఆరాధించడం వల్ల ఈ మాయా, బ్రమలూ, బంధనాలూ, విఘ్నాలు.. ఇవన్ని తొలగిపోతాయి.


మహా గణపతిని ఆరాధించడం వల్ల అభివృద్ధికి అంతరాయాలుగా ఉన్న విఘ్నాలన్నీ తొలిగిపోతాయి.

మరి ఈ విఘ్నాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎలా ఏర్పడుతాయి?

మహా గణపతి తొలగించే విఘ్నాలు  విఘ్న బీజాలు  గురించి వివరంగా తెలుసుకుందాము.

1) అలసత్వం


అలసత్వం అంటే సోమరితనం, బద్ధకం

ఈ రెండింటికీ కొద్దిగా తేడా ఉంది.


"వర్తమానంలో (అవసరమైన) ఉపయోగపడే పని విషయంలో ఏకాగ్రత లోపించడాన్ని"... సోమరితనం అంటాము.

అంటే ఉదాహరణకు 
ఒక విద్యార్థికి అవసరమైన ఉపయోగపడే పని - చదవడం. 

కాని అతనికి చదవడం పట్ల ఆసక్తీ - ఏకాగ్రత ఉండకుండా ప్రస్తుతం అవసరం, ప్రయోజనం లేని ఇతర వ్యాపకాలలో మునిగిపోవడం సోమరితనం అవుతుంది.

ఈ విఘ్నబీజం వల్ల భవిష్యత్తులో ఆ విద్యార్థి చదువు విషయంలో విఘ్నాలనూ, ఆటంకాలను ఎదుర్కొంటాడు.

అలాగే ఒక గృహిణికి అవసరమైన ఉపయోగపడే పని ఇల్లునూ - పిల్లలనూ - భర్తనూ శ్రద్ధగా చూసుకోవడం.
కాని ఈ విషయంలో ఆసక్తీ - ఏకాగ్రత ను కోల్పోయి TV సీరియల్లు - సెల్ ఫోన్ చాటింగ్ లలో మునిగిపోవడం, అలాగే TV సీరియల్లు చూస్తూ పిల్లల తో హోమ్ వర్క్ చేయించడం వంటివి చేస్తూ ఉంటే సోమరితనం అవుతుంది.

ఈ విఘ్నబీజం వల్ల భవిష్యత్తులో ఆమె పిల్లలు ...చదువూ - అభివృద్ధి విషయంలో వెనుకబడడం, కుటుంబ అభివృద్ధి మందగించడం, అనారోగ్యం, గొడవలు వంటి విఘ్నాలూ - సమస్యలు ఏర్పడుతుంటాయి.

మొత్తం మీద సోమరితనం అంటే అవసరమైన పనులనూ, ఉపయోగపడే పనులను నిర్లక్ష్యం చేసి అనవసర వ్యాపకాలలో మునిగిపోవడం.
ఇక
"శరీరాన్ని సుఖపెట్టాలనే కాంక్ష "  ను బద్ధకం అంటాము.

అంటే కూర్చుంటే లేవడం విసుగు . పనిచేయడం విసుగు .నడవడం విసుగు.
ఎప్పుడూ కాలు నొప్పి - కడుపు నొప్పి - భుజం నొప్పి - తలనొప్పి అంటూ సమస్యలను ఎకరువు పెడుతుంటారు.పోని అన్ని నొప్పులతో విశ్రాంతి తీసుకుంటారా?అంటే అలా ఉండదు. TV- ముచ్చట్లు - లాంటి వృథా కాలక్షేప వినోదాలలో మునిగిపోతారు.

ఇలా శరీరం లో సుఖ లాలసత ఏర్పడడం వల్ల శ్రమించడం అంటేనే విసుగు ఏర్పడుతుంది.కొద్దిగా శ్రమించే ఒక చిన్న పని కూడా ఏకాగ్రతగా చేయలేరు.
దీని వల్ల చేసే పనులలో నాణ్యత కొరవడి తన జీవితం- తనతో పాటు జీవించే వారి జీవితం కూడా నాణ్యత లేకుండా తయ్యారౌతుంది.

