Showing posts with label వ్యాసాలు. Show all posts
Showing posts with label వ్యాసాలు. Show all posts

Monday, 9 October 2017

మన జీవితమే మనకు ముఖ్యం





ఒక వ్యక్తి బ్రహ్మచారిగా  ఉన్నప్పుడు .." ఊ! ఏమిటి నీ ఫ్యూచర్ ప్లాన్స్ ?" అని అడుగుతుంటారు.

ఉద్యోగమో, వ్యాపారమో చేసి ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యాడనుకో! " ఎం సంగతి? పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావ్ ?(వివాహం ఎప్పుడు?) అని అడుగుతారు.

వివాహం చేసుకున్నాడనుకోండి!  "పిల్లలు ఎప్పుడు? (ఇంకా పిల్లలు కాలేదా?) అని అడుగుతారు.

ఒక సంతానం కలిగింది అనుకోండి! " రెండో సంతానం ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? "అని అడుగుతారు

విడాకులు తీసుకుంటే, "ఎందుకు?? "అని అడుగుతారు

మళ్ళీ  జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తే
"ఎందుకు చాలా త్వరగా?? "అడుగుతారు.

పోనీ చేసుకోకుంటే " మళ్ళీ పెళ్లి చేసుకోవా? "అని అడుగుతారు.

సైకిల్ ఉంటే " బండి ఎప్పుడు కొంటున్నావు ? " అని అడుగుతారు. బండి ఉంటే " కారు ఎప్పుడు " అంటారు. కారు ఉంటే "క్రొత్త కారు ఎప్పుడు ?" అంటారు.

లోకం తీరే అంత!! ప్రజలు  ఒక వ్యక్తిని ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడూ ఒప్పుకోరు!! ఇంకేదో కావాలంటారు !!

కానీ , ఒక వ్యక్తి తాను ఉన్న స్థితిని ఎక్సెప్ట్ చేసి ..తన పట్ల తాను సగర్వంగా ఉంటే, ప్రజలు ఏమనుకుంటున్నారో పట్టించుకోడు!!

అలా లేని వారే ఇతరుల గురించి ఆలోచిస్తూ మనసు అశాంతి పర్చుకుంటారు.

ఇది మన  జీవితం..

ఇతరుల మాటలు వినో..ఇతరులతో పోల్చుకునో..తాత్కాలిక సుఖాలకు ఆశపడో.. అనవసర చెత్త ఆకర్షణలకు లోనయ్యో ..జీవితాన్ని గడపడం వల్ల అశాంతి తప్పదు!!

ఇతరుల మాటలు మనకు అనవసరం.మన లోపలి మనసు ఏం చెబుతుందో అదే ముఖ్యం....అలా అది కోరుకున్న విధంగా మనం జీవిస్తూ ఉండాలి ...!
                          ✡️✡️✡️✡️✡️
ఓపికగా చదివిన వారికి
ధన్యవాదములతో..
గురుమంచి రాజేంద్రశర్మ.

Saturday, 30 September 2017

మంచి వాళ్ళు



  


మంచివాళ్ళు
----------------

లోకంలో రెండు రకాల వ్యక్తులు " మంచివాళ్లు"గా గుర్తించబడుతారు.

 1.  తమోగుణ ప్రేరితమైన మంచివాళ్లు(మంచివాళ్లుగా నటిస్తూ తమను తాము మంచివాళ్లుగా బ్రమ పడేవారు)

                    వీళ్లు మంచివాళ్లుగా ఉండడానికి ప్రధాన కారణం భయం. ఆ భయం చేతగానితనానికీ - అనుమానాలకు కారణమౌతుంది.

              వీరికి గొడవలంటే భయం.అలవాటు లేని క్రొత్త పనులంటే భయం..ఎదిరించాలంటే భయం... సూటిగా మాట్లాడలంటే భయం.... చేయక చేయక ఏవో పనులూ లేదా వ్యాపారాలు చేస్తారు. నష్టపోతారు. మళ్లి ఆ పనులు చేయాలంటే భయం..... సమస్యలకు కారణమయ్యే నిజాలు మాట్లాడాలంటే భయం.... ఇలా చెబుతూపోతే వీరిలో ఒక భయాల బ్యాంకే ఉంటుంది.

విచిత్రమేమిటంటే -
వీరికి గొడవలంటే ఎంత అయిష్టమో.. అంతగా వీరి చుట్టూ గొడవలు పేరుకుపోయి ఉంటాయి. తరుచూ గొడవలు ఎదురౌతుంటాయి.

వీరికి "ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లు ముక్కు సూటిగా మాట్లాడే కోపిష్టులైన వ్యక్తి " జీవిత భాగస్వామిగా లభిస్తారు.వీరిలో భయం తొలగిపోనంతవరకు .. జీవిత భాగస్వామిలో కోపం తొలగిపోదు.నిజానికి వివాహం తర్వాత జీవితభాగస్వామి వల్లనే వీరు అభివృద్ధి సాధిస్తారు.కానీ తన సమస్యలకూ - అశాంతికి కారణం జీవితభాగస్వామే అని భావిస్తారు.

ఈ మొదటి తెగ మంచివాళ్లకు ప్రధానమైన ఆసక్తులు
 1. రకరకాల రుచులు.
 2. నిద్ర
 3. కామ సుఖం
 4. ఎంటర్ టైన్ మెంట్ (వినోదాలు).

సాధారణంగా ఏ వ్యక్తి అయినా "తాను ఏ ఆసక్తుల వల్ల ఆనందాన్ని పొందుతున్నాడో అవే సుఖాలను తనకు ఇష్టమైన వారికి అందించాలనుకుంటాడు. "

ఈ మొదటి తెగ మంచివాళ్లు కూడా రకరకాల రచికర పదార్థాలను బయటి నుండి ఇంటికి తెచ్చి తమ పిల్లలకు అందిస్తుంటారు.

ఉదయాన్నే పిల్లలను నిద్ర లేపే జీవత భాగస్వామిని చూసి "పాపం అలిసిపోయారు. పడుకోనీ!!" అంటూ వారించి 9 గం॥వరకు పడుకోబెడతారు.

తన సంతానంతో కలిసి వాట్సాప్ వీడియోలు.. పేస్ బుక్ పోస్ట్లు .. TV ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేస్తారు.

తనలోని భయం కారణంగా జీవిత భాగస్వామిలో ప్రతిబింబించే ఆవేశాన్ని వర్ణిస్తూ తన పిల్లలతో జోకులేస్తుంటారు.

ఎక్జిబిషన్ - టూర్లు వెళ్లినప్పుడు గిర్రున తిరిగే చేర్ ఆట - గుర్రాలు - ఒంటెలు వంటి వాటిని ఎక్కి తాను సాహసవంతులమని నిరూపిస్తూ వాటిని ఎక్కని జీవిత భాగస్వామిని భయస్తులు అంటూ గేళి చేస్తుంటారు.

వీరికి దయ్యాల సినిమాలంటే ఆసక్తి. వాటిని ఇతరులతో - పిల్లలతో కలసి చూస్తూ ..చూడలేని భాగస్వామిని ఆటపట్టిస్తుంటారు.

... ఇలా పిల్లలకు కూడా మంచి వారైపోతారు.

ఎదురైన బంధువులకూ - మిత్రులకూ "ఎండలో తిరగకండీ! వేళకు బోంచేయండీ!!ఆరోగ్యం జాగ్రత్త!!! బాగా రెస్ట్ తీసుకోండీ!!!!...ఇలాంటి జాగ్రత్తలు - తియ్యటి మాటలు చెబుతూ అందరికీ మంచి వారైపోతారు.

ఇంటిలో అతి ముఖ్యమైన డెవలప్ మెంట్స్ - ఫంక్షన్లు వచ్చినపుడు బాధ్యత అంతా భాగస్వామే చూసుకోవాలి. వీరు చెప్పిన పని మాత్రమే చేస్తారు.

.... ఇలా చెబుతూ పోతే ఒక పుస్తకమౌతుంది.

మొత్తం మీద .. ఇలా.. ఇలా.. భయానికి మంచితనం అనే పేయింట్ వేసి ఈ మొదటి తెగవాళ్లు మంచివాళ్లై పోతారు.


 2. ఇక రెండవ తెగ మంచివారు సత్వగుణ ప్రధానమైనవారు.అంటే తన తన బలహీనతలను - ఆవేశాలను అవగాహన చేసుకుని వాటిని జయించి, ఇంద్రయ నిగ్రహం కలిగి, రాగ -ద్వేషాలకు అతీతమైన ప్రేమను అనుభవంలోకి తెచ్చుకున్న అచ్చమైన మంచివాళ్లు.


స్వస్తి

ధన్యవాదములతో

గురుమంచి రాజేంద్రశర్మ






సంపద

సంపద

    

సంపద అంటే సమృద్ధి, సాధించబడినది అనే రెండు అర్థాలు.
తృప్తి పరిచేది - అవసరాలను తీర్చేది సంపద.
సంపద రెండు రకాలుగా సృష్టించబడుతుంది.

1) .ఇతరుల అవసరాలను నెరవేర్చగలిగే శక్తి పెరుగుతున్న కొద్ది సంపద సృష్టి జరుగుతూ ఉంటుంది.
ఒక కూలి నుండి బిల్ గేట్స్ వరకు ఎవరినైనా గమనించండి. వారు ఇతరుల అవసరాలను ఎంతగా నెరవేరుస్తూ ఉంటారో అంతగా వారి వద్ద సంపద వృద్ధి పొందుతూ ఉంటుంది.
శారీరకంగా - మానసికంగా -బౌద్ధికంగా - ఆథ్యాత్మికంగా ..... ఏ రకంగానైనా ఇతరుల అవసరాలను తీర్చగలిగే శక్తే, శ్రీమంతుడు కావడానికి ప్రధాన కారణం.
ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది.
ప్రస్తుత క్షణంలో డబ్బు వచ్చినా - రాకున్నా మనసులో అసంతృప్తి లేకుండా పూర్ణ భావస్వేచ్చతో ఇతరుల అవసరాన్ని ఎంతగా తీరుస్తుంటామో అంతగా మన అదృష్ట ద్రవ్యనిధి పెరుగుతుంది. ఫలించే సమయం వచ్చినపుడు అది డ్రా చేయబడి ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది.కాబట్టి ఇతరులకు సహాయం చేయడమంటే మన అదృష్ట ద్రవ్యనిధి పెంచుకోవడమే!
ఇక్కడ ఇతరుల అవసరాన్ని నెరవేర్చి పేరూ- గుర్తింపు రాలేదని బాధ పడితే పూర్తి ఫలితం రాదు. ఎందుకంటే ఇతరుల అవసరాన్ని నెరవేర్చడంలో పూర్ణ భావస్వేచ్చతో వ్యవహరించలేదని అర్ధం.

ఇక రెండవది

2).క్రియాశక్తి వల్ల

లక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపమని పురాణాలు వర్ణిస్తున్నాయి.
సంపద అనేది శ్రమకు ప్రతిఫలం .
శ్రమించడం వల్ల కూడా సంపద సృష్టి జరుగుతుంది.
శ్రమించే తత్వం పెరుగుతూ తనలో ఉన్న ఇచ్చాశక్తినీ... జ్ఞాన శక్తిని క్రియా రూపంలోకి మార్చడం వల్ల సంపద సృష్టించబడుతూ వుంటుంది.
ఇక్కడ కూడా గమనించవలసిన విషయం ఒకటుంది.
జ్ఞానం పెరుగుతున్నా కొద్ది శరీరం యొక్క అవసరం, శ్రమించే అవసరం తగ్గుతుంది.
ఉదాహరణకు...
ఒక వ్యక్తి రోజంతా రాళ్లు కొట్టి సంపాదించిన ఆదాయం కన్నా ఒక ఇంజనీయర్ ఒక గంట కష్టపడితే వచ్చే ఆదాయం ఎక్కువ. దాని కన్నా అటువంటి ఇంజనీయర్లను పనిలో పెట్టుకున్న బిల్ గేట్స్ లాంటి యజమానుల ఆదాయం ఎక్కువ.
కాబట్టి సంపద సృష్టిలో అతి ముఖ్యమైన విషయాలు.1. ఇతరుల అవసరాన్ని నెరవేర్చగలిగే నెైపుణ్యం.2.జ్ఞానం 3. శ్రమ
ఇక్కడ జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి.
కేవల పుస్తక (లేదా వినికిడి ) జ్ఞానం, అనుభవజ్ఞానం అని జ్ఞానం రెండు రకాలు.నిజానికి మొదటిదైన కేవల పుస్తక (లేదా వినికిడి ) జ్ఞానం అనేది జ్ఞానం క్రిందకు లెక్కలోకి రాదు.
ఇది Copy &  Paste లాంటిది.ఇతరుల వద్ద ఉపన్యాసాలు దంచడానికి - తాత్కాలికంగా పొందే బ్రమాత్మకమైన కీర్తి కోసం తప్ప ఎందుకూ పనికి రాదు.ఆ జ్ఞానం అనుభవం లోకి వచ్చినప్పుడే అది నిజమైన జ్ఞానం అవుతుంది.
జ్ఞానం అనేది షడైశ్వరాలలో ఒకటి.అనుభవ జ్ఞానంలో నైపుణ్యం - ధైర్యం - ఆ జ్ఞాన ఫలితం పోయినా మళ్లి సృష్టించగలనన్న విశ్వాసంలో కూడిన వైరాగ్యం - వృద్ధి పొందిన కాన్సన్ట్రేషన్ & కాన్సియస్ పవర్... ఇలా మిగతా  ఐశ్వర్యాలు అంతర్భూతంగా ఉంటాయి.
కేవల పుస్తక (లేదా వినికిడి ) జ్ఞానంలో ఇవి ఉండవు.
కొంత మందికి మేము రోజంతా శ్రమపడు తాము.కానీ ఆదాయం తక్కువ అనే భావన ఉంటుంది. 1)వారు ఇతరుల అవసరాన్ని నెరవేర్చగలిగే నెైపుణ్యం 2)జ్ఞానం అనే రెండు లక్షణాలను పెంచుకోవాలి.
కొంత మంది జ్ఞానం బాగానే ఉంది. అయినా ఆదాయం తక్కువ. సరస్వతి ఉన్న దగ్గర లక్ష్మీ ఉండదు అంటూ సర్దుకుపోతుంటారు. వారు తమ జ్ఞానాన్ని అనుభవ జ్ఞానంగా మార్చుకోవడంతో పాటు 1)వారు ఇతరుల అవసరాన్ని నెరవేర్చగలిగే నెైపుణ్యం 2. శ్రమ అనే రెండు లక్షణాలను పెంచుకోవాలి.
ఈ రెండు రకాలుగా కాకుండా ఇతరుల చే సృష్టించబడిన సంపదను కొల్లగొట్టేవారు కొందరుంటారు. వీరు ఇహ-పర లోకాలలో పతనం చెందుతారని శాస్త్రం చెబుతుంది.
ఎందుకంటే....
సంపద అంటే డబ్బు - బంగారం కాదు. అవి సంపదకు బదులుగా వినియోగించే వినిమయాలు మాత్రమే!
ఒక దేశంలోని డబ్బుకు మరో దేశంలో విలువ ఉండదు. అలాగే భూలోకంలో ఉండే వినిమయాలు మరో లోకంలో చెల్లబడి కావు.
కానీ, ఇతరుల అవసరాలను తీర్చగలిగే నెైపుణ్యశక్తి.... క్రియాశక్తి ఆ జీవుడు ఏ లోకంలో ఉన్నా సంస్కార రూపంలో వెన్నంటి ఉండి అతన్ని ఐశ్వర్యవంతుడు గా నిలుపుతుంది.
స్వస్తి
ఓపికగా చదివిన వారికి ధన్యవాదములతో
మీ గురుమంచి రాజేంద్రశర్మ

Tuesday, 4 October 2016

బతుకమ్మ పండగ

(ఇది బతుకమ్మ పండగ గురించి ఒక సుదీర్ఘ వ్యాసం. తెలంగాణాలో నివసించే ప్రతీ వ్యక్తి చదవవలసినది. చదివి షేర్ చేసి బతుకమ్మ పండగ విశిష్టతను అందరికి తెలియజేయండి.)



