Sunday 1 October 2017

మహా మేధావి కావడం ఎలా ???


     


“ఊళ్లో అందరూ నన్ను వెర్రిబాగుల వాడంటున్నారు స్వామీ… నేనేం చేసినా ఆటపట్టిస్తున్నారు...హౌలే హౌలే అంటూ ఎగతాళి చేస్తున్నారు....తెలివైన వాడిగా చెలామణీ అయ్యే ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకొండి స్వామీ.” అని వేడుకున్నాడు ఆ వ్యక్తి.

సాధువు అతని వైపు చూసి “రేపట్నుంచి ఊళ్లో ఎవరేమన్నా దానికి వ్యతిరేకంగా మాట్లాడు. 

అంతే కాదు!

బోల్డన్ని ఎదురు ప్రశ్నలు వేయి!

ఉదాహరణకు ..

ఎవరైనా ఆహా ప్రకృతి ఎంత రమణీయంగా ఉంది అన్నాడనుకో!

ఏం బాగుంది? ఏడ్చినట్టుంది. అసలు ప్రకృతి అంటే ఏమిటి? రమణీయం అంటే ఏమిటి? ప్రకృతి అసలు రమణీయంగా ఎందుకుండాలి? ఉండాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నలతో ఊదరగొట్టెయ్!

అందరు రామున్ని పూజిస్తే , రామున్ని ఎందుకు పూజించాలి? రావణుణ్ణి పూజించాలి! అను!
వారు కృష్ణుడు గొప్ప అంటే ,నువ్వు కాదు, కంసుడే గొప్ప అను! వారు ఆవును పూజిస్తామంటే , ఆవునే ఎందుకు పూజించాలి? బర్రెను-గాడిదను పూజించాలి!అను!
నీకు అర్థం కాని భాషలో ఉన్న గ్రంథాలన్ని తిరస్కరించు!నిందించు!
వాళ్ళు ఏది మాట్లాడితే దానికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడు!

ఈ కాలంలో అందరికి భిన్నంగా వినూత్నంగా (వెరైటీగా) ఉండడమంటే ,వినూత్నంగా మాట్లాడడమంటే..వినూత్నమైన పనులు చేయమంటే ..చెప్పలేనంత ఆకర్షణ. నువ్వు అలా లోకానికి భిన్నంగా చేస్తూనే ఉండు!

 ఎవరైనా దేవుడు దయామయుడు అంటే అసలు దేవుడెవరు? దేవుడున్నాడా? దేవుడు దయామయుడే ఎందుకు కావాలి? ఇలా ప్రశ్నలని గుప్పించు!

ప్రతి విషయానికీ ఇలాగే చెయ్యి. ఒక నెల తరువాత వచ్చి ఎలా ఉందో చెప్పు.” అన్నాడు.

సరిగ్గా నెల రోజుల తరువాత…

సాధువు ఆశ్రమం దగ్గర పెద్ద గోల….

తప్పెట్లు తాళాలు మోగుతున్నాయి. 

భారీ ఊరేగింపు వస్తోంది. 

ప్రజలు పూల వర్షం కురిపిస్తున్నారు.

వీరందరి మధ్య  వెర్రి బాగుల వాడు వస్తున్నాడు.

అందరూ ఆయన పాదాలపైన పడుతున్నారు.

పాదధూళిని కళ్లకద్దుకుంటున్నారు.

అతను భక్త బృందాన్ని బయట వదిలి సాధువును ఏకాంతంగా కలిశాడు.

“స్వామీ … వీళ్లంతా నన్ను మహా మేధావి అనుకుంటున్నారు. నాకు కూడా మహా మేధావిని అనే ఆత్మ విశ్వాసం వచ్చేసింది స్వామీ!  నా అడుగులకు మడుగులొత్తుతున్నారు. నాకు రాజోపచారాలు చేస్తున్నారు.” అన్నాడు.

“అంతే నాయనా… దేన్నయినా సమర్థించడానికి తెలివితేటలు కావాలి!

వ్యతిరేకించడానికి, మొండిగా వాదించడానికి తెలివితేటలు అక్కర్లేదు. అంతే కాదు. అడ్డదిడ్డంగా వాదించేవాడిని అందరూ మేధావి అనేస్తారు. అడుగులకు మడుగులొత్తుతారు.”

“మరిప్పుడేం చేయమంటారు స్వామీ?”

“నాయనా పులిని ఎక్కావు. ఇక ఇలాగే కంటిన్యూ చేయి నాయనా!

 బయటకు వెళ్లి నన్ను కూడా నాలుగు గట్టిగా తిట్టు! నిన్ను మరింత మేధావి అంటారు.”

వాడు సాధువు పాదాలకు మొక్కాడు.

బయటకు వెళ్లి….

“వీడొక దొంగ సాధువు. దోపిడీదారు. అసలు సాధువెలా అవుతాడు. ధ్యానం దేవుడి కోసం చేస్తున్నాడా లేక వేశ్య గురించి చేస్తున్నాడా.. ? దేవుడు అసలు లేనేలేనప్పుడు వీడెవరిని ధ్యానం చేస్తున్నాడు. నాతో చర్చల్లో మట్టి కరిచాడు. నా ప్రశ్నలకు జవాబే చెప్పలేకపోయాడు.” అని గట్టిగా తిట్లు తిట్టేశాడు.

ప్రజలు ,మీడియా “మహామేధావి” కి నీరాజనాలు పట్టసాగారు.


1 comment:

  1. ఇప్పుడున్న బ్లాగ్ పరిస్థితులకి అద్దం పట్టే రచన.

    ReplyDelete