శ్లో|| అలసానాం మనుష్యాణాం సదా దు:ఖం దరిద్రతా I
ఆలస్యం పాతకం లోకే ఆలస్యం భూతి నాశనమ్ ॥
నాధిగచ్ఛన్తి భోక్తవ్య మలసాయే నరాధమా |
అలసానాం మనుష్యాణాం ప్రాప్తోZప్యర్థో వినశ్యతి ||
అని శాస్త్రం చెబుతుంది.

అంటే సోమరిపోతులూ - బద్ధకస్తులైన వారికి దు:ఖం, దరిద్రత వెన్నంటి ఉంటాయి. సోమరితనం ..అనేది పాప ఫలితం . సోమరితనం వల్ల ఐశ్వర్యమూ - అదృష్టం క్షయించబడుతాయి.వీరికి అనుభవించవలసిన శుభాలు కూడా విఘ్నాలు ఏర్పడి చేజారిపోతాయి.
అంటూ శాస్త్రం చెబుతూ ఉంది.

 మహాగణపతిని అత్యంత శ్రద్ధగా - భక్తిగా ఆరాధిస్తే మూలాధారం చైతన్యమౌతూ దోషాలు తొలగి ఈ అలసత్వం అనే విఘ్నబీజం తొలగిపోతుంది.

ఇక 

జ్యోతిషశాస్త్ర దృష్ట్యా చూసినపుడు...
జాతకంలో కేతువు అనుకూలంగా ఉన్న "జ్ఞాని " కర్మ ఫలాలకు అంటకుండా ఉండే అభ్యాసం చేస్తూ ఉంటే..

జాతకంలో కేతువు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి మాయలో, సుఖ లాలసత్వం అనే మైకంలో మునిగి కర్మలకు దూరంగా ఉండే అభ్యాసం చేస్తూ కర్మ ఫలాలను మాత్రం తీవ్రంగా ఆపేక్షిస్తుంటాడు. అంటే పని చేయకుండా ఫలితాన్ని కోరుతాడన్నమాట!

"దంత పాశాంకుశ విఘ్న పరుశు లడ్డు సంజ్ఞికా :I బీజాపూర హవ్య ముద్రా విఘ్నేన విఘ్న పూజనాత్॥" 

అంటూ శాస్త్ర గ్రంథాలు మహాగణపతి ఉపాసనలో ఉపయోగించే 7 ప్రధాన ముద్రలగూర్చి వివరిస్తున్నాయి.

ఈ  అలసత్వం అనే విఘ్న బీజం తొలిగి మూలాధార చక్రం జాగృతం కావడానికి దంత ముద్ర తో     "ఓం వక్రతుండాయ హుం " అనే మంత్రాన్ని 21 లక్షల జపం చేయాలి.

ఈ విధంగా చేస్తే అలసత్వం సమూలంగా తొలిగిపోతుంది.

లేదా

ఇదే మంత్రాన్ని జపం చేస్తూ ప్రతి రోజు ఉదయం - సాయంత్రం శక్తికొలది గుంజీలు తీసినా ఫలితం ఉంటుంది.
   

                స్వస్తి .

(మరో రోజు గణపతి తొలగించే మరో విఘ్నం గూర్చి తెలుసుకుందాము.)

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ I
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ॥


       (ఓపికగా చదివిన వారికి )
              ధన్యవాదములతో

నన్ను "నేను" తెలుసుకోవటానికి
నన్ను "నేను" మార్చుకోవటానికి
నన్ను "నేను" చేరుకోవడటానికి
మరియు అత్యుత్తమ జీవన విధానానికి
మీ ముందుకు "మహాగణపతి పూజ" తో వస్తున్నాను.        

గురుమంచి రాజేంద్రశర్మ













Monday, 29 August 2016

చంద్రుడు ఇచ్చే ఫలితాలు - దోషనివారణకు చంద్రకవచం

చంద్రుడు
---------------------------------------



రచన :- గురుమంచి రాజేంద్రశర్మ


భోజనం _ నిద్ర విషయంలో సరియైన విధంగా వ్యవహరించకుంటే చంద్రుని అనుగ్రహాన్ని కోల్పోతారు. లేదా చంద్రుని అనుగ్రహం లేకుంటే ఆ విషయాలలో సరియైన విధంగా ఉండలేరు.