బతుకమ్మ పండగ - విశిష్టత - విశేషాలు
-----------------------------------------------

బతుకమ్మ పండగ..
తెలంగాణ ప్రాంత ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకొనే ముచ్చటైన పండగ.
బతుకమ్మ పండుగ ...
ప్రకృతిని అరాధించే అతి పెద్ద పండుగ.
బతుకమ్మ పండుగ ...
తెలంగాణా అస్తిత్వాన్ని సజీవంగా నిలిపి ఉంచిన పండగ.
ఇది కులాల కట్టుబాట్లు, ధనికులమనే అహంకారాలు లేని పండుగ.
కట్టుబాట్లన్నీమనుషులకే కాని నీటికి, పూలకూ లేవని చెబుతూ అందరూ సామరస్యంగా కలిసి మెలిసి జరుపుకునే పండగ.
తెలంగాణ ప్రాంత సంస్కృతీ సంప్రదాయాలకు అద్ధం పట్టే పండుగ.
వేల సంవత్సరాల నుండి  సజీవంగా కొనసాగుతున్న ప్రజా పండుగ బతుకమ్మ పండుగ .  (కాకతీయ రాణి రుద్రమ దేవి కూడా ఈ బతుకమ్మ పండుగను వైభవంగా జరిపించేదని చెబుతారు.)
తమ భర్తల బతుకు బాగుండాలని, వారికి దీర్ఘాయువు ఉండాలని సౌమంగళ్యాన్నీ- సౌభాగ్యాన్ని కోరుతూ తెలంగాణా ఆడపడుచులు పూజించే పండగ ఈ బతుకమ్మ పండుగ .
రాబోయే కాలంలో యౌవనవంతురాలమయ్యే తాము సకల సౌభాగ్యాలతో జీవించడానికి అన్ని విధాలా యోగ్యుడైన భర్త లభించాలని ప్రకృతికి బాలకన్యలు  కైమోడ్పు నివేదనలు సమర్పించే పండగ.
దేవుడికి పూజ చెయ్యడానికి పువ్వును వాడుకుంటాము, కాని పువ్వునే దేవుడిగా మొక్కే పండుగ ఈ బతుకమ్మ పండుగ.
ఐక్యతాభావంతో అందరినీ ఏకం చేసే పండుగ... ఏకం చేసి విజయం సాధించిన పండుగ . ఇంకా ఎన్నో విజయాలను అందించే పండుగ .
నేలకూ, నీళ్ళకు, అడుగుకూ,  నుడుగుకూ ఉన్న సహజ సంబంధాన్ని చాటిచెప్పే పండుగ ఇది.
ఆడబిడ్డల ఆత్మీయతల మధురిమలను పంచే పండుగ ఈ బతుకమ్మ పండుగ.
వేల వేల జానపద గీతాలు వెల్లువెత్తే పండుగ .
ఒక్క మాటలో చెప్పాలంటే...
మానవ సంబంధాల సారాంశమే ఈ బతుకమ్మ పండుగ.
ఇది స్త్రీల పండుగ - శ్రీ ల పండుగ
సమూహికంగా చేసే "శక్తి ఉపాసన "
బతుకమ్మ గురించి తెలుసుకోవడమంటే...
సంస్కృతి గురించి తెలుసుకోవడం,
తన గురించి తెలుసుకోవడం, తన ఆత్మ గురించి తెలుసుకోవడం, అంటే సమస్తమూ తెలియడమే!

‘బతుకమ్మ’ అంటే "బ్రతుకునిచ్చే అమ్మ - బ్రతుకుదెరువును మెరుగు పరచే అమ్మ - 'బ్రతుకు కు 'అంటే తనలోని ఆత్మచైతన్యానికి కారణమైన అమ్మ " అని అర్థం.

పోతన వర్ణించిన " అమ్మలగన్న అమ్మ-ముగ్గురమ్మల మూలపుటమ్మ' నే ఈ బతుకమ్మ.
ఇది తెలంగాణా ప్రజలు ఉమ్మడిగా - సమూహికంగా చేసే శ్రీవిద్యోపాసన.

లలితా సహస్ర నామంలో .....
ఓం ప్రాణదాయై నమ:
ఓం ప్రాణరూపిణ్యై నమ:
ఓం ప్రాణేశ్వర్యై నమ:
ఓం ప్రాణదాత్ర్యై నమ:
...అంటూ కీర్తించబడే జగద్ధాత్రే మన బతకమ్మ.

ఈమే...
"ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి".

ఈమే...
"చైతన్యార్ఘ్య సమారాధ్యా చైతన్య కుసుమప్రియా"

ఈమే...
"ఉదార కీర్తి రుద్దామ వైభవా వర్ణరూపిణీ |
జన్మమృత్యుజరాతప్త జన విశ్రాంతిదాయినీ || "

ఈమే...
"అనఘాZద్భుతచారిత్రా వాంఛితార్థ ప్రదాయినీ "

అటువంటి "బతుకమ్మ ఉత్సవాలు" ఈ మహాలయ అమావాస్య నుండి ప్రారంభం అయ్యాయి.

తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ, దసరా (విజయ దశమి) అనేవి రెండు పెద్ద పండుగలు .

ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కలయకలతో నిండిపోయుంటుంది.

అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ.

రంగు రంగుల పూలతో శ్రీచక్ర మేరు ఆకారంలో పేర్చి అలంకరించి- పరా బిందువు స్థానంలో పసుపు గౌరిని నిలిపి పూజించి... బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలను, ఆటనూ విని, చూసి తరించాల్సిందే కానీ వర్ణించడం కష్టమే!

ఈ పండగ "బొడ్డెమ్మతో మొదలై ఎంగిలిపుప్వు బతుకమ్మ,.... సద్దుల బతుకమ్మ వరకు  "... ఇలా దేని ప్రత్యేకత దానిదే!

తొమ్మిది  నుండి పదకొండు రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను చెరువులలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు..

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, ఆశయాలు, కోరికలు , చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి..

బతుకమ్మ పండగ వస్తూందంటే తెలంగాణా పల్లెల్లో నూతన వుత్సాహం వెల్లి విరుస్తుంది. అది ఒక పెద్ద సంబరంగా భావిస్తారు. ఇళ్ళు శుభ్రపరుస్తారు. చక్కగా అలంకరించు కుంటారు. ఆడ పిల్లల్ని పుట్టింటికి తీసుకు వస్తారు. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలను పెద్ద ముత్తైదువలు బుగ్గలపై చేతులేస్తూ ప్రేమగా పలకరిస్తుండడం వల్ల వారి బుగ్గలు ఎరుపెక్కుతుంటాయి.

ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుకపూలు, తంగేడి పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, కనకాంబరం , నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ.  అలాగే జొన్న పంట కోతకు సిధ్ధంగా తలలూపుతూ ఉంటుంది. పచ్చగా పెరిగే పైరు సంపద, విరబూసిన చెట్లతో ప్రకృతి సౌందర్యమయంగా వుంటుంది. వీటన్నింటి నేపధ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్నంతా అద్భుతమయిన రంగురంగుల పువ్వులలోకి ఆవాహనం చేసి రకరకాల జానపద గీతాలతో కీరిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.

తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్ఠమైంది. ఉద్యమ సందర్భాలలో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్థిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది.

ఈ పండుగ చివరి రోజును "సద్దుల బతుకమ్మ " అని పిలుస్తారు. దీనికి తొమ్మిది  నుండి పదకొండు రోజుల ముందుగా తమ తమ ప్రాంత ఆచారాన్ని బట్టి ఈ బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమౌతాయి. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు.ఈ వారం రోజులలో వీరు రోజూ చిన్న బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం దాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.

అయితే చివరి రోజు అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడి, గునుక పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిళ్ళపాదీ కూర్చుని ఆ గునగ పూలు, తంగేడు,కలువ, మరియు ఇతర రకాల పూలతో బతుకమ్మని తయారు చేస్తారు. ఇందులో గునగ పూలు మరియు తంగెడు పూలు ముఖ్య భూమిక ను పోషిస్తాయి.

ఆడ పడుచులు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను ధరించి కొత్త బట్టలు కట్టుకుంటారు.  తలలో పూలుతురుముకుని, చేతుల నిండా గాజులు ధరించి అందంగా ముస్తాబౌతారు.
తరువాత తీసుకువచ్చిన పూలని జాగ్రత్తగా ఒక పెద్ద రాగి లేదా ఇత్తడి పళ్ళెం లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగెడు ఆకులు, పూలు  పేర్చుతారు, ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను చివరలు కోసి రంగులతో అద్దిన వాటిని పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు.

బతుకమ్మను పేర్చడం కూడా ఒక కళ. తంగెడు పువ్వు, బంతిపువ్వు, గునుగుపువ్వు, గుమ్మడి పువ్వు, తీగమల్లె, మంకన పువ్వు, ఛెత్రి పువ్వు, గులాబి, పోకబంతి, కనకాంబరాలు, గన్నేరుపూలు, గోరెంకపూలు, , ఇట్లా ఎన్నో రకాల పువ్వులు బతుకమ్మలో కొలువుదీరుతాయి..
ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది, మధ్యలో తంగేడి పూలను పెడతారు. పేర్చడం అయ్యాక పైన 'పసుపుతో చేసిన గౌరి మాతను 'పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. దీనిని గృహంలో దైవ స్థానంలో అమర్చి పూజిస్తారు.  తరువాత బతుకమ్మను ఎదుర్కోలుగా తీసుకుని వచ్చి ఒక విశాల ప్రదేశంలో నిలుపుతారు. చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారి వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి  పెద్ద వలయాకారంలో బతుకమ్మలన్నింటిని నిలుపుతారు. ఇలా తయారు చేసిన బతకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడపడుచులు ఆడుతారు -పాడుతారు. 
ఐక్యత, సోదరభావం, ప్రేమను కలపి రంగరిస్తూ మానవ హారం ఏర్పరిచి పాటలు పాడుతారు. ఒకరు ముందుగా పాట మొదలుపెడితే మిగిలినవారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు. ఈ సందర్భంలో తమ తమ శక్త్యానుసారం వెండి - బంగారు పొన్నులతో అలంకరించబడిన నగిషీలు చెక్కిన కోలలను ఒక లయ గా వేస్తూ జానపద గీతాలు పాడుతుంటారు.

ఈ జానపద గీతాలు చుట్టుప్రక్కల ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణా సంస్కృతిని ఆవిష్కరిస్తాయి.  చీకటి పడుతుంది అనగా,స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువు గానీ, తటాకంవైపు గానీ ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న స్త్రీలు, బతుకమ్మలతో అత్యంత సుందరంగా, వైభవోపేతంగా, శోభాయమానంగా ఉంటుంది.

ఈ ఊరేగింపు కొనసాగినంత సేపూ, జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి.  డప్పుల దరువు, చప్పట్లు,దరువులు, కోలాటాలు ఉత్సాహంగా ఊరిని కదిలిస్తుంటాయి. ఈ విధంగా జలాశయం చేరుకున్న తరువాత, మెల్లగా  పాటలు పాడుతూ,ఆడుతూ చివరగా మరోసారి బతుకమ్మలను పూజించి ,దానిపై నున్న ‘పసుపు గౌరమ్మకు’ భక్తితో నమస్కరించి, తమ మాంగల్యాన్ని కాపాడమని ఆ గౌరమ్మను తాళితో స్పృశిస్తారు.అనంతరం నైవేద్యాలను సమర్పిస్తారు.

ఈ నైవేద్యాలన్నీ ప్రత్యేకమైనవీ - అమ్మవారికి ఇష్టమైనవి. 
ఉత్సవాలు మొదలైనప్పటి నుండి రోజుకు ఒక నైవేద్యం చొప్పున ప్రత్యేకంగా సమర్పిస్తారు.చివరి రోజు మాత్రం అన్ని నైవేద్యాలను  సమర్పిస్తారు.

అమ్మవారు "హరిద్రాన్నైక రసికా" అందుకని పులిహోర ..

ఆమే "ముద్గౌదనాసక్త చిత్త" . అందుకని పులగం లేదా పెసర్లు తో చేసిన తీపి పదార్థం.

ఆ తల్లి " దధ్యన్నాసక్త హృదయ " . అందుకని.. పెరుగన్నం లేదా దధ్ధోజనం.

ఆమే " గుడాన్న ప్రీత మానసా" . అందుకని .. బెల్లపు అన్నం

అమ్మవారికి 'పాయసాన్న ప్రియా' అని పేరు. అందుకని .. పాయసన్నం

ఆమే 'స్నిగ్దౌదన ప్రియా' అందుకని.. నెయ్యితో కలిపిన అన్నం

.... ఇంకా రకరకాల పప్పు దినుసులు - ధాన్యాలు -  నెయ్యి - చక్కెర.. మొ॥ వాటితో చేసినవి.దీనిని "సమిలి " "సత్తు పిండి ", "మలీదా "అని  ప్రాంతాలను బట్టి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు.
... ఇలా తమ తమ ఇంటి సాంప్రదాయం ప్రకారం తీసుకువచ్చిన నైవేద్యాలను బతుకమ్మలకు నివేదన చేస్తారు.

ఆ తరువాత బతుకమ్మలను నీటిలో జారవిడుస్తారు - నిమజ్జనం చేస్తారు.
బతుకమ్మను నిమజ్జనం చేయడం లో కూడా ఒక పద్ధతి వుంటుంది. మోకాళ్ల వరకు నీళ్లలో దిగాక... నీటిమీద బతుకమ్మ పళ్లెం ఉంచి, ఇంకా కొంచెం దూరం నడిచి తేలుతున్న బతుకమ్మనుంచి ఆ పళ్లాన్ని మెల్లగా కిందకి ఒత్తి పైకి తీస్తారు. నీళ్లపై తేలుతున్న బతుకమ్మను అలలతో ముందుకు నెట్టుతారు.