భోజనం - నిద్ర అనేవి పునాది లాంటివి.వీటి విషయంలో మనం వ్యవహరించే విధానాన్ని బట్టే ప్రస్తుత మన మానసిక స్థితి ఉంటుంది.

ఆనందంగా ఉండాలనుకునే వ్యక్తి ఆరోగ్యం - పవిత్రత - అవసరం - సమయం అనే వాటిని దృష్టిలో ఉంచుకుని భుజించాలి. కాన్సియస్ తో భుజించాలి.

పాపం లేదా దోషాలు పెరుగుతున్న ఫుడు మనిషి స్పృహ లేకుండా తింటాడు.

ఒక మనిషికి వ్యతిరేక సమయం నడుస్తున్నపుడు ఎలా ప్రవర్తిస్తాడు.అలాగే అదృష్ట సమయం నడుస్తున్నపుడు ఎలా ప్రవర్తిస్తాడు. అనే దానిని "మహాభారతం " వివరించింది.

ఆ సందర్భంగా ఆహార అలవాట్ల ప్రస్తావన కూడా ఉంది.

ఉదాహరణకు...

ఒక మనిషికి వ్యతిరేక సమయం నడుస్తున్నపుడు.....

శ్లో|| యదాయ మతి కష్టాని సర్వాణ్యుపనిషేవతే| 
      అత్యర్థ మపివా భుంక్తే నవా భుంక్తే కదాచన॥


అంటే...

తనకు హాని కలిగించే విరుద్ధమైన ఆహార పదార్థాలను తింటూ ఉంటాడు.

ఒకప్పుడు జిహ్వ చాపల్యం వల్ల అతిగా తింటాడు. మరొకప్పుడు పూర్తిగా తినడాన్నే మానుకుంటాడు.

(పండ్లు ఫలాలు లాంటి ఆరోగ్యాన్ని కలిగించే పదార్థాలు ఇంట్లో మురిగి పోతుండగా చూస్తాడు కాని వాటిని తినాలనిపించదు.
పవిత్రపరిచే దేవుని ప్రసాదాలు చీమలు పడుతున్నా చూస్తాడు కాని, తాను తినడు - ఇతరులకు పంచి పెట్టడు. ఆయా విషయాల్లో అంతరాత్మ హెచ్చరిస్తూనే ఉంటుంది.కాని ప్రకాశవంతంగా లేకపోవడం వల్ల విరుద్ధంగా ప్రవర్తిస్తాడు.)

శ్లో || దుష్టాన్న మిషపానంచ యదన్యోన్య విరోధిచI 
       గురుచాప్య మితం భుంక్తే నాతి జీర్ణేZపివాపున:॥

తినకూడని, త్రాగకూడని పదార్థాలను సేవిస్తాడు. ఒకదానితో ఒకటి సరిపడని పదార్ధాలను తింటాడు.
బలం తక్కువ బరువు ఎక్కువైన వాటిని తింటూ ఉంటాడు.అంతేకాక, అంతకు ముందు తిన్నది జీర్ణం కాకముందే మరల పొట్టను నింపుతూ ఉంటాడు.

ఉదాహరణగా రెండు శ్లోకాలను మాత్రమే ఇచ్చాను.

నిద్ర కూడా వీలైనంత తొందరగా పడుకుని సూర్యోదయం లో పే నిద్ర లేచే ప్రయత్నం చేయాలి.

 అలాగే ఇంతకు ముందు చెప్పినట్లు....

జ్యోతిషశాస్త్ర దృష్ట్యా మానసిక శక్తికి చంద్రుడు కారకత్వాన్ని వహిస్తాడు.

జాతకంలో చంద్రుడు అనుకూలంగా ఉంటే దానర్థం... అతడు గత జన్మల నుండే మానసికంగా ఉత్సాహంగా ఉండడాన్ని అభ్యాసం చేస్తున్నాడన్నమాట!