తేజస్సును శ్వాసిస్తూ, దశదిశలకూ జీవం ప్రసాదిస్తూ, పూలన్నీ యోగులై, ఉపనిషద్ఘోషలై, నదీమతల్లి జలతరాంగాలలో తమను తాము కైమోడ్పు చేసుకుంటాయి. ఆ ఆనంద పారవశ్యంతో పూలబాలలు, నదులూ, చెరువులపై తేలుతూ పూల సెజ్జలుగా మారే అద్భుత దృశ్యమది.

ఆ అద్భుత దృశ్యానికి నమస్కరించి - మనసారా వందనాలు సమర్పించి ఆడపడుచులందరూ వెనక్కి తిరిగి వస్తారు.

వస్తూ వస్తూ పళ్లెంలో కొన్ని నీళ్లు తెచ్చి,ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటిని అందరిపై చల్లి అవభృత ప్రోక్షణం చేస్తారు.

ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు.
అందరూ ఒకచోట కూర్చొని ప్రసాదాలనూ - నైవేద్యాలను ఇచ్చి పుచ్చుకుంటూ భుజిస్తారు.
ఈ సందర్భంగా అంతవరకు ద్వేషభావనలతో ఎడమొహం - పెడమొహంగా ఉన్నవారు సైతం తమ ద్వేషభావాలను తొలగించుకుని మిత్రులౌతుంటారు.ఈ బతుకమ్మ పండగ కొంగ్రొత్త స్నేహా సంబంధాలకు వేదికగా మారుతుంది. ఇక్కడ అన్ని కులాల వారూ చేరి ఐక్యతను, స్నేహాన్ని, గ్రామ బంధుత్వాన్ని కళ్లకు కట్టేలా ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటారు.

ప్రదోష కాల సమయంలో క్రమేపీ నల్లటి నీడలు నడుం వాల్చగా ఆ మహిళాలోకం నిట్టూర్పులు విడుస్తూ...

‘‘పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ
మల్లొచ్చె యాడాది తిరిగి రావమ్మా’’

అంటూ....

శ్రీలక్ష్మి నీమహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా
ఎన్నెన్నో రూపముల - ఏడేడు లోకముల
ఉన్న జనులకు కోర్కెలన్ని సమకూర్చేవు’’ అని పాడుకుంటూ
ఇంటి ముఖం పడుతుంది.

... ఇలా బతుకమ్మ ఉత్సవాలు ముగుస్తాయి.

.....ఇదంతా భావుకులకు కనిపించే బాహ్యదృశ్యమయితే, ఈ సంప్రదాయం వెనుక దీటుగా నిలిచే శాస్త్రీయత కూడా వుంది.
వర్షం పుష్కలంగా పడినప్పుడు మాత్రమే పుష్పించే తంగేడు, గునుగు పూలు తలలో పెట్టుకొనే సుగంధ పుష్పాలు కావు. ఈ పూరేకులలో, ఆ పుప్పొడిలో దాగున్న సహజ రసాయనాలకు నీటిని శుభ్రపరచే గుణం వుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఇవి పర్యావరణాన్ని కాపాడే రక్షక కవచాలు.
ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది.

పూలతో చేసిన బతుకమ్మలకు ఉన్న మహాత్మ్యం కాగితం బతుకమ్మలకు లేదు.

ప్రస్తుతం విపరీతమైన జనారణ్యాలతో, గృహారణ్యాలతో నేల, నింగి నిండి పోతున్నాయి.
ప్రకృతికి మానవుడు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
అందుకని కొన్ని ఆధునిక గృహాలలో కాగితపు పూలు, ప్లాస్టిక్‌ ఆకులు, పూలతో కూడిన బతుకమ్మలు నిండిపోతున్నాయి.

వీటి కోసం ఏ మధుపం ఝంకారం చేయదు.
ఏ భ్రమరము పరిభ్రమించదు.వీటిలో  ప్రకృతి శోభ పండదు.

అమ్మవారికి "బ్రమరవాసినీ " అని పేరు.

ఏ బతుకమ్మల చుట్టూ బ్రమరాలు తిరుగుతుంటాయో ఆ బతుకమ్మలు గల ఇల్లు ధన్యం. ఇది ఆ పూజ ఫలించి సిద్ధి పొందిన దానికి నిదర్శనం.

కాబట్టి వీలైనంత వరకు కాగితపు బతుకమ్మలను వాడకుండా పూల బతుకమ్మలను పూజించడం వల్లనే సరియైన ఫలితం సిద్ధిస్తుంది.

తెలంగాణ ప్రాంత సాంస్కృతిక వారసత్వ సంప్రదాయాలను నిలబెట్టే బతుకమ్మ- రజాకర్ల ఆగడాలను తట్టుకొని నిలబడ్డ మహత్తర పండుగ.

అందుకే బతుకమ్మను తెలంగాణ సమాజం గుండెకు హత్తుకొని మరీ అస్తిత్వాన్ని కాపాడుకునే సాధనంగా మార్చుకుంది.

అందుకే బతుకమ్మ పండుగ అంటే ఓ అనిర్వచనీయమైన ఆనందం.
ఒక అద్భుతమైన అనుభూతి.

ఈ సుదీర్ఘమైన వ్యాసాన్ని ముగించే ముందు..

ఈ పండుగ పూట ప్రజలందరూ సుఖసంతోషాలతో బతుకమ్మను జరుపుకోవాలని కోరుకుంటూ.. మీ అందరికీ బతుకమ్మపండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.

(ఈ వ్యాసంలో బతుకమ్మ గూర్చిన పరిశోధనాత్మక రచనల నుండి కొంత సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. వారందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.)

నమో దేవ్యై మహా దేవ్యై శివాయై సతతం నమః l
నమః ప్రకృత్యై భద్రా యై నియతా : ప్రణతా : స్మతామ్ l l

అర్ధము :-

'' దేవికి , మహాదేవికి నమస్కృతులు.
నిత్య శుభంకరియై మనందరికి సకల శుభాలు ప్రసాదించే ఆ తల్లికి ఎల్లప్పుడును   వందనాలు సమర్పిస్తున్నాము.
మూల ప్రకృతియు , ఎల్లప్పుడు మమ్మలను రక్షించే రక్షాశక్తియు అగు ఆమెకు నమస్కారములు. నియత చిత్తుల మై మేము ఆమెకు సదా ప్రణ మిల్లుచున్నాము .

                     స్వస్తి
        (ఓపికగా చదివిన వారికి )
              ధన్యవాదములతో

        గురుమంచి రాజేంద్రశర్మ.



ఈ వ్యాసాన్ని డౌన్లోడ్ చేసుకోవాలని అనుకునేవారు ఈ క్రింది లింక్ నుండి చేసుకోవచ్చు.





Friday, 9 September 2016

కాలయాపనం అనే విఘ్నాన్ని తొలగించే మహాగణపతి


వినాయక నమోస్తుతే! - 5


------------------------------





రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

మన అభివృద్ధిని నిరోధించే విఘ్నాలలో మరొకటి కాలయాపనం .

5. కాలయాపనం

-------------------------

ఈ " కాలయాపనం " అనే విఘ్న బీజం మన దేశంలో ఎక్కువ మందిలో కనిపిస్తూ వుంటుంది.

కాలయాపనం అంటే " పనులను వాయిదా వేయడం".

సమయం అందరికి సమానమే అయినా కొంత మంది మాత్రమే తన సమయాన్ని అవసరమూ, ఉపయోగకరమైన పనులు చేయడానికే ఉపయోగిస్తారు.  వీరు అభివృద్ధిలో మిగతా వారి కంటే ముందుంటారు.

చాలా మంది అనవసర కాలక్షేపం కోసం సమయం కేటాయిస్తారు.ఈ విధంగా అనవసర కాలక్షేపం చేసేవారు అభివృద్ధి విషయంలో విఘ్నాలను ఎదుర్కుంటారు.

" కాలయాపనం " అనే విఘ్న బీజం కలిగిన వ్యక్తి అన్ని విషయాలను ఆలస్యం చేస్తూ సమయాన్ని దుర్వినియోగం చేస్తుంటాడు.

" మన అంతరంలో ఉన్న స్వభావాన్ని బట్టే మనకు జరిగే సంఘటనలు ఉంటాయి. "

స్వభావాలు అనేవి బీజాలైతే.. జరిగే సంఘటనలు అనేవి వాటి ఫలాలు.

పనులను వాయిదా వేసే స్వభావం ఉన్నవారికి  జరగవలసిన శుభాలు కూడా వాయిదా పడుతుంటాయి.

ఈ కాలయాపనం అనే విఘ్నం నాలుగు రకాలు.
1)  శారీరకం
2) మానసికం
3) బౌద్ధికం
4) ఆథ్యాత్మికం

ఈ నాలుగు రకాల కాలయాపనలు కూడా అభివృద్ధికి అతి పెద్ద ఆటంకాలు.వాటి గూర్చి కొంత వివరంగా తెలుసుకుందాం!

1) శారీరకం 
-------------------
"శరీరంతో చేయవలసిన అవసరమూ, ఉపయోగకరమైన పనుల పట్ల ఏకాగ్రత లేకపోవడం వల్ల పనులను వాయిదా వేయడం" - ఈ శారీరక విభాగంలోకి లోకి వస్తుంది.

మన అభివృద్ధికి అవసరమైన 50% విషయాలు ఇందులోనే ఉంటాయి.

నిజానికి ఎవరికైనా మొదటి అవసరమూ, ప్రాధాన్యత ... ఆరోగ్యమే!

కాని, ఆరోగ్యంగా ఉండడానికి చేయవలసిన వాకింగ్ - వ్యాయామం - ఆరోగ్యకరమైన ఆహారం - ఆరోగ్యకర నిద్ర.. మొ|| వాటి విషయం లోని ఆచరణను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటాము. దీని వల్ల భవిష్యత్తులో ఆరోగ్యం విషయంలో విఘ్నాలు ఏర్పడి,అది మిగతా అన్ని రకాల అభివృద్ధి పై ప్రభావం చూపిస్తుంది.

ఇది కారులో ప్రయాణం చేస్తూ అత్యవసర తొందర ఉండడం వల్ల కారులో ఇంధనం ( పెట్రోలు.. etc.. Fuel) మరిచిపోవడం లాంటిది.

ఇంకా ఇందులో ...
మన అభివృద్ధి కీ, అదనపు ఆదాయం కోసం శరీరంతో  వెంటనే అమలు చేయవలసిన పనులను వాయిదా వేయడం ...
ఇంటికి అవసరమైన పనులూ - రిపేర్లు వాయిదా వేయడం ...
తాను గానీ, తన పిల్లలు గానీ శరీరంతో నేర్చుకునే డ్రైవింగ్ - స్విమ్మింగ్ లాంటి పనులను వాయిదా వేయడం ...
.... ఇలా చివరకు సమయానికి నిద్ర లేవకపోవడం - తినకపోవడం - స్నానం చేయకపోవడం - పడుకోకపోవడం వంటి అనేక విషయాలు ఈ విభాగంలోకే వస్తాయి.

ఇది క్రియాశక్తికి సంబంధించినది.క్రియాశక్తిని భారతీయ తాత్వికులు లక్ష్మీదేవి అని పిలుస్తారు.

ఈ శారీరక కాలయాపనం చేసే విఘ్న బీజం వల్ల ఆర్థిక అభివృద్ధి - కీర్తివృద్ధితో సహా అన్ని రకాల ఎదుగుదలలు (అష్టలక్ష్మీ ప్రసాదించే ఐశ్వర్యాలు ) తగ్గిపోతుంటాయి.

2) మానసికం 
-------------------
ప్రధానంగా ఇందులో కుటుంబ సభ్యులతో, బంధువులతో, మిత్రులతో, సమాజంతో మానసిక బంధాలను వృద్ధిపరుచు కోవడాన్ని వాయిదా వేస్తుంటాము.

కాని, నిజంగా కష్టాలు వచ్చినపుడుగానీ, విజయాన్నీ పొందే సంధర్భంలో కాని అండగా నిలబడేది వీరే.

ఇది "బాగాలేని టైర్లు కలిగిన కారులో
దూర ప్రాంతానికి ప్రయాణించడం లాంటిది."

3) బౌద్ధికం 
------------------
ఇందులో అవసరమూ -
ఉపయోగకరమైన జ్ఞానసంబంధ
విషయాలు నేర్చుకోవడాన్ని వాయిదా వేస్తుంటాము.

కొంత మంది " పుస్తక పఠనం " వల్ల ఏం లాభం? అనుకుంటారు.

" ఒక మనిషి తన జీవితంలో సాధించిన అనుభవ జ్ఞానాన్ని ఒక మంచి పుస్తకం
అందిస్తుంది."

ఆ అనుభవ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం వల్ల మన జీవితంలో ఎంతో సమయం సద్వినియోగమై మనం అభివృద్ధి మార్గంలో మరింత ముందుకు వెళ్లగలుగుతాము !

తాత్వికంగా పరిశీలిస్తే ..
జ్ఞానం పెరిగినా కొద్ది తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని సాధిస్తుంటాము. అంటే శ్రమ చేసే అవసరం తగ్గుతుంది.

"నేను ఎంత శ్రమ పడినా ఫలితం ఉండడం లేదు" అని ఎవరైనా భావిస్తున్నారంటే వారు జ్ఞానాన్నీ వాయిదా వేస్తున్నారనే అర్థం.

శ్రమించడాన్ని మానకుండా జ్ఞానాన్ని పెంచుకుంటున్నా కొద్ది మనిషి అభివృద్ధి స్థాయి కూడా పెరుగుతుంది.

ఈ రకం కాలయాపన అనేది..
" బాగా రిపేర్లు అవసరమైన కారులో దూర ప్రయాణం చేయడం లాంటిది."

4) ఆథ్యాత్మికం
---------------------
   
     నిజానికి ఆథ్యాత్మికం అంటే "తన గురించి తాను తెలుసుకోవడం".

ఒక సాధకుడు తన గురించి తాను తెలుసుకుంటూ వెళ్లినా లేదా భగవంతుని గూర్చి తెలుసుకుంటూ వెళ్లినా చేరుకునే గమ్య స్థానం ఒక్కటే!

వేదంలో తన గురించి తాను తెలుసుకోవాలని అంతర్ముఖుడై తపస్సు చేసిన ఒక బుుషి సత్యాన్ని దర్శించిన తరువాత ఆనందంతో ఇలా గానం చేస్తాడు.

" హ➡ ఉ, హ➡ ఉ, హ➡ ఉ, "
అంటూ...

సంస్కృతంలో " అహమ్ "అంటే నేను అని అర్థం.

సత్యాన్ని దర్శించిన తరువాత " అహమ్ " లోని "హ ''అక్షరం "ఉ" గా మారిందట!

అంటే..

అహం = అ+ హ+ మ్➡ అ+ ఉ+మ్➡ ఓమ్

కాబట్టి తన గూర్చి తాను తెలుసుకోవడమన్నా, భగవంతుని గూర్చి తెలుసుకోవడమన్నా ఒకటే!

మనిషి ఆథ్యాత్మిక సాధనలను వాయిదా వేయ్యకుండా చూసుకోవాలి.

దీని వల్ల మన ప్రమేయం ఉన్నా,లేకున్నా మనకు అంటుతూ ఉండే అపవిత్రతల నుండి బయటపడతాము.

ఏ మనిషైనా తాను ఏ విషయాలపై ఏకాగ్రత చూపుతున్నాడు, ఏ విషయాలలో లీనమౌతున్నాడు అనే దాన్ని బట్టి అతని అభివృద్ధి ఉంటుంది.

1.కొందరు ఆహారం, నిద్ర, అనవసరవిందులు, అనవసర కాలక్షేపాలు, అధర్మకామం.. మొ|| వాటిలో తీవ్రమైన ఏకాగ్రతను చూపుతూ లీనమై తనను తాను మరచి పోతుంటారు.

2.కొందరు ఆవేశాలు, కోపం, దు:ఖం, రాగం, ద్వేషం.. మొ|| వాటిలో తీవ్రమైన ఏకాగ్రతను చూపుతూ లీనమై తనను తాను మరచి పోతుంటారు.

3.కొందరు డబ్బు, కీర్తి, అధికారం,  హోదా... మొ॥ వాటిలో తీవ్రమైన ఏకాగ్రతను చూపుతూ లీనమై తనను తాను మరచి పోతుంటారు.

4. మరి కొందరు జ్ఞానసంబంధ విషయాలలో లేదా కళా సంబంధ విషయాలలో  తీవ్రమైన ఏకాగ్రతను చూపుతూ లీనమై తనను తాను మరచి పోతుంటారు.

5.ఇంకా కొందరు భగవత్ భక్తిలో తీవ్రమైన ఏకాగ్రతను చూపుతూ లీనమై తనను తాను మరచి పోతుంటారు.

6.చాలా కొద్ది మంది తనను తాను మరచిపోకుండా ఎప్పుడూ కాన్సియస్ గా ఉంటారు.అంటే తన కాన్సియస్ మీదనే ఏకాగ్రతను కలిగి ఉంటారు.

ఏకాగ్రత శక్తి వృద్ధి చెందుతున్న కొద్ది మనిషి ఒక స్థితి నుండి తరువాత స్థితికి ఎదుగుతాడు. ఈ ఆరు రకాల ఏకాగ్రతలలో ఒకదానికన్న తరువాత వచ్చేది ఉత్తమం.

మొత్తం మీద ఆథ్యాత్మిక శక్తి పెంచుకోవడం అంటే కాన్సియస్ గా ఉండే స్థితిని పెంచుకోవడమే!

ఈ కాలయాపనం..
"ఎలాంటి వాహనం, రక్షణ , చిరునామా లేకుండా అతి కష్టమైన సదూర ప్రయాణానికి కాలినడకన బయలు దేరడం లాంటిది."

క్రియాశీలుడైన వ్యక్తి అన్ని రకాల కాలయాపనల స్వభావాలను తొలగించుకుంటూ ప్రతీక్షణం సన్నద్ధంగా ఉండాలి.అప్పుడు అతని వెంట శుభాలు పరుగులు తీస్తాయి .

ఈ "కాలయాపనం" అనే విఘ్న బీజం  వల్ల చాలా మంది అభివృద్ధి విషయంలో ఆటంకాలను ఎదుర్కుంటారు.
.
ఈ విఘ్న బీజం తొలగడానికి ప్రతి రోజు బ్రాహ్మీ ముహుర్తంలో లేదా సాయం సంధ్యా సమయంలో స్నానం చేసి వేయి సార్లు "ఓం శ్రీం హ్రీం క్లీం శీఘ్రకారిణే నమ: " అనే గణపతి మంత్రాన్ని మనసులో అత్యంత ఏకాగ్రతగా జపించాలి.



                 స్వస్తి .

(మరో రోజు గణపతి తొలగించే మరో విఘ్నం గూర్చి తెలుసుకుందాము.)

దంతకల్పలతా పాశరత్న కుంభాంకుశోజ్జ్వలమ్ |
బంధూకకమనీయాభం ధ్యాయేత్ క్షిప్రగణాధిపమ్ ||

                 (ఓపికగా చదివిన వారికి )
                       ధన్యవాదములతో

           గురుమంచి రాజేంద్రశర్మ





Wednesday, 7 September 2016

మహాగణపతి తొలగించే మరోవిఘ్నం - అవిరతి

వినాయక నమోస్తుతే! - 4

------------------------------




రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

మన అభివృద్ధిని నిరోధించే విఘ్నాలలో మరొకటి అవిరతి.

4. అవిరతి

(1. బిజీగా ఉన్నాననుకోవడం. 
మరియు 
2. నిగ్రహం లేకపోవడం)
---------------------------------------------

సంస్కృతంలో " అవిరతి " అనే శబ్దానికి రెండు రకాల అర్థాలు ఏర్పడుతున్నాయి.

1. " విరతి " అంటే విరామం..
" అవిరతి " అంటే విరామం లేనంత 'బిజి'గా ఉన్నాననుకోవడం...

2. " రతి " అంటే ఆసక్తి.
   " విరతి " అంటే ఆసక్తి లేకపోవడం.
" అవిరతి " అంటే ఆసక్తిని వదలకపోవడం (మనో నిగ్రహం లేకపోవడం)

ఈ రెండు విషయాలు కూడా అభివృద్ధి విషయంలో ఆటంకాలే!

కొంతమంది ఎప్పుడూ "బిజి" గా , హడావుడిగా ఉంటారు.
ఉదయం 6.30 కు నిద్ర లేవడం - 45 ని॥టాయిలెట్ , స్నానం - మరో అరగంట పేపర్ చదవడం - తరువాత టిఫిన్ చేసి ఆఫీస్ కు ప్రయాణం - 8 నుండి 9 వరకు ఒక గంట ప్రయాణం - 9 am నుండి 5 pm వరకు ఆఫీస్ - 5 pm నుండి 6 pm తిరుగు ప్రయాణం - మరో గంట స్నేహితులతో గడపడం - ఇంటికి వచ్చి అరగంట ఫ్రెషప్ కావడం - భోజనం - ఒక గంట TV చూస్తూ రిలాక్స్ కావడం - తరువాత నిద్ర.

చిన్న చిన్న మార్పులతో దాదాపు ఇలాంటి దినచర్య తో రోజంతా బిజీగా ఉంటారు. 

మానసికంగానేమో "ఉదాసీనత " లేదా " ఓత్తిడి "ని కలిగి ఉంటారు.దేనికైనా "టైం లేదు " అంటూంటారు.

అభివృద్ధి మాత్రం ఎక్కడున్నది అక్కడే ఉంటుంది.

ఒకసారి గొప్ప వారిగా ఎదిగిన వారి దినచర్యను మనం గమనిస్తే.. వారు ఎన్నో పనులు చేస్తూ కూడా ఇంకా సమయాన్ని మిగల్చుకుని తమ తమ అభిరుచులకు అనుగుణంగా ఆ సమయాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు.

ఎక్కడుంది తేడా !

అదే " క్రియాశీలత ''

క్రియాశీలుడైన వ్యక్తి ఉత్సాహం, క్రొత్తదనం, సన్నద్ధత కలిగిన మనసుతో ఎన్నో పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ తిరిగి ఆ పనుల నుండే మళ్లి మళ్లి ప్రేరణ పొందుతూ మానసికంగా "నవ యువకుడు"గా ఉంటాడు.

ఆరోగ్య పరంగా, కీర్తిపరంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, వ్యక్తిత్వ పరంగా, ఆథ్యాత్మికంగా .... ఇలా అన్ని రకాల అభివృద్ధి కోసం సమయాన్ని కేటాయించుకుంటూ నిరంతరం సాధన చేయడం అవసరం. అప్పుడే జీవితంలోని మాధుర్యం అర్థమౌతుంది.

సనాతన ధర్మం నిర్వచించే "పురుషార్థ సాధన "లో ఇవన్ని ఇమిడే ఉంటాయి.

" నాకు టైం లేదు", " నేను చాలా బిజీ " అని అనుకోవడం కూడా అభివృద్ధికి విఘ్న బీజంగా మారుతుందని శాస్త్రం చెబుతుంది.

ఇక రెండో అర్థమైన " మనో నిగ్రహం "గూర్చి.....

ఆభివృద్ధి సాధించాలనుకునే వ్యక్తి తప్పనిసరిగా మనో నిగ్రహాన్ని కలిగి ఉండాలి.దేనికీ బానిస కాకూడదు.

" నేను 'టి' తాగకుంటే తలనొప్పి వస్తుంది "...

" మద్యం లేకపోతే శరీరం వణుకుతుంది."....

" TV చూడకపోతే ఒంటరితనంతో పిచ్చి పట్టినట్లుగా ఉంటుంది " .....

ఇలాంటి భావాలకు సంబంధించిన అన్ని రకాల మానసిక బలహీనతలను జయించాలి.

అవసరమైతే ఎప్పుడైనా నిద్రపోగలగాలి. ఎప్పుడైనా నిద్ర నుండి లేవగలగాలి.అప్పుడు కూడా అంతే ఏక్టివ్ గా ఉండగలగాలి.
ఒకటి, రెండు రోజులు భోజనం లేకపోయినా తట్టుకోగలగాలి. జీవించడానికే ఆహారాన్ని తీసుకోవాలి కానీ, కేవలం తినడం కోసమే బ్రతకగూడదు.

" జిహ్వ చాపల్యం " వల్ల పొందే సుఖం - చాలా తక్కువస్థాయి సుఖం " అని శాస్త్రం చెబుతుంది.

నిరంతర అభ్యాసం వల్ల మనకు ఈ మనో నిగ్రహం పెరుగుతూ పోతుంది.
ఈ మనో నిగ్రహం వల్ల మానసిక స్థైర్యం అలవడుతుంది.

దీనినే సంస్కృతంలో "ధృతి" అంటారు.

మనలో ఏర్పడిన ఈ "ధృతి" ఆత్మవిశ్వాసాన్నీ ,సంతోషాన్నీ , తృప్తినీ ,వివేకాన్నీ ఏర్పరచి అభివృద్ధికి కారణమౌతుంది.

మన సర్వతోముఖాభివృద్ధిలో ఎదురయ్యే అన్ని రకాల అంతరాయాలనూ - విఘ్నాలను ఈ "ధృతి" వల్లనే అధిగమించగలుగుతాము.

ఈ "అవిరతి " అనే విఘ్న బీజం వల్ల చాలా మంది అభివృద్ధి విషయంలో ఆటంకాలను ఎదుర్కుంటారు.

ఈ విఘ్న బీజం తొలగడానికి ప్రతి రోజు బ్రాహ్మీ ముహుర్తంలో స్నానం చేసి వేయి సార్లు  "ఓం శ్రీం హ్రీం క్లీం ధృతిమతే నమ: " అనే గణపతి మంత్రాన్ని మనసులో అత్యంత ఏకాగ్రతగా జపించాలి.
                 

                               స్వస్తి .

(మరో రోజు గణపతి తొలగించే మరో విఘ్నం గూర్చి తెలుసుకుందాము.)

గణేశో విశ్వేఽస్మిన్ స్థిత ఇహ చ విశ్వం గణపతౌ
గణేశో యత్రాస్తే ధృతి మతిరనైశ్వర్యమఖిలమ్|
సముక్తం నామైకం గణపతిపదం మంగలమయం
తదేకాస్యం దృష్టేః సకలవిబుధాస్యేక్షణ సమమ్|| 
       

                      (ఓపికగా చదివిన వారికి )
                       ధన్యవాదములతో
                     గురుమంచి రాజేంద్రశర్మ



Tuesday, 6 September 2016

దిగులు పడడాన్ని తొలగించే మహాగణపతి


వినాయక నమోస్తుతే! - 3




రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

మన అభివృద్ధిని నిరోధించే విఘ్నాలలో మరొకటి దౌర్మనస్యం.

3. దౌర్మనస్యం (దిగులు )
---------------------------------------------

" దౌర్మనస్యం " అంటే దిగులు.

చాలా మందికి చాలా సార్లు ఈ దిగులు అనే విఘ్న బీజం ఏర్పడుతూ వుంటుంది.
" దిగులు " తో ఉండడం వల్ల నిరంతరం మనసు ఏదో కోల్పోయినట్లుగా ఉండి, తన స్థితి తనకే అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ "దిగులు" అనే విఘ్న బీజం అభివృద్ధినీ, జీవితాన్ని కూడా సార హీనం చేస్తుంది.

విజయాలు లేకపోవడం వల్ల.. పరాజయాల వల్ల ఈ దిగులు ఏర్పడుతూ వుంటుంది.
గతం వల్ల బాధ, ఉన్న స్థితి పట్ల అసంతృప్తి, లేదా భవిష్యత్తు పట్ల భయం ఈ దిగులుకు కారణమౌతాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే....

"దిగులు అంటే ఉత్సాహం కొరవడడమే!"

దీనికి పరిష్కారం తిరిగి మనలో ఉత్సాహాన్ని నింపుతూ ఉండడమే !

అందుకు ఈ " ఉత్సాహం " ఎలా ఏర్పడుతుందో అర్థం చేసుకోవాలి.
వాటిని ఈ క్రింద వివరిస్తున్నాను.

1) విజయాలు సాధించడం వల్ల...

ఇక్కడ విజయం అంటే ఏదో పెద్ద విషయమే కానక్కరలేదు.4 am కు నిద్ర లేద్దామనుకుని లేవడం కూడా విజయమే!.. ఇలాంటి చిన్న చిన్న విజయాలే భవిష్యత్తులో మరిన్ని పెద్ద విజయాలను ముందుకు తెస్తాయి.

(దీని గూర్చి " అలబ్ద భూమికత్వ" అనే విఘ్న బీజాన్ని వివరించే సందర్భంలో సమగ్రంగా వివరిస్తాను.)

2) క్రియాశీలవంతులతో స్నేహం, సాంగత్యం వల్ల....

3) సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల...

4) అంతర్వాణి మాటలను సరిగ్గా ఆచరించడం వల్ల....

5) నిస్వార్థం వల్ల.. (ఆశించకపోవడం, సేవ.. etc)

6) ఆత్మ విశ్వాసం వల్ల...

7) మనో నిగ్రహం వల్ల...

8) జ్ఞానం వల్ల... (ఉదా:- మంచి పుస్తకాలను చదవడం, మేధావంతులతో స్నేహం.. etc)

9) క్రొత్తదనం వల్ల...

(క్రొత్త ప్రదేశాలను దర్శించడం, అలవాటు లేని ఉపయోగపడే పనులను చేయడం - నేర్చుకోవడం, క్రొత్త విషయాలను నేర్చుకోవడం.. etc)

10 ) శరీరానికి అవసరమైన వ్యాయామం వల్ల.. (నడుక, ఆసనాలు.. etc)

11) అనవసర ఆహారం తీసుకోకుండా తేలికగా జీర్ణమయ్యే ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోవడం వల్ల.. ( జీర్ణశక్తిని మించి ఆహారాలు  తీసుకున్నపుడు ఉత్సాహం తగ్గుతుంది.)