ఎవరికైతే జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేడో అతడు గత జన్మల నుండే దు:ఖపడడాన్ని - నిరుత్సాహాన్ని - నెగిటివ్ థింకింగ్ ను అభ్యాసం చేస్తున్నట్లు అర్థం.

ఈ జన్మంతా వ్యతిరేక ఆలోచనలతో గడిపి మరణిస్తే వచ్చే జన్మ జాతకంలో చంద్రుడు పూర్తి వ్యతిరేక స్థానంలో ఉంటాడు.

ఒక వ్యక్తి చేసిన మంచి - చెడు అభ్యాసాలు సంస్కార రూపంలో జీవుని వెన్నంటి ఉంటాయి. ఆ సంస్కారాలనూ, ఆ సంస్కారాల వల్ల ఆతడు పొందబోయే ఫలితాలను జాతకం విశ్లేషిస్తుంది.

కాబట్టి ప్రస్తుత స్థితి అనేది గత కర్మల ఫలితం.భవిష్యత్తు మరింత బాగుండాలంటే అది మనం చేసే వర్తమాన కర్మలను బట్టి ఉంటుంది.

మనం చేసే కర్మలన్నింటిని ప్రధానంగా మనస్సే ప్రేరేపిస్తూ ఉంటుంది.

... అలా సరియైన విధంగా ప్రేరేపించే మానసిక శక్తిని - పాజిటివ్ థింకింగ్ ను - మంచి భావాలు వ్యాప్తి చేయడం - ప్రేమపంచడం - భోజనం, నిద్ర విషయంలో క్రమశిక్షణ - బావులూ చెరువులు త్రవ్వించడం - జల సంరక్షణ -  ఉత్సహంగా సంతోషంగా ఉండడం - వినయం - ప్రసన్నత- మాతృభక్తి - మంచి కీర్తి - మాతృభాషలో ప్రావీణ్యం - హాస్యాన్ని ఆస్వాదించడం ..... మొ॥ మంచి లక్షణాలు చంద్రుని అనుగ్రహం వల్ల లభిస్తాయి.

ఈ క్రింద "చంద్రకవచం" ఫైల్ ఇస్తున్నాను .దీని పారాయణం వల్ల చంద్ర సంబంధ దోషాలు తొలగడమే కాక చంద్ర సంబంధ ఆయా మంచి లక్షణాలు మనలో వృద్ధి పొందుతాయి.

(ఇక్కడ గమనించ వలసిన విషయం ఒకటుంది. ఉపయోగపడే ఏ పనులు మనకు చేయాలని అనిపించదో అందులోనే అదృష్టం దాగి ఉంటుంది.

సాధారణంగా మనస్సు ఎప్పుడూ ప్రయోజనం లేని పనుల వైపే లాగుతుంది.

ఈ క్రింద ఇచ్చే చంద్రకవచాన్ని డౌన్లోడ్ చేసుకోరు. ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నా  తన కోసం కాదన్నట్లు అలా జరుపుతూ వెళతారే కాని, చదవాలని అనిపించదు.
కాని ప్రతి సోమవారం చదివితే ఒక సంవత్సరం వరకు దీని ఫలితం ఏమిటో అర్థమౌతుంది.అదే సంస్కృత శబ్దాలకు ఉన్న మహాత్మ్యం.)


1. చంద్ర కవచం. ఇక్కడ నొక్కి డౌన్లోడ్ చేసుకోండి


2.లేదా ఇక్కడ నొక్కి చంద్రకవచం డౌన్లోడ్ చేసుకోండి



           ( ఓపికగా చదివినవారికి)
                ధన్యవాదములతో

           గురుమంచి రాజేంద్రశర్మ

         శ్రీ రవీంద్ర జ్యోతిషాలయం


Saturday, 27 August 2016

నజర్ ( దృష్టి దోషం లేదా నరఘోష ) తొలిగిపోవడానికి స్తోత్రం

నజర్ ( దృష్టి దోషం ) తొలిగిపోవడానికి రెమెడీ


రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

దృష్టిదోషం అంటే ఏమిటో కొంత వివరంగా తెలుసుకుందాం !

శబ్ద ,స్పర్శ ,రూప ,రస ,గంధాలు అనే వాటిని పంచతన్మాత్రలు అంటారు.

" బహిర్గతమైన ఆలోచనలే లేదా భావాలే శబ్దాలు ."

మనం మంచి శబ్దాలు(మాటలు) విన్నా మాట్లడినా మంచి ఫలితాలు రావడాన్ని గమనిస్తున్నాము.

అలాగే దీనికి వ్యతిరేకంగా చెడుశబ్దాలు విన్నా మాట్లడినా చెడు ఫలితాలు రావడాన్ని కూడా గమనిస్తున్నాము.

అలాగే పవిత్రంగా జీవించే మహాత్ముల స్పర్శ కూడా ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో రమణ మహర్షి , రామకృష్ణ పరమహంస , వివేకానందుడు వంటి మహాత్ములతో సహచర్యం చేసిన వారిని పరిశీలిస్తే అర్థమయ్యే విషయమే. 

అలాగే దుర్జన సాంగత్యం - వారి స్పర్శ మనని పతనం వైపూ లేదా కష్టాల వైపు నడిపిస్తుంది.

( మూడవది అయిన "రూపం "లోని విభాగమే దృష్టి కాబట్టి దీని గూర్చి చివరగా చెప్పుకుందాము.)

ఇక రసం అంటే రుచి - ఆహారం

"ఆహార శుద్ధౌ సత్వ శుద్ధి సత్వ శుద్ధౌ ధృవా స్మృతి . " అని శాస్త్రం.

మనం తినే ఆహారం కూడా మన గుణాలను ప్రభావితం చేస్తుంది.

కొన్ని ఆహార పదార్థాలు తింటే మనలో సాత్విక ప్రవృత్తి పెరుగుతుంది.

మరి కొన్ని ఆహార పదార్థాలు మన శరీరంలో రక్త ప్రసారాన్ని పెంచి అనారోగ్యం - ఆవేశం - కోపం పెరగడానికి కారణమౌతాయి.

ఇంకా కొన్ని ఆహార పదార్థాలు తమో గుణాన్ని పెంచి సోమరితనాన్ని - బద్ధకాన్ని - నిద్రమత్తును కలిగిస్తాయి.

ఇక గంధం అంటే వాసన

సువాసనలు - దుర్వాసనలు కూడా మన ఆలోచనలను ప్రభావితం చేసి తద్వారా మనచర్యలను ప్రేరేపించి మంచి - చెడులకు కారణమౌతాయి.

ఇక మూడవదైన రూపం సంబంధించిన వాటిలో వచ్చేది దృష్టి .

ఒకానొక గాఢమైన భావంతో కూడిన చూపును దృష్టి అంటాము. అది మంచిది కావచ్చు! చెడ్డది కావచ్చు!

మంచిదైతే పాజిటివ్ ఫలితాలను - చెడ్డదైతే నెగిటివ్ ఫలితాలను పొందుతాము.


దేవతల, మహాత్ముల, మన శ్రేయస్సును బలంగా కోరుకునే తల్లిదండ్రులు మొదలైన వారి "అనుగ్రహ దృష్టి - శుభ దృష్టి " మనకు మంచిని కలిగిస్తుందనేది తెలిసిన విషయమే!

ఎక్కువగా మౌనంగా ఉండే రమణ మహర్షి , కంచి పరమాచార్య వంటి మహాత్ములు తమను అనుగ్రహంతో చూసినపుడు "ఆ సమయంలో తమ మనసు కొన్ని క్షణాలు ఆలోచనా రహితమైన అవ్యక్త ఆనందానుభూతికి లోనై " తమ ఆలోచనలూ - జీవితం పూర్తిగా అభివృద్ధికర మార్గంలో ప్రయాణించినట్లు చాలా మంది భక్తులు చెబుతుంటారు.

రామకృష్ణ పరమహంస ఏకాంతంలో చేసిన స్పర్శ - అనుగ్రహ దృష్టి ప్రసారం వివేకానందునిలో ఎటువంటి మార్పులను కలిగించిందో వివేకానందుని చరిత్రను చదివిన వారికి తెలిసిన విషయమే !