12) ఏదో ఒక కారణంతో అనవసర పస్తులు ఉండకుండా తగినంతగా సారవంతమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల...

13) దుర్వ్యసనాలు మానివేస్తూ మంచి అలవాట్లను పెంచుకోవడం వల్ల...

14) ఎవరినీ ద్వేషించక పోవడం వల్ల.. ( తననూ, తన పరిస్థితులతో సహా..)

15) కళల వల్ల.. (కళలను నేర్చుకునే ప్రయత్నం చేయడం .. కళల ద్వారా ఆనందాన్ని పొందగలగడం.. etc)

16) క్రీడల వల్ల... ( ఏదో ఒక ఆటలను ఆడుతూ ఉండడం..etc)

17) ఆసక్తిని పెంచుకుంటూ అన్ని పనులను చేయడం వల్ల..

( పనులను నిర్లక్ష్యంగా చేయడం వల్ల ఉదాసీనత ఏర్పడుతుంది. క్రమేణా ఈ ఉదాసీనత దిగులుగా మారుతుంది.)

18) తెల్లవారు జామునే నిద్ర లేవడం వల్ల...

19) పెండింగ్ పనులను ఒక లిస్ట్ రాసుకుని పూర్తి చేయడం వల్ల...

20) తననూ, ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల..

21) పెద్దలను నిందించకపోవడం వల్ల..

 (మనం పెద్దలను నిందించినపుడు అది తప్పని మన సబ్ కాన్సియస్ మైండ్ లో నిక్షిప్తమౌతుంది. ఇలా చాలా సార్లు జరుగుతూ వుంటే భవిష్యత్తులో అది మనది మనకే అర్థం కాని దిగులుగా మారుతుంది.)

..... ఇలా రకరకాలుగా "ఉత్సాహం " పెరుగుతుంది.

ఉత్సాహం పెరగడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.

దిగులుగా ఉండేవారు ఈ విషయాలను పాటిస్తూ సాధన చేస్తూ వుంటే తొందరగా కోలుకుంటారు.

నిజానికి ఈ " ఉత్సాహం " అనేది అభివృద్ధి కే కాదు, మానవ జీవితానికే "బీజం " లాంటిది.

"నిరంతర ఉత్సాహం " అనేది బీజమైతే "బ్రహ్మనందం "దాని ఫలమౌతుంది.

ఒక్కొక్క సారి చెడు విషయాల వల్ల కూడా " తాత్కాళిక ఉత్సాహం" కలుగుతుంది.
ఇది "ఒక గాయాన్ని గోకితే వచ్చే సుఖం లాంటిదని " నీతి శాస్త్రం చెబుతుంది. ఇలాంటి తాత్కాళిక ఉత్సాహాలు దీర్ఘకాలికంగా మనకూ, మన అభివృద్ధికి నష్టాన్నే కలగజేస్తాయని అనుభవం మీద అర్థం అవుతుంది.

ఈ దౌర్మనస్యం (దిగులు ) అనే విఘ్న బీజం వల్ల ఎంతో మంది  ఆనందాన్నీ, అభివృద్ధినీ కోల్పోతుంటారు.

ఈ విఘ్న బీజం తొలగడానికి ప్రతి రోజు ప్రాత:కాలం స్నానం చేసి వేయి సార్లు  "ఓం శ్రీం హ్రీం క్లీం ప్రమోదాయ నమ: " అనే గణపతి మంత్రాన్ని మనసులో అత్యంత ఏకాగ్రతగా జపించాలి.
                

                                             స్వస్తి .

(మరో రోజు గణపతి తొలగించే మరో విఘ్నం గూర్చి తెలుసుకుందాము.)

ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్|
కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ |
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ |
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ ౹౹


       (ఓపికగా చదివిన వారికి )
              ధన్యవాదములతో
        గురుమంచి రాజేంద్రశర్మ
     
        శ్రీ రవీంద్ర జ్యోతిషాలయం



Monday, 5 September 2016

అనుమాన పడే గుణాన్ని తొలగించే మహాగణపతి

వినాయక నమోస్తుతే! 2

----------------------------------------------------



రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

మహా గణపతి తొలగించే విఘ్నాలలో మరొకటి సంశయం.

2. సంశయం (అనుమానాలు )
---------------------------------------------

అభివృద్ధి చెందడానికి అవరోధాలను కలిగించే మరో విఘ్నం "సంశయం."

సంశయం అంటే అనుమానాలు.

మనలో సోమరితనం - బద్ధకం - అజ్ఞానం పెరుగుతున్నా కొద్ది అనుమానాలు కూడా పెరుగుతుంటాయి.అంతే కాదు తెలిసి తెలిసి తప్పులు చేయడం వల్ల అనుమానపడినట్లే జరుగుతుంది కూడా! ఇది క్రమేణా మూఢ నమ్మకాలకు కారణమౌతుంది.

( ఇక్కడ మనకో సందేహం రావచ్చు! అజ్ఞానం కూడా పెరుగుతుందా అని.
మనలో కాన్సియస్ గా ఉండే స్థితి తగ్గుతూ ఉన్నదంటే అజ్ఞానం పెరుగుతుందనే అర్థం. మనలో కాన్సియస్ నెస్ తగ్గుతున్న కొద్ది జాగరూకత కూడా తగ్గుతుంది.అప్పుడు శ్రద్ధగా వినలేము. శ్రద్ధగా చదవలేము. శ్రద్ధగా మాట్లాడలేము. శ్రద్ధగా పని చేయలేము. అన్ని విషయాలలో నాణ్యత తగ్గుతుంది. నిజానికి సంపూర్ణ కాన్సియస్ స్థితి పొందడమే మోక్షం లేదా ఆత్మ జ్ఞానం. ఈ స్థితిని సాధించిన వారిని శాస్త్రం జ్ఞాని అని సంభోదించింది.)

మనలో అత్యధిక క్రియాశీలకశక్తి ఏర్పడినపుడు మనం ఏది చేసినా అది సరియైనదే అవుతుంది.అంతే కాదు, అది శాస్త్రాన్ని అనుసరించే ఉంటుంది.

ఈ విషయాన్ని నా జ్యోతిష అనుభవంలో కూడా పరిశీలించి చూశాను. క్రియాశీలత అధికంగా కలిగిన వారు జ్యోతిషం ( ముహూర్తం - జాతకం లాంటివి) ఏదీ చూసుకోకుండానే ప్రారంభించిన ముహూర్తాలను జ్యోతిష దృష్టితో పరిశీలించి చూసినపుడు అవి అద్భుతమైన ముహూర్తాలై ఉంటున్నాయి.అంటే కాలస్వరూపుడైన భగవంతుడు వారికి స్వయంగా సహాకరిస్తున్నాడన్న మాట!
నిజానికి అత్యధిక క్రియాశీల సంపన్నుడు శాస్త్రాన్ని అనుసరించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే శాస్త్రమే తానౌతాడు కాబట్టి!

అలాంటి వారి నుంచే శాస్త్రాలు ఏర్పడ్డాయి కాబట్టి! అయితే మనిషి సంపూర్ణ క్రియాశీలతను సాధించే వరకు మాత్రం శాస్త్రాన్ని అనుసరించవలసిందే!

( క్రియాశీలతను సాధించే మార్గంలో ఉన్న వ్యక్తికి మాత్రమే కాలం, ప్రకృతి శక్తులు సహాకరిస్తూ ఉంటాయి.)

ఈ " అనుమానాలు " అనేవి అభివృద్ధికి అతి పెద్ద విఘ్నాలు.

ఉదాహరణకు ....

ఒక పిల్లవాడికి ఏదో వాహనం వల్ల ప్రమాదం జరిగి కోలుకున్నాడనుకుందాము!
అతని తల్లిదండ్రులు అప్పటి నుండి అతన్ని బయటకు వెళ్లనివ్వకపోవడం -సిరియైన విధంగా ఆడుకోనివ్వకపోవడం - భయాన్ని నూరిపోయడం ..(అంతకు ముందు జాగ్రత్త లేక పోవడం, సంఘటన తరువాత అతి జాగ్రత్త పాటించడం..).... ఇలా అతని శారీరక తేజస్సుకు అవరోధాలు కల్పిస్తుంటారు. ఇది అతని అభివృద్ధిపై ప్రభావాన్ని చూపిస్తుంది.సాధారణంగా ఇలాంటి పిల్లవాడి తల్లిదండ్రులు జడస్తులై ఉంటారు.

గమనించ వలసిన విషయమేమిటంటే....

" అనుమానస్తులు అన్ని విషయాలు సేకరిస్తారు.కాని, ఏదీ ఆచరించరు. కారణాలను ఇతరులపైకో, పరిస్థితులపైకో నెట్టి వేస్తుంటారు. "

జడస్తుల అనుమానాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే...

"ఒక రోజు మొదటిసారిగా వాకింగ్ కు వెళ్లాడనుకోండి! అదే రోజు జ్వరం వచ్చింది. అప్పటి నుండి " నాకు వాకింగ్ అచ్చి రాదు" అని మనసులో బలంగా నిర్ణయించుకుంటాడు. ఈ వ్యతిరేక ధ్యానం వల్ల అతడు ఎప్పుడు వాకింగ్ కు వెళ్లినా ఏవో ఒక సమస్యలు ఏర్పడుతుంటాయి.
తరువాత " నాకు వాకింగ్ అచ్చి రాదు" అన్న స్థిర అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటాడు. తరువాత ''మనకు వాకింగ్ అచ్చి రాదురా !" అంటూ కుటుంబంలోని వారందరికి నూరిపోస్తాడు.ఇలా మూఢ నమ్మకాలు ఏర్పడుతుంటాయి.ఇవి అభివృద్ధిని నిరోధిస్తూ ఉంటాయి.

అనుమానస్తులు (జడస్తులు) ఎప్పుడూ ఎటూ నిర్ణయించుకోలేని స్థితి (కన్ ఫ్యూజ్) లోనే ఉంటారు.

ఇంకా భార్యా భర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య అనుమానాలు.. మున్నగునవి కూడా ఇందులోకే వస్తాయి. అనుమానపడే సంఘటనలు నిజంగానే జరిగినా, అనుమానపడినా కారణం మాత్రం జడత్వమే!(సోమరితనం - బద్ధకమే!)
దీనికి పరిష్కారం క్రియాశీలతను పెంచుకుంటూ పోవడమే! మనలో క్రియాశీలత పెరిగిన కొలది అనుమానాలు నశిస్తూ ఉంటాయి. అనుమానపడిన విషయాలకు కూడా పరిష్కారాలు లభిస్తాయి.
ఉపయోగపడే పనులతో ప్రతి క్షణం బిజిగా ఉంటూ క్రియశీలమౌతున్న కొద్ది " కేవలం రావలసిన ఆలోచనలే వస్తుంటాయి.

" ఆచరిస్తేనే తెలుస్తుంది... తెలుస్తు ఉన్నా కొద్ది ఆచరిస్తుంటాము. ఇది నిరంతర ప్రక్రియ. 

అంటే "కర్మ  నుండి జ్ఞానం"..." జ్ఞానం నుండి కర్మ " ఏర్పడుతున్నాయనీ,  కర్మజ్ఞానాలు రెండు వేరు వేరు కావనీ... అవి రెండూ ఏకీకృత రూపాన్ని పొందే ఉన్నాయని అనుభవ పూర్వకంగా తెలుసుకుంటాము.

ఈ సంశయం (అనుమానం ) అనే విఘ్న బీజం వల్ల ఎంతో మంది సరియైన సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకోలేక అభివృద్ధి పథంలో వెనుక పడుతుంటారు.ఈ విఘ్న బీజం తొలగడానికి ప్రతి రోజు ప్రాత:కాలం స్నానం చేసి పాదరక్షలు ధరించకుండా "ఓం శ్రీం హ్రీం క్లీం కళ్యాణ గురవే నమ: " అనే గణపతి మంత్రాన్ని మనసులో జపిస్తూ ఒక గంట సేపు (రెండున్నర ఘడియలు) వాకింగ్ చేయాలి.

                 స్వస్తి .

(మరో రోజు గణపతి తొలగించే మరో విఘ్నం గూర్చి తెలుసుకుందాము.)

నమోస్తు గణనాథాయ
సిద్ధిబుద్ధియుతాయచ |
సర్వ ప్రదాయ దేవాయ
పుత్రవృద్ధి ప్రదాయ చ ||



  (ఓపికగా చదివిన వారికి )
              ధన్యవాదములతో

       గురుమంచి రాజేంద్రశర్మ









మహాగణపతి తొలగించే విఘ్నలు - 1.అలసత్వం

వినాయక నమోస్తుతే!

------------------------------

   మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు 


రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

విఘ్నాలు తొలిగించే శక్తి ఉన్న ఒకే ఒక దేవతామూర్తి విఘ్నేశ్వరుడు . అందుకే విఘ్నాలు తొలగించే నాయకుడిగా విఘ్నేశ్వరుడిని పూజిస్తాం. 

దేవతాగణాలన్నింటికీ కూడా ఆయనే అధిపతి.అందుకే ఆయనను వినాయకుడు - గణపతి అనే పేర్లతో పిలుస్తున్నాము.


జాతకం లో ఉన్న కేతు దోషాలు తొలగడానికి మహా గణపతిని పూజిస్తుంటారు.

జ్యోతిషశాస్త్ర దృష్ట్యా కేతువుకు జ్ఞాన కారకుడు, మోక్ష కారకుడని పేరు.
జాతకంలో కేతువు అనుకూలంగా ఉంటే జ్ఞానాన్ని కలిగించి అనవసర బంధనాలను తొలగిస్తూ అభివృద్ధి పథంలో ప్రయాణింపజేస్తాడు.

అలా కాకుండా కేతువు వ్యతిరేక స్థానంలో ఉన్న వారికి అజ్ఞానం ఏర్పడుతూ అంటే బ్రమ, మాయలలో కూరుకుపోతూ వారు చేసే స్పృహ లేని పనుల వల్ల బంధనాలు ఏర్పడి పరాజయ మార్గంవైపు ప్రయాణిస్తూ ఉంటారు.మహా గణపతిని భక్తితో ఆరాధించడం వల్ల ఈ మాయా, బ్రమలూ, బంధనాలూ, విఘ్నాలు.. ఇవన్ని తొలగిపోతాయి.


మహా గణపతిని ఆరాధించడం వల్ల అభివృద్ధికి అంతరాయాలుగా ఉన్న విఘ్నాలన్నీ తొలిగిపోతాయి.

మరి ఈ విఘ్నాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎలా ఏర్పడుతాయి?

మహా గణపతి తొలగించే విఘ్నాలు  విఘ్న బీజాలు  గురించి వివరంగా తెలుసుకుందాము.

1) అలసత్వం


అలసత్వం అంటే సోమరితనం, బద్ధకం

ఈ రెండింటికీ కొద్దిగా తేడా ఉంది.


"వర్తమానంలో (అవసరమైన) ఉపయోగపడే పని విషయంలో ఏకాగ్రత లోపించడాన్ని"... సోమరితనం అంటాము.

అంటే ఉదాహరణకు 
ఒక విద్యార్థికి అవసరమైన ఉపయోగపడే పని - చదవడం. 