అలాగే దీనికి వ్యతిరేకంగా మనని ద్వేషించే వారి, మనమంటే ఈర్శ్య కలిగిన వారి , అపవిత్రంగా జీవించే వారి, మనం అభివృద్ధి చెందకూడదు అని బలంగా కోరుకునే వారి దృష్టి ని "నర ఘోష - నజర్ - లేదా దృష్టి దోషం" అంటారు.

ఇది మనకు చెడును కలిగిస్తుందని పూర్వం నుండి పెద్దలు చెప్పే విషయం.

ఇటువంటి దృష్టి దోషాన్ని - నరఘోష ను (నజర్ ను) తొలగించే " దత్త మాలా మంత్రం " అనే ఫైల్ ను ఈ క్రింద ఇస్తున్నాను .దీన్ని ప్రతిరోజు 11 సార్లు చదవడం వల్ల ఎటువంటి దృష్టి దోషమైనా తొలిగిపోతుంది. బాగా బిజీగా ఉండేవారు కనీసం ఒకసారైనా చదువుకోండి.

సూర్యోదయం కన్నా ముందే స్నానం చేసి చదివితే మరింత మంచి ఫలితం ఉంటుంది.


1.దత్తమాలా మహా మంత్రం (ఇక్కడ నొక్కండి )

2.లేదా ఇక్కడ నొక్కి "దత్తమాలా మంత్రం "డౌన్లోడ్ చేసుకోండి


 ఇకపోతే ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది.

"నిరంతరం ప్రవహించే నీటి ప్రవాహానికి ఏ దోషం అంటదు. "  అలాగే   ఎప్పుడూ క్రియాశీలంగా -  ఏక్టివ్ గా జీవించే వ్యక్తులకు కూడా ఏ దోషాలు అంటవు.

" ఆగిన నీరే మురికిగుంటగా మారి దోషాలకు నిలయమౌతుంది."

అలాగే సోమరితనం - బద్ధకం - అధిక సుఖలాలసత ...మొ॥వి  మనని అభివృద్ధి మార్గంలో ఆగేటట్లుగా చేసి దోషాలకు కారణమౌతాయి. ఈ దుర్లక్షణాలను వీలైనంత తొందరగా వదిలించుకుంటే ఎప్పటికీ ఏ దోషాలు మనని అంటకుండా ఉంటాయి.

                                     స్వస్తి

                       (ఓపికగా చదివిన వారికి )
                            ధన్యవాదములతో

                 గురుమంచి రాజేంద్రశర్మ





Wednesday, 24 August 2016

అన్యోన్య దాంపత్యం కోసం జపాలు


కొంతమంది భార్యాభర్తల మధ్య చీటికిమాటికి తగాదాలు , గొడవలు , అభిప్రాయభేదాలు ఏర్పడుతుంటాయి.

అటువంటి వారు వారిమధ్యగల అభిప్రాయభేదాలు తొలిగి , అన్యోన్య దాంపత్యసౌఖ్యం ఏర్పడడం కోసం ఈ క్రింది సూచనలను పాటించండి.

1. ప్రతిరోజు సూర్యోదయం లోపు స్నానం చేయాలి.

2 . సాయంకాలం కూడా స్నానం చేయాలి.

3. అలాగే రెండు పూటల బ్రష్ చేసుకోవాలి.

4. టీవీ సీరియల్లు , టీవీ ఎక్కువగా చూడడం మానివేయాలి.

5. బెడ్ రూమ్ పరిశుభ్రంగా , నీట్ గా ఉంచుకోవాలి. 
( దాంపత్య సౌఖ్యాన్ని ప్రసాదించే గ్రహం " శుక్రుడు". జాతకంలో శుక్రుడు అనుకూలంగా లేని వారు బెడ్ రూం ను చిందరవందరగా ఉంచుకుంటారు.)

6. ఇంటిలో వెంట్రుకల చిక్కులు కనిపించకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. (ఇది పితృదోషాన్ని సూచిస్తుంది.)

7. ఉదయం 8 am లోపు టిఫిన్
మధ్యాహ్నం 1-2 pm మధ్య లంచ్
రాత్రి 8.30 pm లోపే డిన్నర్ పూర్తి చేసుకోవాలి.
(అకాల భోజనం జాతకంలోని చంద్ర దోషాన్ని సూచిస్తుంది.)

8. ఇంటి టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
(టాయిలెట్స్ పరిశుభ్రంగా లేకపోవడం రాహు- శని - చంద్ర సంబంధ దోషాలను సూచిస్తుంది.)

9. ఈ క్రింది లింక్ నుండి దాంపత్య సౌఖ్య జపాలు ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ప్రతి రోజు అందులో సూచించిన విధంగా జపం చేయండి.




                                స్వస్తి

అన్యోన్య అనుకూల దాంపత్యసౌఖ్యాభివృద్ధిరస్తు
                        ధన్యవాదములతో
                   గురుమంచి రాజేంద్రశర్మ



Monday, 22 August 2016

తొందరగా ఫలితమిచ్చే ధనలక్షీ స్తోత్రం

తొందరగా ఫలితమిచ్చే ధనలక్షీ స్తోత్రం

ఈ స్తోత్రమ్ లో 6 శ్లోకాలు ఉన్నాయి.
ఒక్కొక్క శ్లోకం చదువుతూ 10 రూ/ ఒక బాక్స్ లో వేయాలి. అలా 6 శ్లోకాలు చదివి 60 రూ/ వేయాలి.
ఇలా నియమబధ్ధంగా చేస్తూ ఉంటే నెలకు 1800  రూ/
సంవత్సరానికి 21,600 రూ/ పొదుపు అవుతాయి.
ఈ డబ్బులను స్థిరంగా ఉండే విధంగా బంగారం,ఇంటి నిర్మాణం,లేదా ఇంటి ప్లాట్ లో పెట్టుబడి పెట్టాలి.

ఇలా ప్రతిరోజూ జరిగే పొదుపు ధ్యానం తర్వాత తర్వాత గొప్ప శక్తి గా వృద్ధి చెంది మన జీవితాలలో మంచి ఆర్థికాభివృద్ధికి కారణమౌతుంది.

ఒక సంవత్సరం చేసి చూస్తే ఈ నియమం మహాత్మ్యం మనకు అర్థమౌతుంది.

స్వస్తి
ధన్యవాదములతో
గురుమంచి రాజేంద్రశర్మ

ఉపయోగపడే ఈ విషయాన్ని అందరికి షేర్ చేయండి.

ఈ క్రింది లింక్ నొక్కి "క్షిప్ర ఫల ధనలక్ష్మీ స్తోత్రం" ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి.






ధనప్రాప్తికి రామాయణం

ఈ క్రింది లింక్  ద్వార ధనప్రాప్తికి రామాయణం అనే ఫైల్ డౌన్ లోడ్ చేసుకోండి. దీన్ని ప్రతిరోజూ ఉదయం పారాయణం చెయ్యడం వల్ల ఆదాయం పెరుగుతుంది. రోజూ వీలు కానివారు కనీసం ప్రతి శనివారం అయినా చదవండి.

శుభం భవతు

స్వస్తి

ధన్యవాదములతో

గురుమంచి రాజేంద్రశర్మ


ధనప్రాప్తికి రామాయణం











.

Sunday, 21 August 2016

డబ్బు నిలకడ ఉండాలంటే.....


డబ్బు నిలకడ ఉండాలంటే పాటించవలసిన రెమిడి.
-----------------------------------------------------------


చాలా మందికి డబ్బు నిలకడ ఉండడం లేదు అనేది సమస్య.

"ఎంతో కష్టపడుతున్నాను. ఆదాయం కూడా పర్వాలేదు.కాని ఇన్ని సంవత్సరాలు ఫలితం చూస్తే మిగిలింది కూడా పెద్దగా లేదు." అనే బాధ ఉంటుంది.

సంపాధించిన డబ్బు అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్స్ లో ఖర్చు చేయడం వల్లనో,  ఇతర కుటుంబ సభ్యుల అభివృద్ధికి ఖర్చు కావడం వల్లనో,  ఇతరులకు అప్పులు -జామీనులు ఇచ్చి మునగడం వల్లనో, లేదా ఉన్న ఆదాయాన్ని మరింత ఆశతో అనవసర వ్యాపారాల వైపు మళ్లించి నష్టపోవడం వల్లనో ... ఇలా ఏదో ఒక కారణం వల్ల డబ్బు నిలకడ తగ్గుతుంది.