కాని అతనికి చదవడం పట్ల ఆసక్తీ - ఏకాగ్రత ఉండకుండా ప్రస్తుతం అవసరం, ప్రయోజనం లేని ఇతర వ్యాపకాలలో మునిగిపోవడం సోమరితనం అవుతుంది.

ఈ విఘ్నబీజం వల్ల భవిష్యత్తులో ఆ విద్యార్థి చదువు విషయంలో విఘ్నాలనూ, ఆటంకాలను ఎదుర్కొంటాడు.

అలాగే ఒక గృహిణికి అవసరమైన ఉపయోగపడే పని ఇల్లునూ - పిల్లలనూ - భర్తనూ శ్రద్ధగా చూసుకోవడం.
కాని ఈ విషయంలో ఆసక్తీ - ఏకాగ్రత ను కోల్పోయి TV సీరియల్లు - సెల్ ఫోన్ చాటింగ్ లలో మునిగిపోవడం, అలాగే TV సీరియల్లు చూస్తూ పిల్లల తో హోమ్ వర్క్ చేయించడం వంటివి చేస్తూ ఉంటే సోమరితనం అవుతుంది.

ఈ విఘ్నబీజం వల్ల భవిష్యత్తులో ఆమె పిల్లలు ...చదువూ - అభివృద్ధి విషయంలో వెనుకబడడం, కుటుంబ అభివృద్ధి మందగించడం, అనారోగ్యం, గొడవలు వంటి విఘ్నాలూ - సమస్యలు ఏర్పడుతుంటాయి.

మొత్తం మీద సోమరితనం అంటే అవసరమైన పనులనూ, ఉపయోగపడే పనులను నిర్లక్ష్యం చేసి అనవసర వ్యాపకాలలో మునిగిపోవడం.
ఇక
"శరీరాన్ని సుఖపెట్టాలనే కాంక్ష "  ను బద్ధకం అంటాము.

అంటే కూర్చుంటే లేవడం విసుగు . పనిచేయడం విసుగు .నడవడం విసుగు.
ఎప్పుడూ కాలు నొప్పి - కడుపు నొప్పి - భుజం నొప్పి - తలనొప్పి అంటూ సమస్యలను ఎకరువు పెడుతుంటారు.పోని అన్ని నొప్పులతో విశ్రాంతి తీసుకుంటారా?అంటే అలా ఉండదు. TV- ముచ్చట్లు - లాంటి వృథా కాలక్షేప వినోదాలలో మునిగిపోతారు.

ఇలా శరీరం లో సుఖ లాలసత ఏర్పడడం వల్ల శ్రమించడం అంటేనే విసుగు ఏర్పడుతుంది.కొద్దిగా శ్రమించే ఒక చిన్న పని కూడా ఏకాగ్రతగా చేయలేరు.
దీని వల్ల చేసే పనులలో నాణ్యత కొరవడి తన జీవితం- తనతో పాటు జీవించే వారి జీవితం కూడా నాణ్యత లేకుండా తయ్యారౌతుంది.

శ్లో|| అలసానాం మనుష్యాణాం సదా దు:ఖం దరిద్రతా I
ఆలస్యం పాతకం లోకే ఆలస్యం భూతి నాశనమ్ ॥
నాధిగచ్ఛన్తి భోక్తవ్య మలసాయే నరాధమా |
అలసానాం మనుష్యాణాం ప్రాప్తోZప్యర్థో వినశ్యతి ||
అని శాస్త్రం చెబుతుంది.

అంటే సోమరిపోతులూ - బద్ధకస్తులైన వారికి దు:ఖం, దరిద్రత వెన్నంటి ఉంటాయి. సోమరితనం ..అనేది పాప ఫలితం . సోమరితనం వల్ల ఐశ్వర్యమూ - అదృష్టం క్షయించబడుతాయి.వీరికి అనుభవించవలసిన శుభాలు కూడా విఘ్నాలు ఏర్పడి చేజారిపోతాయి.
అంటూ శాస్త్రం చెబుతూ ఉంది.

 మహాగణపతిని అత్యంత శ్రద్ధగా - భక్తిగా ఆరాధిస్తే మూలాధారం చైతన్యమౌతూ దోషాలు తొలగి ఈ అలసత్వం అనే విఘ్నబీజం తొలగిపోతుంది.

ఇక 

జ్యోతిషశాస్త్ర దృష్ట్యా చూసినపుడు...
జాతకంలో కేతువు అనుకూలంగా ఉన్న "జ్ఞాని " కర్మ ఫలాలకు అంటకుండా ఉండే అభ్యాసం చేస్తూ ఉంటే..

జాతకంలో కేతువు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి మాయలో, సుఖ లాలసత్వం అనే మైకంలో మునిగి కర్మలకు దూరంగా ఉండే అభ్యాసం చేస్తూ కర్మ ఫలాలను మాత్రం తీవ్రంగా ఆపేక్షిస్తుంటాడు. అంటే పని చేయకుండా ఫలితాన్ని కోరుతాడన్నమాట!

"దంత పాశాంకుశ విఘ్న పరుశు లడ్డు సంజ్ఞికా :I బీజాపూర హవ్య ముద్రా విఘ్నేన విఘ్న పూజనాత్॥" 

అంటూ శాస్త్ర గ్రంథాలు మహాగణపతి ఉపాసనలో ఉపయోగించే 7 ప్రధాన ముద్రలగూర్చి వివరిస్తున్నాయి.

ఈ  అలసత్వం అనే విఘ్న బీజం తొలిగి మూలాధార చక్రం జాగృతం కావడానికి దంత ముద్ర తో     "ఓం వక్రతుండాయ హుం " అనే మంత్రాన్ని 21 లక్షల జపం చేయాలి.

ఈ విధంగా చేస్తే అలసత్వం సమూలంగా తొలిగిపోతుంది.

లేదా

ఇదే మంత్రాన్ని జపం చేస్తూ ప్రతి రోజు ఉదయం - సాయంత్రం శక్తికొలది గుంజీలు తీసినా ఫలితం ఉంటుంది.
   

                స్వస్తి .

(మరో రోజు గణపతి తొలగించే మరో విఘ్నం గూర్చి తెలుసుకుందాము.)

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ I
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ॥


       (ఓపికగా చదివిన వారికి )
              ధన్యవాదములతో

నన్ను "నేను" తెలుసుకోవటానికి
నన్ను "నేను" మార్చుకోవటానికి
నన్ను "నేను" చేరుకోవడటానికి
మరియు అత్యుత్తమ జీవన విధానానికి
మీ ముందుకు "మహాగణపతి పూజ" తో వస్తున్నాను.        

గురుమంచి రాజేంద్రశర్మ













Monday, 29 August 2016

చంద్రుడు ఇచ్చే ఫలితాలు - దోషనివారణకు చంద్రకవచం

చంద్రుడు
---------------------------------------



రచన :- గురుమంచి రాజేంద్రశర్మ


భోజనం _ నిద్ర విషయంలో సరియైన విధంగా వ్యవహరించకుంటే చంద్రుని అనుగ్రహాన్ని కోల్పోతారు. లేదా చంద్రుని అనుగ్రహం లేకుంటే ఆ విషయాలలో సరియైన విధంగా ఉండలేరు.

భోజనం - నిద్ర అనేవి పునాది లాంటివి.వీటి విషయంలో మనం వ్యవహరించే విధానాన్ని బట్టే ప్రస్తుత మన మానసిక స్థితి ఉంటుంది.

ఆనందంగా ఉండాలనుకునే వ్యక్తి ఆరోగ్యం - పవిత్రత - అవసరం - సమయం అనే వాటిని దృష్టిలో ఉంచుకుని భుజించాలి. కాన్సియస్ తో భుజించాలి.

పాపం లేదా దోషాలు పెరుగుతున్న ఫుడు మనిషి స్పృహ లేకుండా తింటాడు.

ఒక మనిషికి వ్యతిరేక సమయం నడుస్తున్నపుడు ఎలా ప్రవర్తిస్తాడు.అలాగే అదృష్ట సమయం నడుస్తున్నపుడు ఎలా ప్రవర్తిస్తాడు. అనే దానిని "మహాభారతం " వివరించింది.

ఆ సందర్భంగా ఆహార అలవాట్ల ప్రస్తావన కూడా ఉంది.

ఉదాహరణకు...

ఒక మనిషికి వ్యతిరేక సమయం నడుస్తున్నపుడు.....

శ్లో|| యదాయ మతి కష్టాని సర్వాణ్యుపనిషేవతే| 
      అత్యర్థ మపివా భుంక్తే నవా భుంక్తే కదాచన॥


అంటే...

తనకు హాని కలిగించే విరుద్ధమైన ఆహార పదార్థాలను తింటూ ఉంటాడు.

ఒకప్పుడు జిహ్వ చాపల్యం వల్ల అతిగా తింటాడు. మరొకప్పుడు పూర్తిగా తినడాన్నే మానుకుంటాడు.

(పండ్లు ఫలాలు లాంటి ఆరోగ్యాన్ని కలిగించే పదార్థాలు ఇంట్లో మురిగి పోతుండగా చూస్తాడు కాని వాటిని తినాలనిపించదు.
పవిత్రపరిచే దేవుని ప్రసాదాలు చీమలు పడుతున్నా చూస్తాడు కాని, తాను తినడు - ఇతరులకు పంచి పెట్టడు. ఆయా విషయాల్లో అంతరాత్మ హెచ్చరిస్తూనే ఉంటుంది.కాని ప్రకాశవంతంగా లేకపోవడం వల్ల విరుద్ధంగా ప్రవర్తిస్తాడు.)

శ్లో || దుష్టాన్న మిషపానంచ యదన్యోన్య విరోధిచI 
       గురుచాప్య మితం భుంక్తే నాతి జీర్ణేZపివాపున:॥

తినకూడని, త్రాగకూడని పదార్థాలను సేవిస్తాడు. ఒకదానితో ఒకటి సరిపడని పదార్ధాలను తింటాడు.
బలం తక్కువ బరువు ఎక్కువైన వాటిని తింటూ ఉంటాడు.అంతేకాక, అంతకు ముందు తిన్నది జీర్ణం కాకముందే మరల పొట్టను నింపుతూ ఉంటాడు.

ఉదాహరణగా రెండు శ్లోకాలను మాత్రమే ఇచ్చాను.

నిద్ర కూడా వీలైనంత తొందరగా పడుకుని సూర్యోదయం లో పే నిద్ర లేచే ప్రయత్నం చేయాలి.

 అలాగే ఇంతకు ముందు చెప్పినట్లు....

జ్యోతిషశాస్త్ర దృష్ట్యా మానసిక శక్తికి చంద్రుడు కారకత్వాన్ని వహిస్తాడు.

జాతకంలో చంద్రుడు అనుకూలంగా ఉంటే దానర్థం... అతడు గత జన్మల నుండే మానసికంగా ఉత్సాహంగా ఉండడాన్ని అభ్యాసం చేస్తున్నాడన్నమాట!

ఎవరికైతే జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేడో అతడు గత జన్మల నుండే దు:ఖపడడాన్ని - నిరుత్సాహాన్ని - నెగిటివ్ థింకింగ్ ను అభ్యాసం చేస్తున్నట్లు అర్థం.

ఈ జన్మంతా వ్యతిరేక ఆలోచనలతో గడిపి మరణిస్తే వచ్చే జన్మ జాతకంలో చంద్రుడు పూర్తి వ్యతిరేక స్థానంలో ఉంటాడు.

ఒక వ్యక్తి చేసిన మంచి - చెడు అభ్యాసాలు సంస్కార రూపంలో జీవుని వెన్నంటి ఉంటాయి. ఆ సంస్కారాలనూ, ఆ సంస్కారాల వల్ల ఆతడు పొందబోయే ఫలితాలను జాతకం విశ్లేషిస్తుంది.

కాబట్టి ప్రస్తుత స్థితి అనేది గత కర్మల ఫలితం.భవిష్యత్తు మరింత బాగుండాలంటే అది మనం చేసే వర్తమాన కర్మలను బట్టి ఉంటుంది.

మనం చేసే కర్మలన్నింటిని ప్రధానంగా మనస్సే ప్రేరేపిస్తూ ఉంటుంది.

... అలా సరియైన విధంగా ప్రేరేపించే మానసిక శక్తిని - పాజిటివ్ థింకింగ్ ను - మంచి భావాలు వ్యాప్తి చేయడం - ప్రేమపంచడం - భోజనం, నిద్ర విషయంలో క్రమశిక్షణ - బావులూ చెరువులు త్రవ్వించడం - జల సంరక్షణ -  ఉత్సహంగా సంతోషంగా ఉండడం - వినయం - ప్రసన్నత- మాతృభక్తి - మంచి కీర్తి - మాతృభాషలో ప్రావీణ్యం - హాస్యాన్ని ఆస్వాదించడం ..... మొ॥ మంచి లక్షణాలు చంద్రుని అనుగ్రహం వల్ల లభిస్తాయి.

ఈ క్రింద "చంద్రకవచం" ఫైల్ ఇస్తున్నాను .దీని పారాయణం వల్ల చంద్ర సంబంధ దోషాలు తొలగడమే కాక చంద్ర సంబంధ ఆయా మంచి లక్షణాలు మనలో వృద్ధి పొందుతాయి.

(ఇక్కడ గమనించ వలసిన విషయం ఒకటుంది. ఉపయోగపడే ఏ పనులు మనకు చేయాలని అనిపించదో అందులోనే అదృష్టం దాగి ఉంటుంది.

సాధారణంగా మనస్సు ఎప్పుడూ ప్రయోజనం లేని పనుల వైపే లాగుతుంది.

ఈ క్రింద ఇచ్చే చంద్రకవచాన్ని డౌన్లోడ్ చేసుకోరు. ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నా  తన కోసం కాదన్నట్లు అలా జరుపుతూ వెళతారే కాని, చదవాలని అనిపించదు.
కాని ప్రతి సోమవారం చదివితే ఒక సంవత్సరం వరకు దీని ఫలితం ఏమిటో అర్థమౌతుంది.అదే సంస్కృత శబ్దాలకు ఉన్న మహాత్మ్యం.)


1. చంద్ర కవచం. ఇక్కడ నొక్కి డౌన్లోడ్ చేసుకోండి


2.లేదా ఇక్కడ నొక్కి చంద్రకవచం డౌన్లోడ్ చేసుకోండి



           ( ఓపికగా చదివినవారికి)
                ధన్యవాదములతో

           గురుమంచి రాజేంద్రశర్మ

         శ్రీ రవీంద్ర జ్యోతిషాలయం


Saturday, 27 August 2016

నజర్ ( దృష్టి దోషం లేదా నరఘోష ) తొలిగిపోవడానికి స్తోత్రం

నజర్ ( దృష్టి దోషం ) తొలిగిపోవడానికి రెమెడీ


రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

దృష్టిదోషం అంటే ఏమిటో కొంత వివరంగా తెలుసుకుందాం !

శబ్ద ,స్పర్శ ,రూప ,రస ,గంధాలు అనే వాటిని పంచతన్మాత్రలు అంటారు.

" బహిర్గతమైన ఆలోచనలే లేదా భావాలే శబ్దాలు ."

మనం మంచి శబ్దాలు(మాటలు) విన్నా మాట్లడినా మంచి ఫలితాలు రావడాన్ని గమనిస్తున్నాము.

అలాగే దీనికి వ్యతిరేకంగా చెడుశబ్దాలు విన్నా మాట్లడినా చెడు ఫలితాలు రావడాన్ని కూడా గమనిస్తున్నాము.

అలాగే పవిత్రంగా జీవించే మహాత్ముల స్పర్శ కూడా ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో రమణ మహర్షి , రామకృష్ణ పరమహంస , వివేకానందుడు వంటి మహాత్ములతో సహచర్యం చేసిన వారిని పరిశీలిస్తే అర్థమయ్యే విషయమే. 

అలాగే దుర్జన సాంగత్యం - వారి స్పర్శ మనని పతనం వైపూ లేదా కష్టాల వైపు నడిపిస్తుంది.

( మూడవది అయిన "రూపం "లోని విభాగమే దృష్టి కాబట్టి దీని గూర్చి చివరగా చెప్పుకుందాము.)

ఇక రసం అంటే రుచి - ఆహారం

"ఆహార శుద్ధౌ సత్వ శుద్ధి సత్వ శుద్ధౌ ధృవా స్మృతి . " అని శాస్త్రం.

మనం తినే ఆహారం కూడా మన గుణాలను ప్రభావితం చేస్తుంది.

కొన్ని ఆహార పదార్థాలు తింటే మనలో సాత్విక ప్రవృత్తి పెరుగుతుంది.

మరి కొన్ని ఆహార పదార్థాలు మన శరీరంలో రక్త ప్రసారాన్ని పెంచి అనారోగ్యం - ఆవేశం - కోపం పెరగడానికి కారణమౌతాయి.

ఇంకా కొన్ని ఆహార పదార్థాలు తమో గుణాన్ని పెంచి సోమరితనాన్ని - బద్ధకాన్ని - నిద్రమత్తును కలిగిస్తాయి.

ఇక గంధం అంటే వాసన

సువాసనలు - దుర్వాసనలు కూడా మన ఆలోచనలను ప్రభావితం చేసి తద్వారా మనచర్యలను ప్రేరేపించి మంచి - చెడులకు కారణమౌతాయి.

ఇక మూడవదైన రూపం సంబంధించిన వాటిలో వచ్చేది దృష్టి .

ఒకానొక గాఢమైన భావంతో కూడిన చూపును దృష్టి అంటాము. అది మంచిది కావచ్చు! చెడ్డది కావచ్చు!

మంచిదైతే పాజిటివ్ ఫలితాలను - చెడ్డదైతే నెగిటివ్ ఫలితాలను పొందుతాము.


దేవతల, మహాత్ముల, మన శ్రేయస్సును బలంగా కోరుకునే తల్లిదండ్రులు మొదలైన వారి "అనుగ్రహ దృష్టి - శుభ దృష్టి " మనకు మంచిని కలిగిస్తుందనేది తెలిసిన విషయమే!

ఎక్కువగా మౌనంగా ఉండే రమణ మహర్షి , కంచి పరమాచార్య వంటి మహాత్ములు తమను అనుగ్రహంతో చూసినపుడు "ఆ సమయంలో తమ మనసు కొన్ని క్షణాలు ఆలోచనా రహితమైన అవ్యక్త ఆనందానుభూతికి లోనై " తమ ఆలోచనలూ - జీవితం పూర్తిగా అభివృద్ధికర మార్గంలో ప్రయాణించినట్లు చాలా మంది భక్తులు చెబుతుంటారు.

రామకృష్ణ పరమహంస ఏకాంతంలో చేసిన స్పర్శ - అనుగ్రహ దృష్టి ప్రసారం వివేకానందునిలో ఎటువంటి మార్పులను కలిగించిందో వివేకానందుని చరిత్రను చదివిన వారికి తెలిసిన విషయమే !

అలాగే దీనికి వ్యతిరేకంగా మనని ద్వేషించే వారి, మనమంటే ఈర్శ్య కలిగిన వారి , అపవిత్రంగా జీవించే వారి, మనం అభివృద్ధి చెందకూడదు అని బలంగా కోరుకునే వారి దృష్టి ని "నర ఘోష - నజర్ - లేదా దృష్టి దోషం" అంటారు.

ఇది మనకు చెడును కలిగిస్తుందని పూర్వం నుండి పెద్దలు చెప్పే విషయం.

ఇటువంటి దృష్టి దోషాన్ని - నరఘోష ను (నజర్ ను) తొలగించే " దత్త మాలా మంత్రం " అనే ఫైల్ ను ఈ క్రింద ఇస్తున్నాను .దీన్ని ప్రతిరోజు 11 సార్లు చదవడం వల్ల ఎటువంటి దృష్టి దోషమైనా తొలిగిపోతుంది. బాగా బిజీగా ఉండేవారు కనీసం ఒకసారైనా చదువుకోండి.

సూర్యోదయం కన్నా ముందే స్నానం చేసి చదివితే మరింత మంచి ఫలితం ఉంటుంది.


1.దత్తమాలా మహా మంత్రం (ఇక్కడ నొక్కండి )

2.లేదా ఇక్కడ నొక్కి "దత్తమాలా మంత్రం "డౌన్లోడ్ చేసుకోండి


 ఇకపోతే ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది.

"నిరంతరం ప్రవహించే నీటి ప్రవాహానికి ఏ దోషం అంటదు. "  అలాగే   ఎప్పుడూ క్రియాశీలంగా -  ఏక్టివ్ గా జీవించే వ్యక్తులకు కూడా ఏ దోషాలు అంటవు.

" ఆగిన నీరే మురికిగుంటగా మారి దోషాలకు నిలయమౌతుంది."

అలాగే సోమరితనం - బద్ధకం - అధిక సుఖలాలసత ...మొ॥వి  మనని అభివృద్ధి మార్గంలో ఆగేటట్లుగా చేసి దోషాలకు కారణమౌతాయి. ఈ దుర్లక్షణాలను వీలైనంత తొందరగా వదిలించుకుంటే ఎప్పటికీ ఏ దోషాలు మనని అంటకుండా ఉంటాయి.

                                     స్వస్తి

                       (ఓపికగా చదివిన వారికి )
                            ధన్యవాదములతో

                 గురుమంచి రాజేంద్రశర్మ





Thursday, 25 August 2016

కృష్ణుడు - వ్యక్తిత్వ వికాసం

కృష్ణుడు

రచన:- గురుమంచి రాజేంద్రశర్మ

ఈ రోజు కృష్ణ జన్మాష్టమి

నిర్గుణ నిరాకార సచ్చిదానంద పరబ్రహ్మం... " దైవం మానుష రూపేణ " అన్నట్లుగా  ద్వాపర యుగంలో సగుణ రూపంగా నడయాడడానికి అవతరించిన దినమిది.

శ్లో|| “బ్రహ్మణో వయసా యస్యమిమేష ఉపచార్యతే
సచాత్మా పరమం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే”
                             
                                   (శ్రీ బ్రహ్మవైవర్త పురాణం)

తా॥ ఎవని కనురెప్పపాటు కాలం బ్రహ్మ ఆయుర్దాయమో అటువంటి ఆత్మ స్వరూపుడైన పరబ్రహ్మమే కృష్ణుడు అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది.

మరి అటువంటి కృష్ణుని జన్మదినం రోజున నాలుగు కొబ్బరికాయలు కొట్టి, ఉపవాసాలు ఉన్నంత మాత్రాన సరిపోతుందా?

పూజించడం అంటే ఏమిటి?

ఒక పుత్రుడు తండ్రిని పూజించడం అంటే ప్రతీ రోజూ కాళ్లు కడిగి నమస్కరిస్తూ తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే సరిపోతుందా?

అవన్నీ చేసినా చేయకున్నా తండ్రి చెప్పిన మంచి విషయాలను త్రికరణశుద్ధిగా ఆచరించినప్పుడే అది నిజమైన పూజ అవుతుంది.

ఇక్కడ కూడా వేలసంవత్సరాలుగా మనం ఎందుకు కృష్ణుని ఆరాధిస్తున్నామూ , పూజిస్తున్నాము.

" కర్షయతి ఇతి కృష్ణః "– అని కృష్ణ శబ్ద వ్యుత్పత్తి.

అంటే ఆకర్శించేవాడు కృష్ణుడు అని.

వేలసంవత్సరాలుగా కృష్ణుడు మనను ఎందుకు ఆకర్శిస్తున్నాడు.

అతని వ్యక్తిత్వమూ , గుణగణాలు . బోధలు ఏమిటి? వాటి గూర్చి కొంతవరకైనా తెలుసుకుని త్రికరణశుద్ధిగా ఆచరించినపుడు అది నిజమైన పూజ అవుతుంది.

కృష్ణుని వ్యక్తిత్వంలోని కొన్ని అంశాలను ఈ వ్యాసంలో చర్చించే ప్రయత్నం చేద్దాము.

1.కృష్ణుడు - ఉత్తమ స్నేహితుడు

శ్లో౹౹ పాపాన్నివారయతి యోజయతే హితాయ గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీ కరోతి !
ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే
షణ్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః !!

తా॥ ఒక మంచి స్నేహితుడు తన స్నేహితుడు పాపపు పనులు - తప్పుపనులు చెయ్యకుండా నివారిస్తాడు, మంచి పనులు చేసేలా చేస్తాడు;
తన స్నేహితుని లోని బలహీనతలు రహస్యంగా ఉంచుతారు, అతని సద్గుణాలను అందరికీ తెలిసేలా చేస్తాడు; 
ఆపదలలో ఉన్నప్పుడు వదిలిపెట్టడు, అవసరమైన సమయంలో సహాయం చేస్తాడు.

"ఈ ఆరు మంచి మిత్రుల లక్షణములు " అని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ ఆరు లక్షణాలే కాకుండా ఇంకా అనేక ఉత్తమ స్నేహలక్షణాలను కలిగిన ఉత్తమ స్నేహితుడు శ్రీకృష్ణుడు.

బాల్యంలో స్నేహాలు వేరు. వయసు వచ్చి వ్యక్తిత్వం ఏర్పడ్డాక ఉండే స్నేహాలు వేరు.
బాల్యంలో ఆటపాటల మాటున మంచి చెడులు తెలియని స్నేహంలో బాధ్యత ఉండదు. బంధం మాత్రమే ఉంటుంది.

కానీ ,విచక్షణా జ్ఞానం తెలిసిన తర్వాత ప్రతీ బంధంలోనూ అలాగే ప్రతీ పనిలో కూడా  ఒక బాధ్యత ఏర్పడినట్లే స్నేహబంధంలో కూడా ఒక బాధ్యత ఏర్పడుతుంది.

స్నేహ ధర్మమంటే అదే!

అంతే కానీ , స్నేహితులు చేసిన ప్రతీ పని అది మంచిది కానీ చెడ్డది కానీ  సరియైనది అని నమ్మడం , అనుసరించడం నిజమైన స్నేహధర్మానికి వ్యతిరేకం.

యుక్తాయుక్త విచక్షణాజ్ఞానం వచ్చిన తరువాత స్నేహితులలో ఎవరైనా తప్పుదారిలో వెళుతున్నప్పుడు హెచ్చరించడం చాలా ముఖ్యమైనది. స్నేహితుల్లో ఎవరికి అవసరమైనా సహాయం చేయడానికి ముందుకు వచ్చినట్లే, తప్పు అనిపించినపుడు చెప్పడం కూడా అత్యంత అవసరం.

ఈ స్నేహలక్షణాలన్ని మనకు శ్రీకృష్ణుని లో కనిపిస్తాయి.

అర్జునుడు యుద్ధ సమయంలో నిర్వీర్యుడైనపుడు, కర్తవ్యోన్ముఖుని చేసి శ్రీకృష్ణుడు తన స్నేహధర్మాన్ని చక్కగా అమలుపరిచాడు. చాలా సందర్భాలలో ఆవేశానికి గురియైన అర్జునుని  నివారించి సరియైన మార్గంలో నడిపించాడు.  అరణ్యవాస సమయంలో ఎప్పటికప్పుడు వారు  బలహీనతలకు గురియైనపుడు ధర్మమార్గాన్ని వీడకుండా స్నేహితుడై కాపాడాడు.

ధర్మప్రియులైనప్పటికీ, కష్టాల కొలిమిలో కొట్టుకుపోతున్నప్పుడు దారి తప్పే సందర్భాలు మానవులకు సహజం.
కాబట్టి ధర్మాచరణ చేయాలనుకున్న ఉత్తములైన పాండవులకు పరీక్షలు ఎదురైన సమయాలలో అండగా నిలిచాడు శ్రీకృష్ణుడు.
ఇందులో శ్రీకృష్ణుని స్వార్థప్రయోజనాలేవీ లేవు.

సహనాన్ని, మంచితనాన్ని, ధైర్యాన్ని పెంచడానికే శ్రీకృష్ణుని స్నేహధర్మం ఉపయోగపడింది. తద్వారా అర్జునుని ఆత్మోన్నతికి, అతడు పాశుపతాది అస్త్రాలను పొంది మరింత బలవంతుడూ, కీర్తిమంతుడు కావడానికి తద్వారా ధర్మసంస్థాపన జరిగి చివరకు సమాజహితానికి ఉపయోగపడింది.

చాలామంది దుర్యోధనుడు - కర్ణుని స్నేహం కూడా ఉత్తమ స్నేహంగా భావిస్తుంటారు.

కానీ అది తప్పు .

దుర్యోధనుడు ఏ తప్పు చేసినా ఇంకా రెచ్చగొట్టినవాడు కర్ణుడు. తన స్వంత యుక్తాయుక్త విచక్షణ ఏనాడూ ఉపయోగించి దుర్యోధనునికి మంచి చెప్పలేకపోయాడు. దుర్యోధనునికి దాసానుదాసునిగా తన ఆత్మను బానిసగా ఉంచి అధికారమదంతో ఏం చేస్తున్నా, అండగా నిలబడ్డాడు. అంతే కాదు మరింత రెచ్చగొట్టాడు.

అందుకే " కర్ణుడు లేకుంటే భారతమే లేదని " నానుడి వచ్చింది.

నిజానికి నిండు సభలోకి బుుత స్నాతయై ఉన్న ద్రౌపదిని ఈడ్చుకురమ్మని ఆజ్ఞాపించి మహాభారత యుద్ధానికి ఆజ్యం పోసింది కర్ణుడే!

అంతే కాదు స్నేహితుడైన దుర్యోధనుడు కష్టకాలంలో ఉన్నప్పుడు గంధర్వులతో యుద్ధంలోనూ - విరాట పర్వం  గోసంగ్రహణ యుద్ధంలోనూ స్నేహితున్ని వదిలి పారిపోయినవాడు కర్ణుడు. 
తన వ్యక్తిగత పంతాలకు పోయి భీష్ముడు మరణించే వరకు స్నేహితున్ని తన కష్టాలకు తనను వదిలి యుద్ధరంగానికి రానివాడు కర్ణుడు.

చివరకు తన మాటలూ - చర్యలతో రెచ్చగొట్టి దుర్యోధనునితో సహా కౌరవులందరూ పతనం కావడానికి కారణమయ్యాడు.

దూరదృష్టి - వివేకం లేనిపనులతో ఒక స్నేహితుడు ఎలా ఉండకూడదో దానికి ఉదాహరణగా కర్ణుడు నిలిస్తే....

ఒక మంచి స్నేహితుడు ఎలా ఉండాలో దానికి ఉదాహరణగా శ్రీకృష్ణుడు నిలుస్తాడు.

ఒక స్నేహితుడు తండ్రిగా అక్కున చేర్చుకుంటాడు. సోదరునిగా అనురాగాన్ని పంచుతాడు.గురువుగా ఉపదేశమిస్తాడు. శిష్యునిగా సేవిస్తాడు.నాయకునిగా నడిపిస్తాడు. అనుచరునిగా అనుసరిస్తాడు. ఒక బావ గా పరిహాసాలాడుతాడు.సహచర్యం కోసం ఒక ప్రేమికునిలా తహతహలాడుతాడు.

అందుకే ఒక కవి..

" కేన రత్నమిదం సృష్టం మిత్రమిత్యక్షర ద్వయమ్!"

' మిత్రం ' అనే రెండు అక్షరముల రత్నాన్ని ఎవరు సృష్టించారో కదా!!

అని ఆశ్చర్యపోతాడు.

ఈ స్నేహ లక్షణాలన్నీ మనకు శ్రీకృష్ణుని లో కనిపిస్తాయి.

ఇక శ్రీకృష్ణుని స్నేహశీలతకు దృష్ట్వాంతంగా నిలిచే మరో ఉదాహరణ కుచేలోపాఖ్యానం .

శ్లో౹౹ దదాతి ప్రతిగృహ్ణాతి
గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి !
భుంక్తే భోజయతేచైవ
షడ్విధం మిత్ర లక్షణమ్ !!

అని శాస్త్రం మిత్రుని లక్షణాలను వివరిస్తూ తెలుపుతుంది.

అంటే స్నేహితుడు తన మిత్రునికి తన దగ్గర ఉన్నవి ఇస్తాడు. అతను ఇవ్వగలిగినవి తాను ప్రీతితో తీసుకుంటాడు.అతని రహస్యాలను అడుగుతాడు. తనవి చెప్తాడు;  స్నేహితుడు ఇచ్చిన దానిని ఇష్టంగా తింటాడు. తన దగ్గర ఉన్న వాటిని స్నేహితునికి అనురాగంతో తినిపిస్తాడు.

ఈ లక్షణాలన్నీ కుచేలునితో స్నేహాంలో కనిపిస్తాయి.

కుచేలుడు తనశక్తికొలది తెచ్చిన అటకులను సిగ్గుపడుతూ ఇవ్వడానికి బిడియపడినా తీసుకుని ఇష్టంగా తిన్నాడు. చెప్పకున్నా కుచేలుని కష్టాలను అర్థం చేసుకుని తీర్చాడు. సాదరంగా ఆహ్వానించాడు. ప్రేమగా వీడ్కోలు పలికాడు. తన రాచ కార్యాలను కూడా ప్రక్కకు పెట్టి కుచేలునితో మచ్చటించాడు. ప్రేమ పూర్వకంగా కౌగిలించుకున్నాడు.

ఎటువంటి భేషజాలు లేని నిష్కల్మషమైన స్నేహాన్ని , శ్రీ కృష్ణుడు కుచేలునిపై చూపించిన సందర్భంలో చూడవచ్చు.

బంధుత్వాల కన్నా ఎప్పుడూ ఒక మెట్టు పైనుండే స్నేహాలకు కాలక్షేపమే కాక బాధ్యత కూడా ఎక్కువేనని శ్రీకృష్ణుని ఉదాహరణగా తీసుకుని మనం గ్రహించవలసిన అవసరం ఉంది.

    ( శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీకందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీకృష్ణుని మరిన్ని ఉత్తమ వ్యక్తిత్వ అంశాలను తరువాతి భాగాలలో తెలుసుకుందాము.)
                  స్వస్తి
               ధన్యవాదములతో
          గురుమంచి రాజేంద్రశర్మ


Tuesday, 23 August 2016

రవిగ్రహ ఫలితాలు - అనుగ్రహం పొందడానికి స్తోత్రాలు

రచన :- గురుమంచి రాజేంద్రశర్మ


సూర్యడు
---------------------------------------
జ్యోతిషశాస్త్ర దృష్ట్యా ఆత్మ శక్తికి సూర్యుడు కారకత్వాన్ని వహిస్తాడు.

ఆత్మశక్తి ఉద్దీపనం చెందిన వ్యక్తి మిగతా శక్తులను సులభంగా పొందుతాడు.

తండ్రిని గౌరవించని వ్యక్తి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండని వ్యక్తి, సమయ పాలన విషయంలో నిర్లక్ష్యం గల వ్యక్తుల జాతకాలను పరిశీలించినపుడు వారికి సూర్యుడు వ్యతిరేక స్థానాలలో ఉండడాన్ని మనం గమనిస్తాము.

సూర్యుని అనుగ్రహాన్ని పొందిన వ్యక్తులకు ఈ లోకంలో సాధించలేనిది అంటూ ఉండదు.
ఎందుకంటే సూర్యుని అనుగ్రహం వల్ల ఆత్మ ప్రకాశవంతమౌతూ ఎప్పుడూ కాన్సియస్ తో ఉంటాడు. అటువంటి వ్యక్తి అన్ని దోషాలనుండి విముక్తమౌతూ అన్ని విషయాల్లోనూ సరియైన ప్రవర్తనను కలిగి ఉంటాడు.

అలాగే ఒక వ్యక్తికి నాయకత్వ లక్షణాలు సూర్యుని అనుగ్రహం ఉంటేనే లభిస్తాయి.
ఒక నాయకుడు ఎప్పుడూ సూర్యుడిలా నియమబద్ధంగా - ధర్మబద్ధంగా నడుచుకుంటాడు. అప్పుడు మిగతావారు అతనికి అడ్జెస్ట్ అవుతూ అనుసరిస్తూ ఉంటారు.
సూర్యుని అనుగ్రహం లేని వ్యక్తి తాను అసంతృప్తిని అనుభవిస్తూ ఇతరులను తృప్తి పరిచే ప్రయత్నం చేస్తుంటాడు. దానివల్ల చివరకు తాను తృప్తిగా ఉండలేడు - అలాగే ఇతరులనూ సంతృప్తి పరచని స్థితి ఏర్పడుతుంది.

ఒక నాయకుడు ఎలా వ్యవహరించాలి అనే విషయం సూర్యున్ని చూసి నేర్చుకోవచ్చు!
సూర్యుడు ఇతరుల కోసం ప్రాత:కాలంలో ఉదయించడం లేదు. ఇతరుల కోసం అస్తమించడం లేదు. అది తన ధర్మం కాబట్టి ఈ పనులన్ని చేస్తున్నాడు. అప్పుడు లోకమంతా అతని ప్రవర్తనను అర్థం చేసుకుని తమ జీవితాలను అందుకు అనుగుణంగా మార్చుకుని సూర్యున్ని అనుసరిస్తుంది.
ఒక నాయకుడు కూడా సూర్యుని లాగే వ్యవహరించాలి.
తాను హృదయపూర్వకంగా నమ్మిన సిద్ధాంతాన్ని నియమబద్ధంగా ధృడమైనదీక్షతో ఆచరిస్తూ వెళుతున్నా కొద్దీ లోకం కూడా క్రమంగా అతన్ని అర్థం చేసుకుని అనుసరిస్తుంది.
విజయం పొందిన ఏ నాయకుల చరిత్రను చూసినా ఈ విషయం సత్యమైనదని అర్థమౌతుంది.

సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది.

రథస్యైకచక్రం భుజగనమితా సప్తతురగాః
నిరాలంబో మార్గశ్చరణవికలసారథిరపి
రవిర్యాతే వాన్తంప్రతిదినమపారస్యనభసః
క్రియా సిధ్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణె
అంటే ....
(పురాణాలు వర్ణించిన ప్రకారం )సూర్య భగవానుడు ప్రయాణించే రథానికి ఒకే చక్రం ఉంటుదట. ఆ రథాన్ని ఏడు గుర్రాలు లాగుతుంటాయి.ఇక ఆ గుర్రాలను పట్టి ఉంచే పగ్గాలేమో పాములు. ప్రయాణించే మార్గం...ఆధారం లేని ఆకాశ మార్గం. ఆ రథాన్ని నడిపే   రథ సారథి తొడల నుండి క్రింది భాగం లేని అంగ వైకల్యం కల అనూరుడు.
ఇన్ని కష్టాలతో కూడిన ప్రయాణం చేస్తుా  కూడా ఆకాశంలో సూర్యుడు  గతి - నియమం - ధర్మం తప్పడం లేదు. మహాత్ములకు ఏ ఉపకరణాలు లేకున్నా సమస్త కార్యాలు సిద్ధిస్తాయని పై శ్లోకం యొక్క అర్థం.

ఇలాంటిదే సూర్యవంశ సంజాతుడైన రాముని గూర్చిన మరో శ్లోకం ఉంది.

విజేతవ్యా లంకా, చరణ తరణీయో జలనిధిః
విపక్షః పౌలస్త్యః, రణభువి సహాయాశ్చ కపయహః | 
పదాతిర్మర్త్యోZసౌ,సకలమవధీద్రాక్షసకులమ్
క్రియా సిద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణైః||

భావము :- తాను జయించవలసినది ఏదో సామాన్యమైన పట్టణాన్ని కాదు. లంకానగరాన్ని.
అది నూరుయోజనాల సముద్రానికి అవతల ఉంది. శత్రుదుర్భేద్యమైనది.
గెలవడంమాటఅటుంచి అసలు అక్కడకు చేరుకోవడమే అసాధ్యమైనపని.
సముద్రాన్ని దాటడానికి తనవద్ద ఎటువంటి ఉపకరణాలు , అంటే
విమానాలు , నౌకలు వంటివి లేవు.పాదాలే శరణ్యం. ఒకవేళ చేరుకున్నా , శత్రువు సామాన్యుడు కాడు. రావణబ్రహ్మ. అత్యంత బలవంతుడు.ప్రకృతినే శాసించినవాడు, తపోసంపన్నుడు,వరసంపన్నుడు,
అష్టదిక్పాలకులను అదుపులో పెట్టుకున్నవాడు. త్రిమూర్తులలో
ఇద్దరికి అత్యంత ప్రియమైనవాడు. బ్రహ్మగారికి స్వయానా మనుమడు.
శివుడికి అత్యంత ప్రియభక్తుడు, బ్రాహ్మణుడు, ప్రతిరోజూ 9 కోట్ల శివలింగాలకు
స్వయంగా అభిషేకంచేసేవాడు, వేదపండితుడు,  ఇతన్ని
యుద్ధరంగంలో జయించాలి. మామూలువాణ్ణికాదు. పోనీ తనకేమైనా యుద్ధరంగంలో
సహాయం చేసేవాళ్ళు గొప్పవాళ్ళాఅంటే, చంచలస్వభావంకల కోతులు.
పోనీ తనపరిస్థితి చూస్తే, 14 సం. నుండి సరైన నిద్రాహారములు సరిగ్గా లేనివాడు.
మామూలు రాజకుమారులకుండే అన్ని సౌకర్యములకు దూరమైనవాడు.
పినతల్లి వల్ల కలిగిన అవమానభారంతో, భార్యావియోగంతో మానసికంగా
గడ్డుస్థితిని ఎదుర్కొంటున్నవాడు. ఇక తనలాంటివాడే తమ్ముడు.
అయోధ్యనుండి ఎలాంటి సైనికసహకారం లేదు.
ఇటువంటిస్థితిలో ఉన్న శ్రీరామచంద్రుడు,విజయం సాధించి
ఈభూమిమీద దుష్ట రాక్షసుడనేవాడిని మిగల్చకుండా చంపేసాడు.
కాబట్టి మహాత్ములు  లభించిన ఉపకరణాలనూ - అనుచరులనూ - పరిస్థితులనే తమకు అనుకూలంగా మార్చుకుని లక్ష్యాన్ని - విజయాన్ని సాధించగలరు.
ఆదే విధంగా నిజమైన నాయకులు ఎలాంటి అనుచరులూ - ఉపకరణాలు ఉన్నా , ఎన్ని కష్టాలు ఎదురైనా వాటినే తనకు అనుకూలంగా మార్చుకుని విజయం సాధిస్తారు.
ఇదిగో ఇలాంటి ధృతిని - నాయకత్వ లక్షణాలను ప్రసాదించేది సూర్యుడు.

ఇంకా
సమయ పాలన - ఇతరులను గౌరవించడం - దానగుణం - మాటకు కట్టుబడి ఉండడం -పితృభక్తి - ఆరోగ్యం పట్ల శ్రద్ధ - నాయకత్వ లక్షణాలు - అంత:శుద్ధి - హుందా స్వభావం - ఆత్మ విశ్వాసం - నిజాయితీ - రాముని లా ధర్మం,సత్యం విషయంలో కఠిన ప్రవర్తన... మిగతా విషయాలలో సున్ని తత్వం  - ఆర్థిక పరమైన స్పృహ లేదా అభిమానం - ఇతరుల వద్ద చెయ్యి చాపక పోవడం ..... మొ|| మంచి లక్షణాలు సూర్యుని అనుగ్రహం ఉంటే లభిస్తాయి.

ఈ క్రింది ఆదిత్య హృదయం ఫైల్ పై నొక్కి డౌన్లోడ్ చేసుకోండి. దీనిని పారాయణం చేయడం వల్ల ఆయా మంచి లక్షణాలు మనలో వృద్ధి పొందుతాయి.ఈ ఆదిత్య హృదయం రావణునిపై విజయం సాధించడం కోసం అగస్త్య మహర్షి స్వయంగా రామునికి ఉపదేశించాడు. ఇది చాలా మహత్యం కలిగింది.దీనిని ప్రతిరోజూ చదివితే మంచి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


ఈ క్రింది  "సూర్య కవచం " ఫైల్ పై నొక్కి డౌన్లోడ్ చేసుకోండి. ఇది చాలా మహిమాన్వితమైన కవచం. దీనిని శ్రద్ధగా పారాయణం చేయడం వల్ల సూర్యుని అనుగ్రహం లభించడమే కాక, పితృ దోషాలు జాతకంలో ఉన్న వారికి ఆ దోష ప్రభావం తగ్గి అన్ని విషయాలలో చక్కని అభివృద్ధి ఏర్పడగలదు.


ఇంకా ఇతర స్తోత్రాలు ఆదివారం చదవ వలసినవి.ఈ క్రింది ఫైల్స్ పై నొక్కండి.



                           స్వస్తి
                                 ధన్యవాదములతో
                         గురుమంచి రాజేంద్రశర్మ