పోని,తెలివి లేక నష్టపోయారా? అంటే అదీ కాదు. వీరే ఎంతో మందికి సలహాలు ఇచ్చి - సహాయాలు చేసి ఇతరుల అభివృద్ధికి కారణమౌతారు.ఆ లాభపడ్డ వ్యక్తులెవరూ వీరి సహాయాన్ని గుర్తించే స్థితిలో ఉండరు. పైగా ఒకింత వ్యతిరేక భావనతోనే ఉంటారు.

జ్యోతిష దృక్కోణంలో విశ్లేషించినపుడు గతజన్మ సంబంధించిన జాతక దోషాలు ఉండవల్లగానీ, లేదా వంశపారంపర్య పితృ దోషాలు ఉండడం వల్లనో ఇలాంటి పరిస్థితి ఉంటుంది.

అంటే ... (గత జన్మలలో)వీరు కానీ లేదా వీరి పూర్వీకులు గాని ..."ఉన్న పుణ్యఫలం కన్న లేదా చేసిన శ్రమ కన్నా అధికంగా సుఖాలు అనుభవించడం వల్ల ఇలాంటి దోషాలు వస్తూ ఉంటాయి."

" అంటే కాలానికి శ్రమను లేదా పుణ్యఫలాన్ని బాకిపడి (అప్పు పడి)ఉంటారన్న మాట!

ఇలాంటి పరిస్థితులు ఉన్నవారు ఈ క్రింది లింక్ ను నొక్కి "సిద్ధలక్ష్మీ స్తోత్రం"ను డౌన్లోడ్ చేసుకుని ప్రతిరోజు ఉదయం స్నానం తరువాత చదువుకోవాలి. ఇది మనను పూర్తిగా పాజిటివ్ గా ఉంచే బీజాక్షరాలతో కూడిన స్తోత్రం. ఎలాంటి అనుమానాలు లేకుండా స్నానం తరువాత వెంటనే ఈ స్తోత్రం చదువవచ్చు. ఈ స్తోత్రం చదివిన తరువాత ఎలాంటి కోరిక లేకుండా నిష్కామంగా ఒక 4 నుండి 6 కిలోమీటర్లు నడిచి రావాలి (వాకింగ్ చేయాలి).
ఇది ఇంతకు ముందు ఎంతో మంది పరీక్షించి అనుకూల ఫలితాలు పొందిన రెమిడి.

1) స్తోత్ర పారాయణం వల్ల క్రమంగా పాజిటివ్ మార్గంలో ప్రయాణించి వేగంగా పుణ్యఫలం వృద్ధి పొందుతుంది.

2) తరువాత చేసే వాకింగ్ వల్ల శ్రమశక్తి వృద్ధి చెంది విధికి (లేదా కాలానికి) ఉన్న బుణం చెల్లింపు జరిగి వేగంగా అభివృద్ధి జరుగుతుంది.

ఇది అనుభవ పూర్వకంగా కేవలం ఒక మూడు నెలల లోనే బుుజువయ్యే రెమిడి.

రెమిడిలోని రెండు విషయాలను (స్తోత్ర పఠనం - వాకింగ్) ఆచరించినప్పుడే పూర్తి ఫలితం ఉంటుంది. వాకింగ్ కు అవకాశం లేని వారు కోరిక లేకుండా ఏదైనా గుడికి వెళ్లి 108 లేదా 41 ప్రదక్షణాలు చేయవచ్చు.

ఈ రెమిడి పాటించడం మొదలు పెట్టిన తరువాత మన హృదయంలో పెరుగుతున్న శాంతి మనం సరియైన మార్గంలోనే వెళుతున్నట్లు సూచిస్తుంది.

                         స్వస్తి
           ధన్యవాదములతో
       గురుమంచి రాజేంద్ర శర్మ.
ఈ క్రింది లింక్ నొక్కి "సిద్ధలక్ష్మీ స్తోత్రం" ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి.